మంచి కథకు రెండు దశలు ఉంటాయి.
తొలిదశ- తారసపడే ఒక సంఘటన, ఎదురయ్యే అనుభవం, తెలిసివచ్చే సంగతి ఏదైనా సరే.. దిగ్భ్రాంతికి గురిచేసి, వదలకుండా పట్టుకుని, బుద్ధిలో తిష్టవేసి మనసును మెలిపెట్టేయడం మనకు తరచుగా జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో మనసును మెలిపెట్టినప్పుడు, తీవ్రంగా మధనపడినప్పుడు.. అది కలిగించే భావోద్వేగాల తీవ్రతను తట్టుకోలేక సతమతం అయినప్పుడు కాగితమ్మీద పెడితే కథ, కవిత వంటి సృజనాత్మక రూపంగా అది వ్యక్తమవుతుంది. ఉదాహరణకు.. ‘కార్పొరేట్ చదువుల మీద ఒక కథ రాద్దాం’ అని డిసైడై కంప్యూటరు ముందు కూర్చుని కృతకమైన పాత్రల్ని అల్లుకుంటూ టైపు చేయడం ప్రారంభించేయకుండా.. మన జ్ఞానాన్ని చాటుకునే యావలో వంటకాలు చేయకుండా.. ఇలాంటి సుదీర్ఘమైన మధనం నుంచి పుట్టిన కథకు ఒక పరిణత రూపం ఉంటుంది. ఒక తల్లి ప్రసవ వేదన పడిన ప్రతిసారీ మరో జన్మ ఎత్తుతుందని మనం ఆమె ఔన్నత్యానికి ప్రణమిల్లుతుంటాం. మంచి కథను పాఠకులకు అందించే ప్రతి రచయిత కూడా.. ప్రతి కథకు అంతటి ప్రసవవేదన పడతాడు. అలా పుట్టినది ఖచ్చితంగా మంచి కథల సరసన చేరగల వరుసలో ఉంటుంది.
మలిదశ- రచయిత ప్రసవ వేదన దశను దాటి బయటకు వచ్చిన తర్వాత, కథ, చదివిన ప్రతి పాఠకుడిని ఒక సంవేదనకు గురిచేస్తుంది. అక్షరాలలో ఉన్న మొత్తం భావోద్వేగాలు చదివిన ప్రతివాడిలోకి వెల్లువలా ప్రవహిస్తాయి. ఆ కథ ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, రసోద్రేకాన్ని కలిగిస్తుంది. ఏ అనుభూతి ప్రధానంగా ఆ కథ సాగిందో.. అనుభూతిని వెలితి లేకుండా పాఠకుడికి పంచి, పరిపూర్ణం అవుతుంది. మంచి కథ చదివిన తర్వాత, వెంటనే ఇంకో పనిలో పడడం అంత సులువు కాదు. ఆ కథ వెంటాడుతుంటుంది. తరుముతుంటుంది. కుదురుగా ఉండనివ్వదు. మళ్లీ మళ్లీ తన గురించి ఆలోచించమంటుంది. అందులోని పాత్రల భావోద్వేగాలతో సహానుభూతి చెందమంటుంది. ఆ దుఃఖాల ఉద్వేగంలో, ఆనందాల పరవశంలో మిమ్మల్ని సదా ఉంచుతూ.. సుదీర్ఘకాలం పాటు ఆ కథా పరిమళం మిమ్మల్ని అంటుకునే మిగులుతుంది.
ఈ రెండు దశలూ దాటిన పరిణత కథ.. మంచి కథల సరసన నిలుస్తుంది.
భూక్యా గోపి నాయక్ రాసిన ‘యాడిగొంతు’ అలాంటి మంచి కథల వరుసలో తనను తాను సగర్వంగా, గౌరవంగా నిలబెట్టుకునే కథ. కొన్ని వారాల కిందటే ఆదివారం నాడు ఒక కథను అందించడం ప్రారంభించిన ‘తెలుగుప్రభ’ దినపత్రిక ఈ కథను ప్రచురించింది. మంచి కథలకు కేరాఫ్ గా తమ పత్రికను కూడా నిలబెట్టాలనే తపనతో వారి కథల ఎంపిక సాగుతున్నట్టు చెప్పే మరో ధ్రువపత్రం ‘యాడిగొంతు’!
