మూలం : కేకీ ఎన్. దారువాల్లా
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణా రావు
ఏది వెలిగిస్తుంది
నీ జ్ఞాపకాలలోని
ఆ పాత విద్యుత్ దీపపు తీగలను,
ఓ ముసలివాడా?
సన్నని తీగలో
పరిగెత్తే ఈ అగ్నిరేఖ ఏది—
మనసుకీ జ్ఞాపకానికీ మధ్య
కాంతులీనుతూ తరలిపోయే
ఈ వెలుగు?
ఆ కవి రాసిన
ఏ పంక్తి అది?
కొండ చరియపై నుంచి
మన కారువైపు
ప్రశ్నార్థకంగా చూస్తున్న
ఆ కొండ మేక…
రాప్టీ నది ఒడ్డున
ముడతలు పడిన చర్మాన్ని
ఎండకు ఆరబెట్టుకుంటున్న
ఆ మొసలి…
ఏనుగు మీద స్వారీ చేస్తూ
ఉరకలెత్తే నదిని దాటుతున్నప్పుడు,
నదీగర్భాన్ని…..నీటి
మందుపాతరలు దాచిన నేలలా భావించి
అప్రమత్తంగా
ప్రవాహాన్ని అడ్డంగా కోస్తూ
నెమ్మదిగా సాగిన ఆ ఏనుగు…
ఎర్రని వస్త్రాలు ధరించిన
ఆ బౌద్ధ సన్యాసి—
ఆసనాలతో కాదు,
గొణిగే ప్రార్థనతో
జీవితపు వేగాన్ని తగ్గిస్తూ,
నెమ్మదిగా తిరిగే
ఆ ప్రార్థనా చక్రాన్ని తిప్పుతూ…
లడఖ్ రాత్రి ఆకాశంలో
తమ వంతు పహారా కాస్తున్నట్టుగా
మెరిసిన ఆ నక్షత్రాలు…
2
నాకు గుర్తులేదు—
జ్ఞానవృక్షం నుంచి
ఆకుల్లా రాలిపడుతున్న
ఆ పదాలు.
సంపూర్ణతకు
సగం దూరంలోనే ఆగిపోయిన
ఆ పదాల రాలిపోవడం—
ముగింపు లేని
ఒక వాక్యం.
3
కానీ నీ కళ్లను
నాకు గుర్తున్నాయి.
ఇప్పుడే వెలిగించిన గదిలోని
కిటికీలా
అవి ప్రకాశించేవి—
బయట పేరుకున్న
బూడిదరంగు చీకటి నుంచి
చూసినప్పుడు.
ఆ చీకటి—
ఆ నల్లని క్షణం—
అప్పుడు నేనే.
4
విషాదంగా ఉంది కదా?
అసలు కాదు.
చలిలో మసకబారిన
ఒక దూరదర్శినిలా
గతంలోకి తొంగిచూస్తే—
పొగమంచులో కరిగిపోయిన
ఆ రోజుల విషాదం కనిపిస్తుంది.
కానీ ఇప్పుడు
జ్ఞాపకం కూడా జ్ఞాపకాన్ని
మసకబార్చుతోంది;
గతం కూడా గతాన్నే
తనలోంచి తొలగిస్తోంది.
మిగిలేది ఏమిటి?
జ్ఞాపకాల పొగమంచులో
అప్పుడప్పుడు వెలిగే
కొన్ని క్షణాల వెలుగు మాత్రమే.
![]()
కేకీ ఎన్. దారువాల్లా — జీవిత పరిచయం
కేకీ నుస్సెర్వాంజీ దారువాల్లా (24 జనవరి 1937 – 26 సెప్టెంబర్ 2024) భారతీయ ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖ కవి, రచయిత. ఆయన లాహోర్లో జన్మించారు. దేశ విభజన అనంతరం కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించిన తరువాత **1958లో భారతీయ పోలీసు సేవ (IPS)**లో చేరి వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పోలీసు అధికారిగా ఎదురైన అనుభవాలు, భారతీయ సమాజంలోని విభిన్న వాస్తవాలు, చరిత్ర, హింస, రాజకీయాలు, ప్రకృతి వంటి అంశాలు ఆయన కవిత్వంపై గాఢమైన ప్రభావం చూపాయి. Under Orion, Apparition in April, Landscapes, మరియు The Keeper of the Dead వంటి కవితా సంపుటాలు ఆయనకు విశేష గుర్తింపు తెచ్చాయి. The Keeper of the Deadకు 1984లో సాహిత్య అకాడమీ అవార్డు, Landscapesకు 1987లో కామన్వెల్త్ పోయెట్రీ ప్రైజ్ లభించాయి. 2014లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. కవి, రచయిత, పోలీసు అధికారి వంటి విభిన్న అనుభవాలను తన రచనల్లో మేళవించిన దారువాల్లా, భారతీయ ఆంగ్ల కవిత్వంలో తనదైన ప్రత్యేక స్వరాన్ని ఏర్పరచుకున్నారు. 2024 సెప్టెంబర్ 26న ఢిల్లీలో ఆయన మరణించారు.



