మళయాళం, ఇంగ్లిషు : కె.సచ్చిదానందన్
తెలుగు అనువాదం : చింతపట్ల సుదర్శన్
ఒక మిట్ట మధ్యాహ్నం
వర్షం కురవడానికి ముందు
శాశ్వతమైన చీకటి నుంచి
విముక్తి కోసం పోరాడుతూ
ప్రేమతత్వం తెలియని మనుషుల మధ్యకు
రావడాన్ని వ్యతిరేకిస్తూ
బిగ్గరగా ఏడుస్తూ
ఓ సామెత కడుపులో నుంచి
సముద్రాన్ని వదిలి బయటకు వచ్చిన
ఉప్పులా ఎగశ్వాస పీలుస్తూ వచ్చాను.
సుదీర్ఘ సమయం నొప్పులు భరించాను
ప్రసవం ఎంతో కష్టమైంది
నా రాకను ఇలా గుర్తుచేసుకుంటుంది అమ్మ.
బొడ్డుతాడును గట్టిగా పట్టుకుని
ఉమ్మనీటి మూటలో
నేను దాక్కున్నానన్న వనిషయం
అమ్మకు ఎలా తెలుస్తుంది?
నెత్తుటి ముద్దలా ఉన్న నన్ను చూసి
ఏమీ అర్థంకాని ప్రహేళికలా ఉన్నానని
ఇరుగూ పొరుగూ అన్నారు
కానీ నాకు ఉన్నది ఒక తల మాత్రమే
తడితడిగా ఉన్న నేను
బురద వాసనేస్తూ ఉన్నానన్నాడు నాన్న
సన్నని తాడులా
ఒక జానపద కథలోనుంచి
మెలికలు తిరుగుతూ
వచ్చిపడ్డానన్నది అక్క.
నా పుట్టుకను దుశ్శకునంగా సూచిస్తూ
పైకప్పు ఒక ప్రశ్నలా జారిపడింది.
2
నేను పాలు మానడానికి
వక్షానికి అమ్మ ఏదో రాసుకుంది
కషాయం కూడా రుచిగానే ఉంది
భూమ్మీద రకరకాల రుచులున్నాయని
నాకప్పుడు తెలిసింది
ఇంటికి తూర్పు దిక్కున ఉన్న
నక్స్ వోమికా చెట్టుకు
ఇంకా పండ్లు కాయలేదు
రోజ్ఉడ్ ఊయల్లో పడుకుని
తరతరాల భయాన్ని వాసన చూస్తూ
నా చెవులు
దేవుడి స్తోత్రాలకూ, జోలపాటకూ మధ్య
తేడాను గుర్తించడం నేర్చుకున్నాయి
నా కళ్లు
అమ్మ తల వెంట్రుకలకీ రాత్రికీ మధ్య
తేడాను గుర్తించడం నేర్చుకున్నాయి
నా ముక్కు
ఉడుకుతున్న అన్నం వాసనకీ అక్క రాకకీ మధ్య
తేడాను గుర్తించడం నేర్చుకుంది
నా నాలుక
మాటలకీ, పుల్లటి చింతపండుకీ మధ్య
తేడాను గుర్తించడం నేర్చుకుంది
పక్కింటివాళ్లు ముద్దు పెట్టుకుంటే
కప్పనైపోతానని అమ్మ భయపడేది.
అప్పుడప్పుడు నీటిమూటలోకి
వెళ్లిపోవాలని అనిపించేది నాకు.
3
అమ్మ పాలూ, పాటా స్రవించే
ఒక వెచ్చని, తెల్లని వాగు
నాన్న వీపు ఒక నల్లని మబ్బు
ఆ మబ్బు మీద నేను స్వారీ చేశాను.
చిలకలకు నా ఆకలి తెలిసి
చెట్లకు చెప్పేయి
అవి నాకు పండ్లు ఇచ్చేయి
చేపలకు నా దాహం తెలిసి
నదులకు చెప్పేయి
అవి నా ఊయలలోకి ప్రవహించేయి
వర్షం నా పడక గదిలో కురిసింది.
యక్షిణులు
ఎప్పటికీ ఎండిపోని
స్తనాలతో వచ్చారు
నేనక్కడ లేను
ఆకలీ దప్పికా మాత్రమే ఉన్నాయి.
నిద్రలో నేను నా గత జన్మలలోకి
ప్రయాణం చేశాను
ప్రార్థనాగీతం కోసం
గడ్డిలా వ్యాపించి
ఆకుపచ్చరంగునయ్యాను
రేలపూవులా పుష్పించి
పసుపురంగు నిఘంటువు నయ్యాను.
నెమలి ఈకల మీద, చేప మొప్పల మీద
ప్రకంపించే
నీటి ఆనందం తెల్సుకున్నాను
నేనొక చిరుతగా మారి
సహజాతపు వ్యాకరణం నేర్చుకున్నాను.
4
ఒకనాడు
నిలబడదామని నిర్ణయించుకున్నా
నాతో పాటు ప్రపంచమూ నిలబడ్డది.
