మూలం : Among women -Marie Ponsot
తెలుగు అనువాదం-హిమజ
స్త్రీలు ఎందుకు సంచరిస్తారు
ఎవరో కొందరా-కాదు,అందరూ.
కొంత మందేనా ,కాదు, చాలామంది.
చాలామంది స్త్రీలు అప్పుడప్పుడైనా
సంచరించాలని కోరుకుంటారు,
అందులో ఆశ్చర్యమేముంది
కొంతమంది- నేనూ వారిలో ఒకరిని
వాళ్ళు ఉన్నచోటునే కూర్చునే సంచరిస్తారు.
మా చిన్న అమ్మమ్మ
ప్రతి సంచార వ్యాపారి దగ్గరనుంచి
వస్తువులు కొనేది,
రంగు రిబ్బన్ల కోసమో, అల్లిన లేసుల కోసమో కాదు
వాళ్ల వెంట బెట్టుకు తెచ్చే
ఎక్కడైనా జీవించగల స్వేచ్ఛా పరిమళం కోసం.
నువ్వు ఎక్కడైనా నిదురించవచ్చు
నచ్చినప్పుడు బయటికి వెళ్లవచ్చు,
నీ ఆహారాన్ని, నీ సహచరులను
నువ్వే ఎంచుకోవచ్చు అని చెప్పేది.
కానీ ఏదీ నిన్ను బంధించనివ్వకు అని
కోల్పోయేదేమీ లేకుండా జీవించమని
సున్నితంగా హెచ్చరించేది.
ఆమె బలహీనంగా కనిపించేది,
ఆమె దేహంలో అధిక రక్తపోటు పరుగులున్నా
ఆమె కాళ్లకు నేల అడ్డుకాలేదు,
తట్టుకునే శక్తిని పెంచుకుంది
మళ్లీ మళ్లీ తట్టుకునే శక్తి.
ఆమె తన వేర్లు పాతుకున్న తోటను ప్రేమించింది,
తోట నిండా అల్లుకుపోయిన వేర్లున్నా
ఆమె మనసుకు మాత్రం సంకెలలు లేవు.
మనుమలను ప్రేమించింది,
మనుషులని ప్రేమించింది
ఒకప్పుడు అల్లరిగా,దుడుకుగా…
ఒకప్పుడు యవ్వనంతో ఉండి
ఇప్పుడు నిశ్శబ్దంగా నిలిచిన
తన మనిషిని ప్రేమించింది.
స్త్రీలు సంచరిస్తారు —
వాళ్లకు తెలిసినంతగా,
వాళ్లకు సాధ్యమైనంతగా.
స్త్రీలు సంచరిస్తారు —
వీధులపై కాదు సరిహద్దులు దాటుతూ,
తమ జీవితాలను తామే
రాసుకుంటూ…..
![]()

2005 నుండి కవిత్వం రాస్తున్నారు, ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ వీరి కవితా సంకలనాలు. తాజాగా అఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవితల అనువాదం పుస్తకంగా వచ్చింది. సంచిక అంతర్జాల పత్రికలో “పొయెట్స్ టుగెదర్” శీర్షికతో భిన్న కవుల విభిన్న కవిత్వాన్ని అనువదించి అందించారు.
సిసి రెడ్డి గారి ‘మనభూమి’మాసపత్రికలో ‘హిమశకలం’ పేరుతో సంవత్సరం పాటు కాలమ్ నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక లో పద ప్రహేళిక నిర్వహించారు. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి కవయిత్రి తొలి ప్రోత్సాహక పురస్కారం, రొట్టమాకు రేవు అవార్డు, అమృతలత అపురూప అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, కలేకూరి ప్రసాద్ స్మారక అనువాద పురస్కారం- అందుకున్నారు.
‘రెండు సంతకాలు‘ త్వరలో రానున్న కవితా సంకలనం
ప్రముఖ కవి రాజేందర్ జింబో హిమజ జీవన సహచరులుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.



