హిందీ మూలం : హరిశంకర్ పరసాయీ
స్వేచ్ఛానువాదం : డా. వెన్నా వల్లభరావు
అది ఒక విశ్వవిద్యాలయం. అందులో ప్రఖ్యాతి గాంచినది రాజనీతిశాస్త్ర విభాగం. దానిలో పేరుమోసిన అధ్యాపకుడు ద్రోణాచార్య. పదవీ క్రమాన్ని అనుసరించి అయన రీడర్. లెక్చరర్ నుంచి కొద్ది సంవత్సరాల క్రితమే పదోన్నతి పొంది రీడర్ అయ్యారు. రీడర్ అంటే క్లాసురూమ్ లో పాఠం చదివేసే మాస్టారు అనుకుంటారేమో! అందరూ అలా ఎందుకుంటారు? అయినా విద్యార్థులు మాత్రం సరదాగా అలానే అనుకుంటూ ఉంటారు. ద్రోణాచార్య గారికి త్వరగా ప్రొఫెసర్ అవ్వాలని, ప్రొఫెసర్ ద్రోణ్ అని పిలిపించుకోవాలని కోరిక.
ద్రోణాచార్య గారికి ఇద్దరు శిష్యులున్నారు. మొదటివాడు అర్జున్ దాస్, రెండవవాడు ఏకలవ్య దాస్. అర్జున్ దాస్ ధనవంతుల బిడ్డ. అతని తండ్రికి సమాజంలో గౌరవం, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నాయి. ప్రతిరోజూ అర్జున్ దాస్ ద్రోణాచార్య గారి ఇంటికి వెళుతుంటాడు, ద్రోణాచార్య రోజూ అర్జున్ దాస్ ఇంటికి వెళుతుంటారు. అర్జున్ ఎప్పుడు చూసినా గురువుగారిని అంటిపెట్టుకుని ఉండేవాడు. వారిరువురి సాంగత్యం ఎంత గాఢంగా ఉండేది అంటే ఎవరైనా కళ్ళు మూసుకుని ద్రోణాచార్య రూపాన్ని ఉహించుకుంటే, ఆచార్యుని దేహం నుంచి ఒక తోక పుట్టుకు వచ్చి, దాని చివర అర్జున్ దాస్ ముఖం దర్శనమిస్తుంది.
ఏకలవ్య పేద విద్యార్ధి. పేద విద్యార్థులపైన ఆచార్యులు దృష్టి ఎందుకు పెడతారు! అందువల్ల అర్జున్ కి క్లాసురూం వెలుపల ద్రోణాచార్య దర్శనమే దుర్లభ మయ్యేది. అతనికి మాత్రం గురువంటే అమితమైన భక్తి. గదిలో ద్రోణాచార్య చిత్రపటాన్ని పెట్టుకుని ఆరాధించేవాడు. తల క్రింద గురువుగారు చెప్పిన నోట్స్ పెట్టుకుని నిద్రించేవాడు. ఇద్దరు శిష్యులూ ఎమ్.ఏ. పరీక్ష రాయటానికి సిద్ధమౌతున్నారు.