ఓ గిరిజన బాలిక సోనీ తండాలో అయిదో తరగతి పూర్తిచేసిన తర్వాత పట్నంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో ఉండి పైతరగతులు చదవడానికి వస్తుంది. ఆ వయసు పిల్లలకు అత్యంత సహజమైన హోమ్ సిక్ సమస్యే ఈ కథలోని ప్రధానాంశం కూడా. కేవలం ‘హోమ్’ వెలితి మాత్రమే కాదు, ‘యాడి’ జ్ఞాపకం మాత్రమే కాదు.. ఆమెను ఆ కొత్త వాతావరణంలో మెలిపెట్టేసే ముఖ్యమైన విషయం మరొకటి కూడా ఉంది. అదేమిటో చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ కథ. మీరు చదివే తెలుసుకోవాలి.
హాస్టల్లో ఉన్న సోనీకి తల్లి జ్ఞాపకం వస్తుంటుంది. అమ్మ జ్ఞాపకాలను, అమ్మ కావాలనే స్పృహను వ్యక్తం చేయడం కూడా మరిచిపోయేంతగా సోనీ ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. ఆ బాధలోనే జ్వరం బారిన పడుతుంది. ఆ పాపకు అర్థం కూడా పూర్తిగా తెలియని- అమ్మ లాలిపాటే ఆమె జ్వరానికి మందు అని వార్డెను కూడా గుర్తిస్తుంది. చీదరింపుల స్థానే గౌరవం, ప్రేమ ప్రవేశిస్తాయి. కథ- అవసరమైన న్యాయం దిశగా సాగి పాఠకుడిని సంతృప్తి పరుస్తుంది. ‘యాడిగొంతు’ లోని కరకైన మాధుర్యం, కట్టెలు కొట్టితెచ్చి అమ్ముకునే తల్లి సంతూబాయి బండబారిన చేతుల్లోని మార్దవం లాంటిదే. సోనీకి మాత్రమే ఆ మధురిమ తెలుసు. కథ చదివాక ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.
యాంత్రికమైన వృత్తి ధర్మంలో మగ్గిపోతూండే వార్డెను సరోజినిలో వచ్చే మార్పు.. కథ చదివే ప్రతి పాఠకుడిలోనూ రాగల మార్పునకు ప్రతీక! కథ ద్వారా తాను నమోదు చేయదలచుకున్న విజయాన్ని, కథలోనే సంకేతిస్తాడు రచయిత భూక్యా గోపి నాయక్! అరుదైన ఫీట్, అరుదైన ఫీల్ ఇది.
‘స్టాప్- లుక్ అండ్ ప్రొసీడ్’ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది ఈ కథ! చదువుతుండగా అనేకచోట్ల మిమ్మల్ని నిలబెట్టేస్తుంది. కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని మీలో మీరు మధనపడాలని చెబుతుంది. ఆతర్వాత కొనసాగమంటుంది. కథలో స్పీడు బ్రేకర్లులా వస్తుంటాయని లోపాల గురించి మనం చెబుతుంటాం. కానీ.. ‘యాడిగొంతు’లో అలా నిలబెట్టేసే వాక్యాలు తద్విరుద్ధమైనవి. మీ పఠనానుభూతిని పెంచేవి.
‘వాళ్లు పడుకోబెడితే పిల్లలకు నిద్ర వస్తదా’ అంటుంది సోనీ తల్లి సంతూబాయి. అమాయకమైన ఆ గిరిజన స్త్రీ.. తాను నిద్ర పుచ్చకుండా బిడ్డ నిద్రపోగలుగుతుందా అనే అనుకుంటుంది. గిరిజన అమాయకత్వంలోని ఆ స్వచ్ఛత- సంతూబాయిలోనే కాదు సోనీలో కూడా కనిపిస్తుంది. తల్లి గురించి వ్యాసం రాయమని తెలుగు టీచరమ్మ పురమాయిస్తే.. బాగా చదివే విద్యార్థిని అయిన ఆ అమ్మాయి.. ఒక్క వాక్యమైనా రాయలేకపోతుంది. ఎందుకంటే- ‘మా అమ్మకు తెలుగురాదు’ అంటుంది. ఇలాంటి వాక్యాలు చాలానే ఉన్నాయి.
‘కొత్తది నేర్చుకోవాల్నంటే, పాతది చంపేయాల్నా’ అనే సంతూబాయి మాట ఈ కథను పుట్టించిన అంతస్సూత్రం!