పేరు చెప్పడానికి గుండ్రంగా తిరిగాను
ప్రపంచం కూడా గుండ్రంగా తిరిగింది.
అద్దం ఒక పసివాడ్ని దగ్గరకు లాగింది
వాడి వెనుక ఒక నీడ ఉన్నది
ఆ నీడ నాతోపాటే పెరిగింది
నేను ఏది తింటే వాడూ అదే తిన్నాడు
నేను నిద్ర పోతున్నప్పుడు
వాడు మేలుకుని ఉండి
నా కలల్లోకి తొంగిచూశాడు
మొట్టమొదట నేను
బావిలోకి తొంగిచూసినప్పుడు
తెరచి ఉన్న దాని నోటిలో
వాడు కనపడ్డాడు
నా అన్ని జన్మలలోనూ
వాడు నాతో ఉన్నాడు.
ఒక పదం నుంచి
జారిపడిపోయిన అక్షరాన్ని నేను
జారిపోయిన ఆ అక్షరం
ఇంకా ఆ పదం కోసం
వెదుకుతూనే ఉన్నది
ప్రతిపదంలోనూ వెదకి
ఏ పదమూ తన స్వంతం కాదని
ఒంటరిగా భయం భయంగా
నిఘంటువులో నుంచి
బయటకు వచ్చేస్తున్నది.
5
పాములూ
మీ పుట్టలలో మాణిక్యాల
పగటికాంతిలోకి
నన్ను తీసుకుపొండి.
నక్కలూ
రాత్రుళ్లు మీ ఊళలలోకి
నన్ను తీసుకుపొండి.
గుడ్లగూబల రెక్కల మీద
మృతుల ప్రపంచంలోకి
నన్ను ప్రవేశించనీయండి.
ఇంద్రధనుస్సు మీద స్వారీ చేస్తూ
దేవతల రెక్కలను
నన్ను స్పర్శించనీయండి.
హంస వీపు మీది నుంచి దిగి
తామరకాడలో ప్రయాణించి
ప్రపంచం ఆవలి తీరానికి
నన్ను చేరుకోనీయండి.
నన్ను
ఒక గబ్బిలాన్ని
ఒక పలాశ పుష్పాన్ని
ఒక నీటి ఊటని
ఒక శంఖాన్ని
ఒక పండిన మామిడి పండుని కానీయండి.
నాలాగే నేనుండాలని
బలవంత పెట్టకండి
ఇతరుల్లా ఉంటే చాలు
రకరకాల రూపాలను
అస్తిత్వపు భారాన్ని
మోయలేను నేను.
చెరుకుగడలో తీపిలో
రావిచెట్టు కొమ్మల్ని
మబ్బులుగా మార్చేగాలిలా
భూమిలోపల మ్రోరగే గంటలా
వాన చినుకులా
పక్షి పాటలా
అంతుచిక్కని లక్ష్యంలా ఉంటే చాలు
నన్ను ఉండనీయండి
అగ్ని! అగ్ని! అగ్నిలా!
6
నడక మొదలుపెట్టాను
చీకటి తడిగా ఉన్న గదుల్లోంచి
గుమ్మం ముందు అరుగు చివరికి
పాకుతూ వెళ్లాను నేను
బంగారు సూర్యకాంతిలో
ఇంద్రధనుస్సులలో
సీతాకోకచిలుకలతో
దాగుడుమూతలాడాను.
ప్రతి ఆకూ ఈనెలోకి రమ్మంది
ప్రతి పూవూ తేనెలోకి రమ్మంది.
తన చిట్టి చేతులతో
పచ్చిక లాలించింది
రాళ్లు తమ కష్టాలను చెప్పాయి
తొలకరి జల్లు
ప్రకృతి మతంలోకి మార్చింది నన్ను.
తీపినుంచి కారంలోకి నడిచాను
ఉప్పపదాలు పలకడం నేర్పింది.
పదాలు ముందో వస్తువులు ముందో
వెలుతురు అనే పదమే వెలుతురయిందో
గుర్తులేదు నాకు
భాషా మెట్లను ఎక్కాను దిగాను
ప్రపంచాన్ని మచ్చిక చేసుకోవాలని
పదాల మంత్రాలు పఠించాను.
పదాల మాయాద్వీపం నుంచి
మాయాజాలం చేసే భూతాలు వచ్చాయి
పదాలు
పర్వతాలను, సముద్రాలను
అడవులను, తోటలను
సృష్టించాయి
పదాలు
ప్రపంచమంతా సంచరించే
రేసుగుర్రాలయినయి.
పదాలనుండి
సూర్యుడూ చంద్రుడూ
ఉదయించారు
పదాల నుండి
గ్రహాలు, తారలు
గరుడపక్షి, సాలభంజికలు
మాట్లాడే జంతువులు వచ్చాయి
సుల్తాన్ కత్తికి భయపడి
పదాలు ప్రతిరోజూ
ఒక కథ చెప్పాయి
ప్రతి జన్మలోనూ
కొత్తరూపం కొత్త పేరు ధరించి
బోధిసత్త్వులయ్యాయి
పదాలు
మాయాగుహల తలుపులు తెరిచే
బీగాలయ్యాయి
మనస్సులో దాగున్నది చూపే
అద్దాలయినయి.