డబ్బున్నవాళ్ళ పిల్లలకు లోకజ్ఞానం కాస్త ఎక్కువగా ఉంటుంది కదా! అర్జున్ కి అది మరి కాస్త ఎక్కువ. చదువు, చదివితే కాదు గురుకృప వల్ల మాత్రమే ప్రాప్తిస్తుందని అతని గట్టి అభిప్రాయం. అందుకే అతను నిరంతరం గురువు గారికి యథాశక్తి సేవ చేస్తుండేవాడు. వారి ఇంటికి కావలసిన పచారి సరుకులు, కూరగాయలు, దుస్తులు క్రమం తప్పకుండా చేరవేస్తూ ‘మంచివాడివిరా శిష్యా’ అనిపించుకునేవాడు. పండుగలకి-పబ్బాలకి గురువుగారి ఐదుగురు పిల్లల్ని బజారుకు తీసుకెళ్ళి మిఠాయిలు, ఐస్ క్రీములు, బట్టలు, ఆటబొమ్మలు కొనిపెట్టి వాళ్ళతో ‘అన్నయ్య’ అని పిలిపించుకునేవాడు. గురువుగారి యోగక్షేమాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాడు. సాయంత్రాలు గురుమాత వద్ద కూర్చొని ఇతర ఆచార్యుల భార్యలపై కళంక కథలు అల్లి చెప్పేవాడు. అలాంటి కబుర్లంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు! రాత్రిపూట గురువుగారి సమక్షంలో ఇతర ఆచార్యులను తనివితీరా నిందించి ఆయన ఆత్మకి ఎనలేని ఆనందం కలిగించేవాడు. గురుభక్తి ప్రకటించటానికి ఇంతకంటే ఎవరుమాత్రం ఏమి చెయ్యగలరు!
మరోవైపున ఏకలవ్య గురు సాక్షాత్కారానికి నోచుకోక చదువుపైనే దృష్టి పెట్టి శ్రద్ధగా చదువుకోసాగాడు.
ఒకరోజు అర్జున్ దాస్ గురువు గారితో “గురువర్యా! నేను మీ ఇంటికి కావలసిన పచారి సరుకులు, కూరగాయలు క్రమం తప్పకుండా పంపిస్తున్నానా లేదా?”
“పంపిస్తున్నావు వత్సా!”
“గురుమాతకు సినిమా-సర్కస్ ఎవరు చూపిస్తున్నారు? మీ చిరంజీవులకు మిఠాయిలు, కొత్త బట్టలు, ఆటబొమ్మలు ఎవరు కొనిపెడుతున్నారు ఆచార్యా?”
“నువ్వే నాయనా”
“మీ ఎదుట మిమ్మల్ని పొగడటం, ఇతర ఆచార్యుల్ని నిందించటం నాకన్నా ఎక్కువగా ఎవరైనా చేస్తున్నారా ఆచార్యా?”
“లేరు నాయనా”
“మీ ముందు ఏ ఒక్క ఆచార్యుడినైనా నిందించకుండా వదిలేసి మిమ్మల్ని నిరాశ పరిచానేమో చెప్పండి?”
“లేదు కుమారా”
“మీరు రీడర్ గా పదోన్నతి పొందటానికి ఎవరు సహాయ పడ్డారు గురువర్యా?”
“ఇంకెవరు, మీ తండ్రిగారే వత్సా”
“ప్రొఫెసర్ గా పదోన్నతి పొందటానికి, విభాగాధ్యక్షులు కావటానికి ఎవరి సహాయ-సహకారాలు మీకు అవసరమౌతాయి గురువు గారు?”
“నిశ్చయంగా మీ తండ్రిగారివే నాయనా”
“ఏకలవ్య దాస్ ఎప్పుడైనా మీకు ఏ విధమైన సేవైనా చేశాడా?”
“లేదు. అతనికి అసలు నేనంటే లక్ష్యమే లేదు. నిర్జీవ గ్రంథాలే అతనికి సర్వస్వం. ఎప్పుడూ వాటిలోనే మునిగి-తేలుతూ ఉంటాడు”
“మీకు అత్యంత ప్రియ శిష్యుడు ఎవరు?”
“ఇంకెవరు కుమారా! నువ్వే. నీ వంటి శిష్యుడు నాకు ఇంతవరకు లేడు, ఇకమీదట ఉండదు”
వెంటనే అర్జున్ దాస్ నిలబడి చేతులు జోడించాడు. “అయితే నేను ఎమ్. ఏ., ఫస్ట్ క్లాస్ లో ప్రథముడిగా రావాలి. స్కాలర్ షిప్ సంపాదించి, విదేశానికి వెళ్ళి చదువు కొనసాగించే వరమివ్వండి”
“నిజానికి నా కోరిక కూడా అదే వత్సా! కానీ, అందుకు ఏకలవ్య అవరోధమౌతాడు. అతను కుశాగ్ర బుద్ధి కలవాడు. కష్టపడి చదువుతాడు కూడా.”