కథలో మరో ముఖ్యమైన పాత్ర వార్డెను సరోజిని. ఉద్యోగంలోని ఒత్తిడి నేర్పించే అనివార్యమైన యాంత్రికతకు ఆమె ప్రతినిధి. ఎంతగా బండబారినా గుండెల్లో ఉండే తడిని- సోనీ, ఆమె యాడి, ఆమె గోర్ బోలి ఉమ్మడిగా తట్టి లేపుతాయి.
కుల, మతాల అస్తిత్వాల్ని చాటడానికి, కాపాడుకోవడానికి వచ్చే సాహిత్యంలో ఒక తడి ఉంటుంది. చాలా మంది తమ తమ కులాలు, మతాల్లోని బరువైన విషయాలనే కథాంశాలుగా తీసుకుంటూ సాహిత్యానికి గొప్పగా చేర్పులు చేస్తూ వస్తున్నారు. కానీ కులం ఆధారిత కథలను కొంచెం లోతుగా గమనిస్తే.. వారు ఎదుర్కొనే వేదనలు, పరితాపాలను.. కులం గీతలకు ఆవల ఆర్థిక అసమానతలు కూడా ప్రధాన కారణంగా నిర్దేశిస్తుంటాయి. కులాలు మతాల చుట్టూ ఆ కథలు నడవవచ్చు.. ఆ వర్గాల వారు ఆ కథలతో మమేకం అయి ఆనందించవచ్చు. కొన్ని కథల్లోని కులం పేరును, మరో కులం పేరుతో రీప్లేస్ చేసినా కూడా కథకు సేగి వాటిల్లదు. అలాంటి ఆ కథల్లోని గొంతుక కులం ఆకర్షణను తొడుక్కుని, మరో హేతువును చర్చిస్తుంటుంది. కానీ ‘యాడిగొంతు’ అలాంటి కథ కాదు. ఇది అచ్చమైన, స్పష్టమైన బంజారా గోర్ బోలి గొంతుక!
సోనీ, బంజారా తెగకు చెందిన గిరిజన బాలిక కావడం వల్ల మాత్రమే ఈ కథ పుట్టింది. అస్తిత్వ కథల్లో ఇది ఒక స్వచ్ఛమైన కథగా నిలుస్తుంది.
కథ మీద కొన్ని విమర్శలూ నా దృష్టికి వచ్చాయి. తెలుగు నేర్చుకోమని అన్నందుకే అణిచేసినట్టు భావించడం కరక్టేనా? గిరిజన బిడ్డలు ఇక ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలా? వారు ఎదిగి ఉన్నత స్థానాల్లోకి, హోదాల్లోకి రానేకూడదా? అనే తరహా ప్రశ్నలూ వచ్చాయి. కథను పైపైనే చదవడం వల్ల కలిగిన అభిప్రాయాలివి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం.. ఆ కథను మరోసారి చదవడంలో దొరుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
అలాగని కథలో లోపాలు లేవని కాదు. నాకు లోపాలుగా అనిపించినవి పిడికెడు ఉన్నాయి. ఆ హాస్టలు మొత్తం గిరిజన బాలికలదే అయినప్పుడు.. సోనీ గోర్ బోలి భాషను మిగిలిన అమ్మాయిలు హేళన చేయడం, వార్డెను సరోజినికి, అప్పుడే కొత్తగా డ్యూటీలో చేరిన మహిళలాగా, గిరిజన భాష గురించి కనీసం పరిచయం లేనట్లుగా ఉండడం లాంటివి. మరికొన్ని అసహజ నడకలు కూడా పోయింది కథ! శిల్పపరంగానూ కొన్ని లోపాలు అనిపించాయి. కానీ వాటన్నింటినీ జాబితా కట్టి చెప్పడం నాకు ఇష్టం లేదు. యాడిగొంతు మిమ్మల్ని లాక్కువెళ్లే ఉద్వేగాల్లోనే వెళ్లండి. మీకుగా కొన్ని లోపాలు కనిపిస్తాయి. వాటిని మన్నించండి. కానీ విస్మృత భాషల పట్ల మనం చూపించవలసిన కనీస గౌరవాన్ని ఈ కథ ఎలుగెత్తి చాటుతోందని మాత్రం విస్మరించకండి. మీరు గమనించిన లోపాలను గోపి నాయక్ కు చెప్పండి. స్వీకరించి.. మనకు మరింత మంచి కథలను ముందు ముందు అందిస్తాడు.
నూటయాభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం మనది. వందల భాషలు మనుగడలో ఉన్నాయంటే అతిశయం కాదు. ప్రభుత్వం/ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషలు 22 మాత్రమే. మిగిలిన వందల భాషల సంగతేమిటి? గౌరవం దక్కడం అనే మిషమీద ఈ వందల భాషల్ని అధికారికంగా గుర్తించడం సాధ్యమేనా? ఆ భాషలకు పుట్టిన బిడ్డలందరూ.. చదువులకు వెళుతున్నప్పుడు.. దరఖాస్తుల్లో ‘మాతృభాష’ అనే గడిలో ఏం రాయాలి? ఈ ప్రశ్న ఆ రంగంలోని వారికి తరచూ ఎదురయ్యేదేనేమో. 22లో ఏదో ఒక పేరు చెప్పాల్సిందే అని పట్టుపట్టకుండా, ఆ జాతులు, తెగలకు చెందిన వారు.. తమ భాషగా ఏ పేరు చెబుతారో.. దాన్ని ఆ గడిలో రాస్తే చాలు. వారి భాషాగౌరవాన్ని కాపాడ్డానికి అంతకుమించి ఏమీ చేయక్కర్లేదు.. అనే సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది.
నిత్యజీవితంలో మనకు అనేకమంది తారసపడుతుంటారు. కడుపు చేతపట్టుకుని- ఏ ప్రాంతపు మనుషులు.. మరే ఇతర ప్రాంతాల్లో బతికే తెరువును వెతుక్కుంటున్నారో.. హద్దులన్నీ చెరిగిపోయిన ఆధునిక సమాజంలో.. తారసపడే మనుషుల నోట వారి సొంత భాషను విన్నప్పుడు మనం నవ్వుతాం. ఏ ప్రాంతంలో బతకడానికి వచ్చారో.. ఆ ప్రాంతపు భాషను అలవాటు చేసుకోవడం, ఆ మట్టికి అలవాటు పడడం వారు నేర్చుకోవాల్సిందే. లేకపోతే మనుగడ ఉండదు. అంతమాత్రాన వారు, పరిసరస్పృహను మరచిపోయిన అమృత క్షణాల్లో వారి సొంత భాషలోనే ఏదైనా మాట్లాడినప్పుడు.. మనం హేళనగా నవ్వకుండా ఉండాలి. ‘యాడిగొంతు’లో సోనీ, అఫ్సర్ గా ఎదగాలంటే తెలుగును, ఇంగ్లీషు తదితరాల్ని కూడా నేర్చుకోవాల్సిందే. కానీ ఆమె బాధానందాలను అనుభూతించే అలౌకిక సమయంలో ఒక మాట తన మాతృభాషలో చెప్పుకుంటే, ఆ ‘గోర్ బోలి’ హేళనకు గురికాకూడదు. ప్రతిభాష పట్ల మనం కలిగి ఉండవలసిన ఆ సంస్కారాన్ని మనకు ‘యాడి గొంతు’ కథ నేర్పుతుంది.
స్పానిష్, ఇటాలియన్ లాంటి ఏవేవో భాషలనుంచి రెండు పదాలను పుక్కిట పట్టి.. తమ తమ మిత్రులతో సంభాషణల్లో ఆ పదాలను, భిన్నంగా ఉండడం కోసం, వాడుకుంటూ హొయలొలికించే యువతరం మనకు తెలుసు. ఈ కథ చదివిన వారిలో ఏ ఒక్కరికైనా ‘అమ్మ కావాలి’ అనే ఉద్వేగాన్ని భిన్నంగా వ్యక్తం చేయడానికి ‘యాడి చావ్ణు’ అనాలనిపిస్తుంది యిక! అలా ఒక్కరు ఆ పదాల్ని వాడినా చాలు.. భూక్యా గోపి నాయక్ జన్మ ధన్యమైనట్టే. కేవలం అందరూ మెచ్చుకున్న కథ రాసినందుకు మాత్రమే కాదు. అసలు గుర్తింపే లేని.. తండాల్లో తప్ప ఎక్కడా వినపడని ఒక భాష పట్ల, ఆ భాష గురించి ఏమీ తెలియని ప్రజల్లో ప్రేమని నాటినందుకు!
నామటుకు నేను, యాడి యాదిలో కొట్టుకుపోయాను. మీలో ఇప్పటికీ చదవని వారుంటే తప్పకుండా చదవండి.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె


