మూలం : తోరు దత్
తెలుగు మూలం : బొల్లిముంత వెంకట రమణా రావు
“లక్ష్మణా… వినిపించదా?
ఆ వ్యథాస్వరము మళ్లీ అడవిని కంపింపజేసింది—
అది తప్పక రాముని కంఠధ్వని,
అది నా హృదయ నాడులను తాకే పిలుపు.
ఆ స్వరం పిల్లవాయువులో కాదు
నా రక్తప్రవాహాన్ని కలవరపరుస్తుంది
శత్రువుల వలయం అతన్ని బిగించి ఉండవచ్చు;
ఆ విలాపం సాధారణం కాదు—
మరణసీమను తాకే చివరి నిట్టూర్పులా ఉంది.
నీవెందుకు ఇలా స్థబ్ధుడిలా నిలిచావు?
ఏ ధర్మసంకల్పం నిన్ను ఈ క్షణంలో కట్టిపడేసింది?”
“ఇది ఆలోచనకు సమయమా?
నీ ఖడ్గం నడుముకట్టుకో,
నీ విల్లు చేతబట్టుకో!
నా మాటలు నీ చెవుల వరకేనా?
లేక నీ హృదయం వాటిని నిరాకరిస్తుందా?
అపశకునం గాలిలోనే తేలుతోంది—
నాకు అది స్పష్టంగా అనుభూతవుతోంది.”
“అవసరమైతే ప్రాణాలకైనా తెగించే ధైర్యవంతుడు నీవే కదా!
అందరూ ఆధారపడే రాముని తమ్ముడు నీవే కదా!
ఇప్పుడు నా ముందున్నది అదే లక్ష్మణుడా?
లేక విధి గీతలో చిక్కుకున్న అసముర్ధుడా
“నీవు కదలకపోతే
నేనే ఆయుధంతో
అడవిలోకి పరిగెత్తుతాను.
ముళ్లు నా పాదాలను రక్తపాతం చేసినా,
మృగాలు నా దారిని అడ్డుకున్నా,
చీకటి నన్ను మింగాలని యత్నించినా—
రాముని పిలుపు నన్ను ఆపదు.
ప్రేమకు భయం తెలియదు.”
“కాని నీ మౌనం
నా హృదయంలో అనుమానపు అగ్నిని రాజేస్తోంది.
రామునిపై నీ నిబద్ధత అపారమైతే
ఈ క్షణం ఎందుకు ఇంత నిశ్చలంగా నిలుస్తావు?
లేక నా భయం నన్నే
అన్యాయపు మాటలవైపు నెడుతోందా?”
లక్ష్మణుడు తలవంచి నిలిచాడు—
ధర్మం, విధి, ప్రేమ మధ్య చీలిపోయిన మనసుతో.
రాముని ఆజ్ఞ అతని అడుగులను బంధించింది;
సీత ఆర్తి అతని హృదయాన్ని గాయపరిచింది.
చివరికి అతడు మృదుస్వరంతో పలికాడు—
“అమ్మా, నా ప్రాణం మీ సేవకు అంకితం
కాని అన్నయ్య ఆజ్ఞను అతిక్రమించలేను.
ఈ రేఖ దాటవద్దు—
ఇది మీ రక్షణ వలయం.”
అతడు అడవిలో కలిసిపోయిన క్షణం
గాలి భారంగా మారింది.
సీత ఒంటరిగా నిలిచింది—
ప్రేమ, భయం, పశ్చాత్తాపం
ఒకే నిశ్శబ్దంగా కరిగిపోయిన స్థితిలో.
ఆ రాత్రి అడవి
తన ఊపిరినే దాచుకుంది.
చీకటి తన నీలి వస్త్రాన్ని విప్పి
విధికి మార్గం పరిచింది
![]()
Toru Dutt — జీవితం మరియు సాహిత్య ప్రస్థానం
తోరు దత్ భారతీయ ఆంగ్ల సాహిత్యంలో తొలి ప్రతిభావంతమైన మహిళా కవయిత్రుల్లో ఒకరు. 1856 మార్చి 4న కలకత్తాలో జన్మించిన ఆమె, కేవలం 21 సంవత్సరాల స్వల్పాయుష్షులోనే చిరస్థాయిగా నిలిచే సాహిత్య కీర్తిని సంపాదించింది. చిన్ననాటి నుంచే విద్యాభిలాష కలిగిన ఆమె కుటుంబంతో కలిసి యూరప్కు వెళ్లి ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాల్లో విద్యను అభ్యసించింది. ఫ్రెంచ్, ఆంగ్ల భాషలపై ఆమెకు ఉన్న ప్రావీణ్యం ఆమె రచనలకు విశాల దృక్పథాన్ని అందించింది.
తోరు దత్ రచనల్లో భారతీయ సంస్కృతి, పురాణ గాథలు, ప్రకృతి సౌందర్యం, జ్ఞాపకాల మాధుర్యం ప్రధానాంశాలుగా దర్శనమిస్తాయి. పాశ్చాత్య కవితా శైలిని భారతీయ భావజాలంతో మేళవించి ఒక ప్రత్యేకమైన స్వరాన్ని ఆమె సృష్టించింది. ప్రకృతిని ఆమె కేవలం దృశ్యంగా కాకుండా, భావోద్వేగాల ప్రతీకగా చిత్రించింది.
ముఖ్య రచనలు
- A Sheaf Gleaned in French Fields (1876) — ఫ్రెంచ్ కవితల అనువాద సంకలనం
- Ancient Ballads and Legends of Hindustan — భారతీయ పురాణ గాథల ఆధారిత కవితా సంకలనం
- ప్రసిద్ధ కవితలు:
- Our Casuarina Tree
- Lakshman
- Sita
సాహిత్య ప్రాధాన్యం
తోరు దత్ భారతీయ ఇతిహాసాలను ఆంగ్ల కవిత్వ రూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రుల్లో ఒకరు. ఆమె కవిత్వంలో ప్రకృతి పట్ల మమకారం, కుటుంబానుబంధం, దేశభక్తి, మరియు సంస్కృతి గౌరవం స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. చిన్న వయస్సులోనే మరణించినప్పటికీ, ఆమె రచనలు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించాయి.
ఆమె జన్మదినం మార్చి 4, 1856.




Discussion about this post