మూలం: మహమ్మద్ అబ్దుల్ మాలిక్ (బహ్రెయిన్)
స్వేచ్ఛానువాదం: ఎ.యం.అయోధ్యారెడ్డి
“మీ భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆస్పత్రిలో వున్నారు”
ఫోన్లో ఈ వార్త వినగానే బడా వ్యాపారవేత్త అబ్దుల్ రహ్మాన్ సతీమణి ఒక్కసారిగా కుప్పకూలింది.
అమె కింద పడిపోవడం చూసి ఇంట్లో అంతా కంగారుపడి పరిగెత్తుకొచ్చారు. అప్పటికే ఆమె కళ్ళు మూతపడ్డయి.
ఏదీ చెవులకు చేరలేదు. పిల్లల అరుపులు కూడా వినిపించలేదు. వెంటనే ఆంబులెన్స్కి ఫోన్ చేశారు. అఘమేఘాల మీద ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారు. హడావిడిగా ఫస్ట్ ఎయిడ్ చేశారు, కానీ ఆ ప్రయత్నం పనికిరాలేదు. తక్షణం ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగానే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.
ఆమె పిల్లలు ఐసీయూ వార్డు, డాక్టర్ల గదుల ముందు ఆందోళనగా పరుగులు పెట్టారు. వాళ్ళ మాటలు, అరుపులు, రోదనలు ఆసుపత్రి ఒక విభాగాన్ని భూకంపం వచ్చినట్టు కంపింపచేశాయి. అబ్దుల్ రహ్మాన్ దంపతులిద్దరూ ఒకేసారి.. ఒకే ఆస్పత్రిలో చేరడం, అందులోనూ ఇద్దరూ ప్రమాదకర స్థితిలో వుండటం నగరంలో అది పెద్ద వార్తే అయింది. అక్కడ వాళ్ళు అత్యవసర వైద్యసేవలకు, హైటెక్ ప్రాణరక్షణ యంత్రాలకు అనుసంధాన మయ్యారు.
ఒక పక్క ఈ గందరగోళం జరుగుతుండగానే మరో సంచలన వార్త బయటికొచ్చింది. ఆ వార్త అక్కడున్న విషాద పరిస్థితిని దాటి, ఒక మరణవార్త కన్నా మించిపోయే విధంగా వుండి అందరిని ఒక్కసారిగా కుదిపేసింది.
ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బడా వ్యాపారవేత్తకు ఎవరికి తెలియని రెండో కుటుంబం కూడా ఉందన్నదే ఆవార్త. మొదటి భార్యకు తెలియకుండా రహస్యంగా ఆయన ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది.
రెండో ఇంట్లో ఏర్పడిన గొడవల కారణంగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్త అప్పటికైతే పుకారు స్థాయిలోనే వుంది. అది నిజం అనేందుకు ఎలాంటి రుజువులు లేవు.
కొందరు ఆ పుకారుకు మరిన్ని అంశాలు చేర్చి కొత్త కథనాలు అల్లేశారు.
“అతని రెండో భార్య వయసులో చాలా చిన్నది. ముసలి భర్తను చాటుగా మోసం చేసింది. ఆయనకు వెన్నుపోటు పొడిచింది. ఆమె ద్రోహాన్ని తట్టుకోలేకనే గుండెపోటుకు గురయ్యాడు” అని మాట్లాడుకున్నారు.
ఇంకో ఆసక్తికరమైన కథనం ప్రకారం –
ఆమె నిజానికి అబ్దుల్ రెహ్మాన్ భార్యనే కాదు, ప్రేమికురాలు మాత్రమే. ఆయన అసలామెను పెళ్ళే చేసుకోలేదు. అందులో నిజం ఏదైనా ఉండనీ.. బడా వ్యాపారవేత్త రెండో పెళ్లి విషయం మొదటి కుటుంబంలో కలకలం సృష్టించింది.
“అరవయేళ్ళు దాటిన పెద్దమనిషి, తనకంటే ఎంతో చిన్నదైన యువతిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకోగలడు?” అనేది అందరి మనసుల్లో మెదులుతున్న ఏకగ్రీవ ప్రశ్న.