“అవేమీ నాకు తెలియవు గురువర్యా! మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. నేను ప్రథముడిగా వచ్చి తీరాలి. లేకపోతే గురుమహిమకు అర్థమే లేకుండా పోతుంది. ఇకపై ఏ శిష్యుడూ గురువుని సేవించడు. ఇలాంటి అధమ సంప్రదాయానికి ఆద్యులు మీరేనన్న కళంకం మీకు అంటక మానదు.”
గురువుగారు ఆలోచనలో పడ్డారు. నెమ్మదినెమ్మదిగా అయన ముఖంలో నిశ్చయంతో కూడిన ధృఢత్వం నెలకొంది. ఆ క్షణాన గురువుగారి తేజోదీప్త ముఖారవిందం దర్శించి అర్జున్ కృతార్థుడయ్యాడు. ఆచార్యవర్యుడు జీవిత పర్యంతం చేసుకున్న పుణ్యమంతా తేజస్సుగా మారి అయన ముఖం ప్రకాశించింది. ధృఢ స్వరంతో “వత్సా! నీ మనోభీష్టము నెరవేరుగాక!” అని ప్రియ శిష్యుడిని ఆశీర్వదించారు.
మరుసటి రోజు ద్రోణాచార్య ఏకలవ్యను తనవద్దకు పిలిపించారు. “వత్సా! నువ్వు నీ గదిలో నా చిత్రపటాన్ని ఎందుకు పెట్టుకున్నావు?” అని అడిగారు.
“తమరు నాకు గురువర్యులు కాబట్టి ఆచార్యా!”
“నేను రాసిన గైడ్ రాత్రిళ్ళు తలక్రింద పెట్టుకుని ఎందుకు నిద్రిస్తున్నావు?”
“రోజంతా శకలాలు-శకలాలుగా విన్న జ్ఞానాన్నంతా మననం చేసుకుని, ప్రశ్నలు సమాధానాలుగా మనసులో నిక్షిప్తం చేసుకోవటానికి గురువర్యా!”
ఏకలవ్య వైపు పరిశీలనగా చూస్తూ “అయితే నువ్వు నాకు గురుదక్షిణ సమర్పించుకోవలసి ఉంటుంది.”
“నేనేమి గురుదక్షిణ ఇచ్చుకోగలను గురువర్యా? నాకు కిరాణా దుకాణమూ లేదు, హోజరి షాపూ లేదు. మా నాన్న తనకున్న నిజాయితీని కూడా అమ్ముకోలేకపోయాడు. పేదవాణ్ణి. తమరికి ఏమి ఇచ్చుకోగలను?”
“నేను అడగబోయేది నీ వద్ద ఉన్నదే. నీ కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా సమర్పించు. అదిగో వక్కలు కోసే పట్కారు, తీసుకుని తక్షణమే కోసివ్వు.”
తాను ఎప్పటినుంచో అందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏకలవ్య చాలా శాంతంగా ఉన్నాడు. “గురువర్యా! మీ ఆజ్ఞను పాటించి బొటనవ్రేలు నేను ఆనందంగా కోసివ్వగలను. కానీ అది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది?”
“అది నాకు తెలుసు. నేను ఒక గొప్ప సంప్రదాయాన్ని కొనసాగించవలసి ఉంది. అర్జున్ గురుభక్తికి, వినయశీలతకు నేను ప్రసన్నుడనయ్యాను. అతనే ప్రథముడిగా వస్తాడని నేను వరమిచ్చాను. కానీ నువ్వు పరీక్ష రాయగలిగితే అర్జున్ ప్రథముడుగా రావటం అసాధ్యం. నేనతనికి ఇచ్చిన మాట నిలవాలంటే నువ్వు రాయలేనివాడివి కావాలి. అందుకే నీ కుడిచేతి బొటనవ్రేలు కోసి నాకు సమర్పించాలి.”
