మూలం : Hiroshima child By Najim Hikmet
తెలుగు అనువాదం: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి.
నేను వచ్చి ప్రతి గుమ్మం ముందు నిల్చున్నాను
కాని నా నిశ్శబ్ద నడకని ఎవరూ వినలేకపోతున్నారు
నేను కనిపించకుండా తలుపులు తడుతున్నాను
నేను చనిపోయాను, నేను చనిపోయాను కనుక
చాలకాలం క్రితమే
నేను హిరోషిమా లో చనిపోయినప్పటికీ
నాకు ఏడేళ్లే!
పిల్లలు చనిపోయినతర్వాత ఎదగరు
నా జుట్టు సుడులు తిరుగుతున్న అగ్నికీలల వల్ల కాలిపోయింది
నా కళ్ళు మసకబారాయి
నా కళ్ళు చూపు కోల్పోయాయి
మృత్యువు వచ్చింది
నా ఎముకలు బూడిదగా మారిపోయాయి
అది గాలికి చెల్లా చెదరయింది
నాకు పళ్ళు అక్కరలేదు అన్నం అక్కరలేదు
మిఠాయిలు అక్కరలేదు
రొట్టె కూడా అక్కరలేదు నా కోసం ఏమీ అడగటం లేదు
నేను చనిపోయాను, నేను చనిపోయాను కనుక
నాకు కావలసిందంతా మీరు శాంతి కోసం ఈ రోజే పోరాడండి
అప్పుడే ఈ ప్రపంచం లోని పిల్లలు
జీవించగలరు, ఎదగగలరు నవ్వగలరు, ఆడగలరు.
![]()
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతిలో గురజాడ రచనలపై పరిశోధన చేసారు. విజయవాడలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈనాడు, వార్త దిన పత్రికలలో, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి వార పత్రికలలో, వనితా జ్యోతి, ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక లలో వీరి కథలు గతంలో ప్రచురితమయ్యాయి. విపులలో అనువాద కథలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాల పత్రికలలో కథలు, కవిత్వం, అనువాద కవిత్వం, వ్యాసాలు రాస్తున్నారు. సాక్షి దినపత్రిక లో జ్యోతిర్మయం శీర్షిక కు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు, మహాకవి జాషువా జీవితం -సాహిత్యం, ‘చెంగల్వ పూలు’ కథల సంపుటం, “అక్షర జ్యోతి” ఆధ్యాత్మిక వ్యాస సంపుటి మొదలైనవి వీరి ప్రచురితమైన పుస్తకాలు. తమ శ్రీవారి తో కలిసి, సుప్రసిద్ధ కథకులు, బహు గ్రంథకర్త విహారి గారి సాహిత్య జీవిత ప్రస్థానాన్ని “దర్పణం”
పేరుతో రచించారు. కథ, కవిత్వం, అనువాదం అభిమాన ప్రక్రియలు.



