ఆంగ్లం: కె. సచ్చిదానందన్
తెలుగు : బొల్లిముంత వెంకట రమణా రావు
ఉప్పు
తొంభై ఏళ్ల క్రితం,
అలుపెరుగని
సముద్రపు అలల చెమటలోంచి
ఒక గుప్పెడు ఉప్పును
మేము తీసుకున్నాం.
పైకెత్తిన అరచేతిలో
అది వికసించింది—
లేత తెల్లని
ఒక పువ్వులా.
ఆ ఒక్క చేయి
ఒక్కసారిగా
సంకెళ్లతో బంధించిన
ఆరువేల చేతులైంది.
“సూర్యుడు అస్తమించని”
ఆ సామ్రాజ్యానికి ఎదురుగా
లక్షల పిడికిళ్లు
పైకెగిశాయి.
ఆ రోజు నుంచి
మన దేశంలో
సత్యానికి
‘చెరబడ్డ ఉప్పు’
అనే పేరొచ్చింది.
రాముడైనా,
అల్లాహ్ అయినా,
ఖుదా అయినా,
మెస్సీయా అయినా—
ఆ ఉప్పే
మాకు సర్వస్వం.
సముద్రపు నురుగులోంచి
వెలిసిన
ఒక ప్రవక్తురాలు.
మన వంటింటి గడప దాటిన
తెల్లని రెక్కల
ఒక దేవదూత.
మన కలలను కాపాడే
శాశ్వత రక్షకురాలు.
ఒక గుప్పెడు స్వేచ్ఛ.
ఒక గుప్పెడు సమానత్వం.
ఒక గుప్పెడు ప్రేమ.
ఒక గుప్పెడు దయ.
ఉప్పుతో మలచిన
ఒక బుద్ధుడు.
ఈరోజు మళ్లీ
సముద్రపు
ముదురు నీలి నేపథ్యంపై
తెల్లని ఉప్పు
జెండాను
మేము ఎగురవేస్తున్నాం.
నల్లని కురుల
స్వేచ్ఛ—
మన చిన్న చేతుల్లోంచి
జారిపోతున్న
ఒక క్షణిక దర్శనం.
మంచులా విస్తరించే
తెల్లని సమానత్వం—
దాని అడుగుసవ్వడి కోసం
ఇప్పటికీ
మన చెవులు
ఎదురు చూస్తూనే ఉన్నాయి.
చెమట పరిమళం నిండిన
గట్టిపడిన అరచేయి—
మన మాంసానికీ,
మన కన్నీళ్లకీ
ఉన్న అదే వాసన.
తిరుగుబాటు
ఇసుకరేణువులు పొదిగిన
న్యాయం అనే
ఆ గుప్పెడు ఉప్పు—
తొంభై ఏళ్ల క్రితం
దండి తీరంలో
గాంధీ
తన అరచేతిపై
ఎత్తిపట్టిన
అదే గుప్పెడు ఉప్పు.
![]()
ముళ్ల భాష
(“Cactus” కవితకు తెలుగు అనుసృజన)
ముళ్లే నా భాష.
రక్తం కారే స్పర్శతోనే
నా ఉనికిని ప్రకటిస్తాను.
ఈ ముళ్లు
ఒకప్పుడు పూలే.
ద్రోహాన్ని ప్రేమగా పిలిచినవారిని
ఇప్పటికీ క్షమించలేను.
ఎడారులను విడిచి
తోటల దారి పట్టిపోయారు కవులు.
ఇక్కడ మిగిలింది
ఒంటెల అడుగులే,
వర్తకుల ధూళియే.
నా పూలను
పాదాల కింద నలిపేస్తూ
వారు ముందుకెళ్తారు.
దొరికిన ప్రతి నీటి చుక్కకు
ఒక ముల్లు పెంచుకున్నాను.
సీతాకోకచిలుకలను
ఆకర్షించాలనే కోరిక లేదు.
ఏ పక్షీ
నా కోసం గీతం పాడదు.
కరువుకు
తలవంచడం నాకు రాదు.
వెన్నెలకు అవతల కాదు—
కలలకు ఇవతలే,
నేనొక కొత్త అందాన్ని
నెమ్మదిగా మలుస్తున్నాను.
గుచ్చుకునే పదునుతో,
రక్తాన్ని గుర్తుంచుకునే జ్ఞాపకంతో,
ముళ్లకే అర్థమయ్యే
మరో భాషను
సృష్టిస్తున్నాను.
![]()
కె. సచ్చిదానందన్ – కవి, అనువాదకుడు, మానవతావాది
కె. సచ్చిదానందన్ (K. Satchidanandan) భారతీయ ఆధునిక సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కవి, విమర్శకుడు, అనువాదకుడు, వ్యాసకర్త. 1946 మే 28న కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా పుల్లూట్ గ్రామంలో జన్మించిన ఆయన, మలయాళ భాషలో రచనలు చేసినప్పటికీ భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ పాఠకులకు పరిచయం చేసిన అరుదైన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందారు. కవిగా మాత్రమే కాకుండా ఆలోచనాపరుడు, సాంస్కృతిక కార్యకర్త, మానవ హక్కుల పరిరక్షకుడిగా కూడా ఆయన సేవలు విశేషమైనవి.
సచ్చిదానందన్ కవిత్వం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, మానవ హక్కులు, ప్రకృతి, ప్రేమ, శాంతి, వలసవాద వ్యతిరేకత, అణచివేతకు ప్రతిఘటన వంటి విశ్వమానవీయ విలువలకు స్వరమిస్తుంది. ఆయన కవితల్లో ప్రతీకాత్మకత, తాత్వికత, సమకాలీన సామాజిక చైతన్యం, మానవీయ స్పర్శ సమన్వయంగా కనిపిస్తాయి. సంక్లిష్టమైన భావాలను కూడా సరళమైన భాషలో, గాఢమైన కవితాత్మకతతో వ్యక్తీకరించడం ఆయన రచనల ప్రత్యేకత.
కొంతకాలం కళాశాల అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన, అనంతరం భారతదేశ అత్యున్నత సాహిత్య సంస్థ అయిన సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భారతీయ భాషల మధ్య సాహిత్య సంభాషణను బలోపేతం చేయడంలో, అనువాద సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో, భారతీయ రచయితలను ప్రపంచ సాహిత్య వేదికలకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సాహిత్య సదస్సులు, కవితా ఉత్సవాలు, సాంస్కృతిక సమావేశాల్లో భారతీయ సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించారు.
ఆయన కవితలు, వ్యాసాలు ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. అలాగే ప్రపంచ సాహిత్యంలోని ప్రముఖ కవుల రచనలను మలయాళంలోకి అనువదించి భారతీయ పాఠకులకు అందించారు. కవిత్వంతో పాటు వ్యాసాలు, సాహిత్య విమర్శ, అనువాదం, ప్రయాణ రచనలు, సంపాదకత్వం వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన చేసిన కృషి విశేషమైనది.
కె. సచ్చిదానందన్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. భారతీయ ఆధునిక కవిత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ స్వరాల్లో ఆయన ఒకరు. తెలుగు సాహిత్యంతోనూ ఆయనకు ఆత్మీయ అనుబంధం ఉంది. 2026లో ప్రదానం చేయనున్న 29వ డా. సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఆయన ఎంపిక కావడం, భారతీయ సాహిత్యానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు లభించిన మరో గౌరవంగా నిలిచింది.