ఏకలవ్య నవ్వాడు. “గురువర్యా! నా కుడిచేతి బొటనవ్రేలు మీకు కోసి ఇచ్చినా మీ ఉద్దేశం నెరవేరదు.”
“ఎందుకని?”
“మీకేవ్వరికీ తెలియని విషయం ఒకటుంది గురువర్యా! నేను ఎడమచేత్తో కూడా కుడిచేత్తో రాసేటంత దక్షతతో రాయగలను.”
“అదెలా?”
“నాకు ఊహ వచ్చి నా పేరుపై దృష్టి సారించినప్పుడే నా జీవితంలో కూడా ఎప్పుడోకప్పుడు ఎవరో ఒక గురువు ప్రవేశించి నా బొటనవ్రేలు అడుగుతాడని గ్రహించాను. అందుకే అప్పటినుంచే ఎడమచేత్తో కూడా రాయటం అభ్యాసం చేశాను. నా రెండు బొటనవ్రేళ్ళూ కోసి ఇవ్వమని కోరితే మీ లక్ష్యం నెరవేరవచ్చు. కానీ శిష్యుని రెండు బొటనవ్రేళ్ళూ కోసి ఇమ్మనే సంప్రదాయం లేదుగా!”
ద్రోణాచార్య నిరాశ చెందారు.“ఓరీ అధముడా! నువ్వు గురుద్రోహం చేశావు. రెండు చేతులతో రాసే అభ్యాసం చేశావు. సరేలే, నా దగ్గర వేరే అస్త్రాలు కూడా ఉన్నాయి” అన్నారు.
ఆ రోజు సాయంత్రం అర్జున్ దాస్ తో విచారంగా “శిష్యా! నేను ఏకలవ్య బొటనవ్రేలు తీసుకోలేకపోయాను. కానీ నా వద్ద తిరుగులేని ఉపాయం ఒకటుంది. దానినుంచి ఏకలవ్య తప్పించుకోలేడు. మీరు రాయబోయే పేపర్లలో ఒకటి దిద్దటానికి నాకు వస్తుంది, మరొకటి నా పరమ మిత్రుడు దేవదత్త శర్మకు వస్తుంది. ఈ రెండు పేపర్లలో నీకు నూటికి తొంబై తొమ్మిది మార్కులు వచ్చి తీరతాయి. అవి చాలు నువ్వు ఏకలవ్యను దాటుకుని వెళ్ళి ప్రథముడుగా రావటానికి. వాడి రెండు చేతులతో రాయగలిగే సామర్థ్యం, కుశాగ్రబుద్ధి నా ఎత్తుముందు ఎందుకూ కొరగాకుండా పోతాయి చూడు” అన్నారు ద్రోణాచార్య.
గురువు గారి మాట విని అర్జున్ స్థిమితపడ్డాడు. గురువు గారి సామర్థ్యంపై అతనికి అపారమైన విశ్వాసం. రాజనీతిశాస్త్ర విభాగంలో సర్వంసహాధికారి అయనే. అయన ఆమోదం లేకుండా అక్కడ ఆకు కూడా కదలదు. సంతోషంతో నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు అర్జున్.
అర్జున్ దాస్, ఏకలవ్య దాస్ యథాశక్తి పరీక్షలు రాశారు. ఏకలవ్య మనసులో పరీక్షా ఫలితాల పట్ల అనుమానం నెలకొనే ఉంది. గురు ఆశీర్వాదం ఉన్న శిష్యునికి చింత ఏముంటుంది? అభయహస్తం అందుకున్న అర్జున్ ఎటువంటి దిగులు లేకుండా ధైర్యంగా ఉన్నాడు. అతనికి గురుకృప ఉండనే ఉంది. తన మనోభీష్టం నేరవేరటానికి దానికి మించినదేముంది?