నగరంలో సంపన్నులు మాత్రమే నివాసం ఉండే ఆ కాలనీలో, ఈ పుకారు గాలి కంటే వేగంగా వ్యాపించింది. ఒక మనిషికి ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్, రెండు సార్లు భోజనం మాదిరిగా జనంలో ఈ విషయం అత్యవసర చర్చనీయాంశంగా మారిపోయింది. అన్నిచోట్ల దీని గురించే మాట్లాడుకున్నారు. ఆ మరుసటి రోజు కొన్నిపేపర్లు ప్రముఖంగా గాసిప్స్ కూడా ప్రచురించాయి. ఇంకా కొందరు ఔత్సాహికులు మరో అడుగు ముందుకేసి అసలు వాస్తవాలు వెతకడం మొదలుపెట్టారు.
చిట్టచివరికి తేలిందేమిటంటే… ఆ వ్యాపారవేత్త నిజంగానే యువతిని చట్టరీత్యా పెళ్లిచేసుకున్నాడు.
మరింత లోతుగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం రెండో భార్య అనబడే ఆ యువతి తన ఈడు వాడైన ఒక యువకునితో, ఇంట్లోనే.. తమ పడకగదిలోనే అక్రమ సంబంధం సాగించడం ఆ వ్యాపారవేత్త కంట్లో పడింది. ఆయన తట్టుకోలేక పోయాడు. ఏదో పెద్ద పన్నాగంతోనే ఆమె వృద్ధ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందని కూడా చెప్పుకున్నారు.
ఈ వదంతులు, నిత్య నూతన కథనాల మధ్య –
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతుల ఆరోగ్యం గురించి, వాళ్ళ విషమ పరిస్థితిని గురించి అందరూ మర్చిపోయారు. ఎందుకంటే, వాళ్ళ దృష్టిలో ఒక భార్య భర్తకు చేసిన నమ్మక ద్రోహం, చావుబతుకుల సందర్భం కంటే ఎక్కువ ఆసక్తి కలిగించే విషయం.
వాళ్ళు పెద్దాయన రెండో భార్య తరఫు బంధువుల గురించి, ఆమె యువ ప్రేమికుని గురించి ఆరాలు తీశారు.
వాళ్ళమధ్య ఎంతకాలంగా అక్రమ సంబంధం సాగుతుంది? బడా వ్యాపారవేత్త ఆమెను ఎప్పుడు.. ఎక్కడ పెళ్లిచేసుకున్నాడు?
ఇవన్నీ వివరంగా సేకరించారు.
ఆ యువ భార్యకి పిల్లలు ఉన్నారా? ఉంటే ఎంత మంది? వాళ్ళు కూడా వ్యాపారవేత్త వారసత్వంలో భాగస్థులేనా? ఆయన ఆస్తిలో వాళ్ళకూ హక్కు వుంటుందా? అసలు ఈ విషయం ఆయన మొదటి భార్యకి తెలుసా? ప్రస్తుతం కోమాలో వుందని చెపుతున్నారు. కోమా నుంచి బయటపడిన తర్వాత ఈ సంగతి చెప్పాలా?” ఇవన్నీ తర్జనబర్జన పడ్డారు.
భార్యాభర్తలు ఇద్దరిదీ విషమ పరిస్థితే. ఇద్దరిలో ముందుగా ఎవరు పోతారు? అదృష్టవశాత్తు ఊహించని విధంగా భర్త బ్రతికి బయటపడితే ఏ ముఖం పెట్టుకుని తన మొదటి భార్యను చూడగలడు? అతన్ని ఎంతగానో ప్రేమించిన ఆమెకు ద్రోహం చేసి ఏం సమాధానం చెప్పగలడు?
ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో ఊహాగానాలు.. పరస్పర విరుద్ధ వ్యాఖ్యానాలు చిలువలు పలువలై వ్యాపించినయి.
![]()
బయట జోరుగా సాగుతున్న ఈ వదంతులు గానీ, వాటికి సంబంధించిన నిజానిజాలు గానీ ఆ కుటుంబ సభ్యులకు తెలియలేదు. ఎందుకంటే, ఇంట్లో వాళ్ళంతా ఆసుపత్రిలోనే కూర్చున్నారు. ఆయన పిల్లలు, బంధువులు, వ్యాపారంలో భాగస్వాములు, దగ్గరి స్నేహితులు అందరూ ఆస్పత్రి కారిడార్లలోనే ఆందోళనతో ఉన్నారు. మాటిమాటికి డాక్టర్లను సంప్రదించి పరిస్థితి తెలుసుకుంటున్నారు. అవసరమైతే వాళ్లిద్దరిని విదేశాలకు తీసుకెళ్ళి వైద్యం చేయించాలని అనుకున్నారు. లండన్, అమ్మాన్, ఫ్రాంక్ఫర్ట్ లోని కొన్ని పేరున్న ఆస్పత్రులకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వీటిల్లో ఏ దేశానికి తీసుకెళ్లాలి? ఎక్కడ మంచి కార్డియాక్ యూనిట్ ఉంది? పౌర విమానంలో వెళ్ళడం ఎంతవరకు సరైంది? అనే విషయాలపై చర్చలు జరిగాయి.
అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్లు ప్రయాణాన్ని తట్టుకోగలరా అన్న విషయం మాత్రం ఆ టైములో ఎవరికి గుర్తుకు రాలేదు.
క్రమంగా బయట వదంతుల జోరు తగ్గిపోతూ వొచ్చింది. ఎవరికి వారే మరిన్ని కొత్త వివరాలు బయటికి వస్తాయేమోని చూస్తున్నారు. అందరూ భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యల పైనా వాటికి పరిష్కారాల పైనా దృష్టి పెట్టారు.
పెద్దాయన ఆరోగ్యం బాగుపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయితే, తిరిగి వ్యాపార వ్యవహారాలు చూసుకోగలడా?
అసలు ఆయన పూర్తిగా కోలుకుంటాడా? ఒకవేళ బతికి బట్టకట్టినా బాధామయ జీవితం గడపాల్సి వస్తుందా?
“ఇంతకాలం ఇష్టారాజ్యంగా బతికాడు. చేతి నిండా డబ్బుందని సమస్త విలాసాలు అనుభవించాడు. కంటికి నచ్చిన ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాడు. అదే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది” అని కొందరు కొత్త కోణంలో విమర్శలు గుప్పించారు.
ఇదెలా సాగుతుండగానే విధి మరో ముగింపు పలికింది. వ్యాపారవేత్త ఐసియూలో మరణించాడు. అతనికి అమర్చివున్న అధునాతన వైద్య పరికరాలు అతని పల్స్ ఆగిపోయిన విషయాన్ని ధృవీకరించాయి.
నిజానికి ఈ కొద్దిరోజులు కూడా ఆయన క్లినికల్గా మాత్రమే బతికినట్టున్నాడు.
వ్యాపారవేత్త చావును డాక్టర్లు ప్రకటించగానే కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది.
మొదటి భార్య ప్రస్తుత పరిస్థితి.. భర్త ఆమెకు చేసిన అన్యాయం.. ఈ రెండు భావనల మధ్య బంధుమిత్రులు బాధపడ్డారు.
వాళ్ళు రెండో భార్య గురించి కూడా ఆలోచించారు. ఆమె ప్రియుని వ్యామోహంలో చిక్కుకుని తనకు జీవితాన్ని ఇచ్చిన వృద్ధ భర్తను ఎలా మోసగించ గలిగింది? ఆమె చేసిన నైతిక ద్రోహమే ఆయన్ని ఆస్పత్రి వరకూ తెచ్చి ప్రాణాలు పోయేలా చేసింది.
తెలిసినవాళ్లు, అభిమానులు పెద్దఎత్తున ఇంటికి వచ్చి ఆయన భౌతికకాయాన్ని దర్శించి సంతాపం తెలిపారు.
అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన ఇద్దరు భార్యలు, పిల్లల భవిష్యత్తు, వారసత్వ సమస్య.. ఇవన్నీ చర్చకు వచ్చాయి.
రెండో భార్యను దివంగత వ్యక్తి ప్రియురాలుగానే భావిస్తూ పలువురు మాట్లాడుకున్నారు తప్ప ఆమెను హక్కుదారుగా భావించలేదు.
దివంగత వ్యాపారవేత్త సమాధిపై మట్టి పూర్తిగా ఎండిపోక ముందే మరో వార్త బాంబులా పేలి ఎవరికీ నోటమాట రాకుండా చేసింది.
దివంగతుని అందమైన రెండో భార్య త్వరలోనే తన ప్రియున్ని పెళ్లాడబోతుంది.
ఇంటికి పిలిచి, పడక గదిలోకి ఆహ్వానించి అతనితో తప్పుచేసిన ఆమె, తన భర్త గుండెపోటుకు కారణమైన అదే యువకుణ్ణి ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధపడటాన్ని అందరు విమర్శించారు.
ఒకరోజు రాత్రి, నైట్క్లబ్లో ఆమె తన కాబోయే భర్తతో కలిసి టాంగో సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం కొంతమంది చూశారు. మొదటి భార్యకు ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఆమె ఇంకా కోమాలో ఉన్నది.