ఒకనాడు
చిట్టి చూపుడువేలు
పెద్ద ఒంటె పాదం మీద స్వారీ చేసింది
విఘ్నేశ్వరుడ్ని ప్రార్థిస్తూ
ఇసుక తిన్నెలలో తిరిగింది
ఆ తర్వాత వచ్చారు
సూర్యుళ్లు, ప్రవక్తలు
ఆ తర్వాత వచ్చాయి
గుర్రాలు పతాకాలు.
నిజమైన ప్రపంచం ఏది?
ఏది నిజమైన ప్రపంచం?
కలుపు మొక్కలు కప్పేసిన
నిలువ నీటి చెరువులో
చంద్రకాంతిలో
వణుకుతున్న ఆకులో
సముద్ర తీరంలో రాత్రుళ్లు
పాదాల క్రిందినుంచి జారుతున్న ఇసుకలో
ఉన్న ఒకే ఒక పాదముద్రలో
భయాన్ని చూశాను.
ఎముకలూ చర్మమే ఉండి
న్యూమోనియా జ్వరతీవ్రతలో
ప్రేలాపనలు చేస్తున్న
బాలుడిలో ఏదో ఆకర్షణ ఉంది
వర్షఋతువులో
వర్షాల మధ్య కలల మధ్య
జ్వరానికి శరీరాన్ని వదిలి
వాడి మనసు ఇతర ప్రపంచాల్లో
సంచరించింది
మొట్టమొదటిసారి
నెత్తుటి వర్షం కురిసింది
పూలకు కోరలు మొలిచాయి.
మృత్యువు వద్దనుంచి
వెనుకకు తిరిగి వచ్చి
నా తల్లి గద్గద స్వరంతో
రామాయణంలో అయోధ్యకాండను
పఠిస్తుంటే విన్నాను.
రేషన్ ఇవ్వ నిరాకరించిన షాపునుండి
తిరిగివచ్చిన నాన్న
యుద్ధం గురించి మాటాడ్డం విన్నాను.
వేళ్లు లేని చేతులతో
ఒక కుష్టువాడు
మూగదేవతకు
మందారపువ్వును సమర్పించడం చూశాను.
వర్షంలో తడిసిన ఒక వృద్ధ వనిత
ఇంకా ఇంకా పూలు పూయాలని
ఎర్రపూల చెట్టును
ప్రార్థించడం చూశాను.
నా తోటి ఆట గాని
నీలిరంగు శవం పెదవి
ఏదో చెప్పాలని కదలడం చూశాను.
నా పసితనం ముగింపుకు వచ్చింది
ఎర్రని ఆకులు నల్లని పూవులతో
నోరూరించే ఫలాలతో
భారంగా ఉన్న ఒక చెట్టు
ఆకాశంలో అనేక నేత్రాలతో
ప్రకాశించింది.
కొమ్ములు గిట్టలు ఉన్న
ఒక జంతువు
ఏడుతలలమీద
ఏడు కిరీటీలతో
బుదలో తడిసి
వరిపొలాల మధ్య నిలబడింది.
![]()

1952లో జన్మించిన చింతపట్ల సుదర్శన్ కృష్ణాపత్రిక, విశాలాంధ్రల్లో 1972లో కవితలతో రచనలు ప్రారంభించారు. హైదరాబాదు పాతనగరంలో ‘ఉషస్సు’ లిఖితపత్రిక సంపాదకుడిగా నడిపారు. 1973లోనే హైదరాబాదు పాతనగరం రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘వేదిక’ లిఖిత పత్రికర సంపాదకుడిగా ఉన్నారు. 1982 నుంచి వివిధ పత్రికల్లో 1500కు పైగా కాలమ్స్ ప్రచురితం అయ్యాయి. కాలమ్, క్రిటికాలమ్, హాట్ కేక్, మాయాబజార్, కానికాలమ్, నాశనగాలమ్, వలపులవల, క్విక్ బాక్సింగ్, కలంకారీ, చల్తే చల్తే, చౌరస్తా, రంగస్థలం వంటివి ప్రముఖమైనవి.
అద్దం, క్రిటికాలమ్, సుదర్శన్ సెటైర్స్, తెలంగాణ.కాం, అమృతం కురవని రాత్రి (కథలు), పగలే వెన్నెల (నవల) ప్రచురించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనేక అనువాద రచనలు చేశారు. ముల్క్ రాజ్ ఆనంద్- అంటరానివాడు, రవీంద్రనాధ్ టాగోర్- శిలావిలాపం, ఆదిశంకరాచార్య- భజగోవిందం, ఆర్కే నారాయణ్- మాల్గుడి నవలలు లాంటివి ముఖ్యమైనవి.