రేపు ఫలితాలు ప్రకటిస్తారు అనగా ఆ రోజు సాయంత్రం అర్జున్ దాస్ ఉత్సాహంగా గురువుగారి ఇంటికి వెళ్ళాడు. ద్రోణాచార్య సర్వం కోల్పోయినవానిలా దిగాలుగా కూర్చొని ఉండటం చూసి అర్జున్ నీరుగారిపోయాడు. అతని మనసు కీడు శంకించింది. ధైర్యం సన్నగిల్లింది. గురువుగారిని అంత విచారంగా ఉండగా గతంలో ఎన్నడూ చూడలేదు. సందేహాస్పదంగా ఆచార్యుని ముఖాన్ని పరికించసాగాడు.
శిష్యుడిని చూసి ద్రోణాచార్య “నేను అధముణ్ణి వత్సా! నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయాను. ఇకపై ఏ శిష్యుడు గురువుని సేవించటానికి ముందుకు రాడు. రాబోయే గురువుల తరం నన్ను వేనోళ్ళ నిందిస్తుంది” అని దుఃఖించారు.
“అసలు ఏమి జరిగింది గురువర్యా?” ఆత్రుతగా అడిగాడు అర్జున్.
“మీ పేపర్లు దిద్దటానికి నాకూ ఇవ్వలేదు, దేవదత్తకూ ఇవ్వలేదు. వైస్ చాన్సలరే స్వయంగా ఎవరో అజ్ఞాత వ్యక్తికి ఇచ్చి దిద్దించారు” చెప్పి నిట్టూర్పు విడిచారు ద్రోణాచార్య.
“అదెలా జరిగింది గురువర్యా? మీకు తెలియకుండా విభాగంలో ఏ నిర్ణయమూ జరగదు కదా! పేపర్లు ఎవరు దిద్దాలని నిర్ణయించేది మీరే కదా!” అడిగాడు అర్జున్.
“అది నిజమే. కానీ ఏకలవ్య దాస్ నాపై వైస్ చాన్సలర్ కి ఫిర్యాదు చేశాడట. అయనే స్వయంగా కలగజేసుకుని ఇలా చేశారు” అన్నారు ద్రోణాచార్య.
గురు శిష్యులిద్దరూ చాలా సేపు ముఖం వేలాడేసుకుని కూర్చుని పోయారు.
అర్జున్ “గురువర్యా! ప్రాచీనకాలంలో కూడా ఒక ఏకలవ్య ఉన్నాడట కదా?” అడిగాడు.
“అవును వత్సా! కానీ అతనికి-ఇతనికి నేలకి-నింగికి ఉన్నంత తేడా ఉంది. అది పుణ్యయుగం, ఇది పాపయుగం. ఆ ఏకలవ్య ఎదురుప్రశ్న వెయ్యకుండా గురువుకు తన బొటనవ్రేలు కోసి సమర్పించాడు. ఈ ఏకలవ్య గురువుకు మొండి చెయ్యి చూపించాడు” అని వాపోయారు ద్రోణాచార్య.
![]()

తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి కథ, కవిత, నాటకం మొదలైన ప్రక్రియల్లో గత 4 దశాబ్దాలుగా అనువాదాలు. రెండు భాషల్లో స్వీయ రచనలు. ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షునిగా 3 దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ. 20 పుస్తకాల ప్రచురణతో పాటు పలు పత్రికల్లో అనువాద రచనల ప్రచురణ. సుమారు 60 ఆకాశవాణి జాతీయ నాటకాలు (హిందీ-తెలుగు-హిందీ) అనువాదాలు ప్రసారం. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం.