ఇప్పుడామె ఆరోగ్య స్థితిపైనే అంతా దృష్టి పెట్టారు. ఈ విషయాలు తెలిసి ఆమె తట్టుకోగలదా? పాపం.. ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది. కానీ అతడు ఆమెకు ద్రోహం చేశాడు. తన ప్రేమను మరో స్త్రీకి పంచాడు. అలాంటి భర్తకు గుండెపోటు వచ్చిన వార్త విని ఆమె ఆస్పత్రి పాలవడం ఎవరికి నచ్చలేదు. తను కోలుకున్న తర్వాతనైనా జరిగింది చెప్పక తప్పదు. మరోసారి అటాక్ వస్తుందేమో. “భర్త మరణం, అతను చేసిన ద్రోహం, మరో స్త్రీని పెళ్లి చేసుకోవడం, రెండో భార్య తన ప్రేమికునితో ఇంకో పెళ్ళికి సిద్ధపడటం ఇవన్నీ ఎలా భరిస్తుంది?” అని పలువురు ఆందోళన చెందారు.
చివరికి ఆమె కోమా నుండి బయట పడింది. కళ్ళు తెరిచిన వెంటనే ఆమె అడిగిన తొలి ప్రశ్న – “నా భర్తకు ఎలా వుంది?”
తను జీవితమంతా ప్రేమించిన ఆ మనిషి గురించి మాత్రమే తొలుత అడిగింది. ఆందోళనతో దుఃఖించింది.
ఆమె భర్త ఐసియూలో ఉన్నాడని వాళ్ళు అబద్ధం చెప్పారు. అదివిని ఆమె మళ్ళా ఏడ్చింది.
పెద్ద కుమార్తె సర్దిచెప్పింది.“ఇప్పుడు ఫరవాలేదమ్మా.. నాన్న క్రిటికల్ స్టేజ్ దాటేశాడు.”
ఆమె అప్పటికీ ఏడుపు ఆపుకోలేకుండా ఉన్నది.
డాక్టర్ పెద్ద కుమార్తెని పక్కకి పిలిచి “ఇప్పుడే ఆమెకు అసలు నిజం చెప్పకండి” అన్నాడు.
“అట్లా ఎన్నిరోజులు దాచి పెడతాం డాక్టర్, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా?”
“ఇప్పుడే తెలిసేకంటే, కొంతకాలం దాచడమే మంచిది. ఆమె పూర్తిగా కోలుకున్నాక చెప్పొచ్చు” డాక్టర్ చెప్పాడు.
“ఆమె ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేదేమో” ఎవరో చిన్నగా అన్నారు.
“అమ్మ నిజం తెలుసుకుని తట్టుకోగల స్థితికి వస్తుందని నేనూ అనుకోవడం లేదు” ఆమె పెద్దకొడుకు అన్నాడు.
తర్వాత కొన్ని రోజులకు మరో ఘట్టం ప్రారంభమైంది.
దివంగతుని ఆస్తిపాస్తులు ఎవరెవరికి.. ఎంతెంత చెందుతాయన్నది తెలుసుకోవాలని అందరికి ఆత్రుత. అందరికి తదుపరి ఈ ఘట్టమే ఆసక్తికరంగా ఉన్నది. అసలు వారసులు ఎవరు? మొత్తం ఆస్తిలో మొదటి భార్యకు ఎంత? రెండో భార్యకు ఎంత?
తవ్వేకొద్దీ నిధులు బయటపడినట్టు రెండో భార్యకు చెందిన మరో రహస్యం వెల్లడైంది. వ్యాపారవేత్తను పెళ్లిచేసుకునే నాటికే ఆమె వివాహితురాలు. ఆమెకు జరిగింది కూడా రెండోపెళ్ళే. అంతేకాదు, ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. ఇద్దరు కాదు ముగ్గురని కొందరు.. కాదు నలుగురని ఇంకొందరు చెప్పుకున్నారు. అయితే వాళ్ళు అందరూ మగపిల్లలే అనికూడా తెలుసుకున్నారు.
ఇద్దరు మహిళల జీవితంలో భర్త పాత్ర పోషించిన ఆ పెద్దాయన ఇప్పుడు లేడు. ఆయన వారసత్వ సమస్య ఎన్ని వివాదాలకు దారితీస్తుందో అని అనుకుంటున్నారు. ఆ యువతిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదు గనుక ఆమెను భార్యగా న్యాయస్థానం అంగీకరించక పోవచ్చన్నారు. అందువల్ల యావదాస్తికి మొదటి భార్య, ఆమె పిల్లలు హక్కుదార్లు అవుతారని చాలామంది భావించారు.
ఇదిలావుంటే.. ఒకరోజు, దివంగత వ్యాపారవేత్త యువ భార్య సెషన్స్ కోర్టు కారిడార్లలో నల్లటి హిజాబ్లో ఎవరికో కనిపించింది.
అంతేకాదు, నిన్న రాత్రి జాహిల్ రెస్టారెంట్లో ఆమెను హిజాబ్ లేకుండానే చూశానని మరొకరు చెప్పారు.
పరిస్థితి ఇప్పుడు చివరి ఘట్టంలోకి దూసుకెళ్లింది.
ఖాకీ దుస్తులు ధరించిన కోర్టు ప్రతినిధి ఒకరు సైకిల్ మీద ఆ కాలనీకి వొచ్చాడు. పార్కు సమీపంలో ఆమె వుండే ఇంటి గేటు ముందు నిలిచి బెల్లు కొట్టడం కొందరు చూశారు. ఇన్నిరోజులు అజ్ఞాతంగా వుంటూ వచ్చిన ఆమె ఇప్పుడు బయటికొచ్చి అందరికి కనిపించింది.
మొదటి కుటుంబానికి ఒకేసారి రెండు ఎదురుదెబ్బలు తగిలినయి. ఒకటి తండ్రి మరణమైతే రెండోది ఆయన రహస్య రెండో వివాహం.
వాళ్ళింకా పూర్తిగా కొలుకోలేదు. ఇప్పుడు ఆస్తుల పంపకం పేరిట మూడో దెబ్బ స్పష్టంగా కనిపిస్తోంది.
న్యాయస్థానం నిర్ధారించిన తేదీన రెండు కుటుంబాలు కోర్టుకు చేరుకున్నయి.
మొదటి భార్య, రెండో భార్య ఇద్దరూ అక్కడ ముఖాముఖి ఎదురుపడ్డారు.
ముందుగా న్యాయమూర్తి రెండు కుటుంబాల యజమాని అయిన దివంగత వ్యాపారవేత్త మరణ ధృవీకరణ పత్రాన్ని చదివి వినిపించాడు. తర్వాత, మొదటి భార్య తరఫున వారసులైన హక్కుదార్ల పేర్లు చదివాడు. ఆ వెంటనే, రెండో భార్య పిల్లల పేర్లు చదివి వారిని కూడా వారసులుగా ప్రకటించాడు. రెండో భార్యకు నలుగురు సంతానం. అందరూ అబ్బాయిలే.
![]()
అబ్దుల్ మాలిక్ పరిచయం
బహ్రయిన్ కథా రచయిత మహమ్మద్ అబ్దుల్ మాలిక్ మనామాలోని అల్-హూరాలో జన్మించారు. 1960ల నుంచి కథలు రాయడం ప్రారంభించి, 1966 నాటికి తొలి కథల సంపుటి ప్రచురించారు. అది బహ్రయిన్లో కథ ఉద్యమానికి పునాది వేసింది. 1969లో ఏర్పడిన బహ్రయిన్ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. అబ్దుల్ మాలిక్ కథల్లో వాస్తవికత, హాస్యం, మానసిక సంక్లిష్టత ఉంటాయి. చెహొవ్, జేమ్స్ జాయిస్, హెమింగ్వే వంటి దిగ్గజ కథకుల ప్రభావం ఆయన శైలిలో కనిపిస్తుంది.
‘మౌత్ సాహిబ్ అల్-అరబా’, ‘సులూమ్ అల్-హవా’, ‘ఫుర్సా వాహిదా లిల్-మౌత్’ కథా సంకలనాలు ఆయన కథల్లో ఎక్కువ ఆదరణ పొందిన ప్రధాన రచనలు. బహ్రయిన్ కథను తీర్చిదిద్దిన వారిలో ఆయన ఆద్యుడు. అబ్దుల్ మాలిక్ కథల్లో సామాజిక వాస్తవీకత, వ్యక్తిగత సంఘర్షణ, నగర జీవితం ప్రబలంగా ప్రతిబింబిస్తాయి. అరబ్ సాహిత్య విమర్శలో ఆయన రచనలపై విస్తృతమైన చర్చ జరిగింది. మాలిక్ బహ్రయిన్ కథకు అంతర్జాతీయ ఒరవడిని పరిచయం చేసిన, ముందు తరాలను ప్రభావితం చేసిన సాహితీ దిగ్గజం.




