హిందీ మూలం : డా. లఖన్లాల్ పాల్ కథ ‘పెన్షన్’
అనువాదం : డా. దండిభొట్ల నాగేశ్వరరావు
“దండాలవ్వా!”
ఝున్నో చెవుల్లో ఆ స్వరం పడగానే వెనక్కి తిరిగి చూసింది. గనేశా ఆమె ముందు నిలబడి వంగి ఝున్నో కాళ్లకు నమస్కరించాడు. ఝున్నో కళ్లపై చేతిని నీడగా పెట్టుకుని, “ఎవరు? గనేశావేనా?” అని అడిగింది.
“అవును దాయీ.”
“ఎప్పుడొచ్చా?”
“నిన్ననే ఒచ్చానవ్వా.”
ఝున్నో గనేశాను ఆశ్చర్యంగా చూస్తోంది. ఎంతగా మారిపోయాడో వీడు! ఒకప్పుడు చిరిగిన గుడ్డలేస్కుని, సర్పంచ్ గేదెలను మేపేవాడు. చిన్న చొక్కాతోనే చలికాలమంతా వెళ్లదీసేవాడు. గనేశా పరిస్థితి చూసి తల్లి నవ్వుతూ, “గుంటడికి ఒంటిమీద సరింగా గుడ్డలే లేవు, ఇట్లనే చలికి వణుకుతున్నాడు” అనేది. కాలమహిమ! ఈరోజు ఎంత దర్పంగా ఉన్నాడు! జీన్స్, షర్ట్, కళ్లకు అద్దాలూనూ వాడు…. అసలు ఈ ఊరివాడిలాగే అనిపించడం లేదు, పూర్తిగా పరాయివాడే. అంతా అదిగో ఆ లచ్చిందేవి మహిమ. చేతికి డబ్బు రాగానే మనిషి కళే మారిపోతుంది. గనేశా జీవితం ఇలా రూపుదిద్దుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
“అమ్మకి ఏమైనా తెచ్చావా?”
“అవునవ్వా, అమ్మకి మంచి చీర, రైకా కొనుక్కొచ్చా.”
“మంచిదిరా నాయినా,” అని వాణ్ణి ముదలకించి ఆప్యాయంగా చూస్తూ “నాయినా, మీ అమ్మ చాలా కష్టాలు అనుభవించిందిరా ” అంది ఝున్నో.
“ఇక నీడన కూకొనే రోజులొచ్చినయిలే అవ్వా,” గనేశా నవ్వుతూ ముందడుగేశాడు.
ఝున్నో గనేశా తల్లి పడిన కష్టాలు చూసింది. ఆమెకు పొలం-పుట్రా
ఏమీ లేవు, ఏ కూలో నాలో చేసి కడుపు నింపుకునేది. ఆ కుటుంబ పోషణ ఎలా చేసిందో తనకే తెలుసు. మొగుడికి ఏమైందో ఏమో గానీ, కాస్త కష్టపడగానే కడుపులో నొప్పి ఎక్కువయ్యేది. జనం డబ్బులిస్తే పని కూడా చేయించుకుంటారు కదా, ఎదుటివారి బాధలతో వాళ్లకు ఏమీ పని?
పిల్లలు మాత్రం ఎంతకాలం ఆకలితో ఉంటారు? ఆకలి కడుపుతో నకనకలాడే పిల్లలు ఇతరులవంక చూస్తుంటే తల్లి పేగులు తరుక్కుపోయేవి. పిల్లల కోసం తప్పక కూలి పనులకు మొదలుపెట్టింది. ఉన్న ఊళ్ళో రోజు కూలి కష్టం. ఇంటింటికీ వెళ్లి ధాన్యం, పప్పులు ఏరి పెట్టే పనులు చేసేది. ప్రతిఫలంగా జనం చేతిలో కాసిని రొట్టెలు పెడితే, తాను పస్తులు ఉంటూ పిల్లలకు ఆ రొట్టెలు తినిపించేది.
గనేశా ఐదో తరగతి వరకే చదవగలిగాడు. ఇంట్లో పరిస్థితులు ఎంత దారుణం అంటే తొడుక్కోడానికి బట్టలు, రాసుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అయ్యోరు ప్రతిరోజూ బట్టల గురించి గొడవే…పైగా నోటు బుక్కులు తేలేదని కొట్టేవాడు. చిన్న పిల్లాడు, ఎంతని దెబ్బలు తింటాడు? దెబ్బలు తినడానికీ హద్దుంటుంది. ఏముంది.. చదువుపై తిరుగుబాటు చేశాడు. తల్లిదండ్రులు ఎంతటి పేదరికంలో ఉన్నా కొడుకుని చదివించి ఆఫీసర్ని చేయాలని కలలు కంటారు. ఆర్థిక పరిస్థితి దిగజారినా ఆమె కొడుకుని చదివించాలనుకుంది, కానీ అతగాడు చదవలేదు. తల్లిదండ్రులు కొట్టి స్కూలుకి పంపాలని చూసినా పిల్లాడు అంగుళం కూడా లొంగలేదు…వాడి పట్టుదల అలాంటిది మరి. స్కూలుకి వెళ్లడం మానేశాడు.
ఈ రోజుల్లో గనుక అయితే అతడు కచ్చితంగా చదువుకునేవాడు, ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, భోజనం ఇస్తోంది. కానీ గనేశా విషయంలో సమయం మించిపోయింది.
అప్పటికి అతడు చిన్నవాడు, ఏ పనీ చేసే వయసు కాదు. ఇటు అటు ఊరకే తిరిగే బదులు ఏదో ఒక పని చేయడం మంచిదని తల్లి భావించింది. ఆమె గనేశాను సర్పంచుగారింట్లో పనికి కుదిర్చింది. అతడు పొద్దంతా సర్పంచుగారి గేదెలను మేపి సాయంత్రం రొట్టెల మూటతో ఇంటికి తిరిగొచ్చేవాడు.
మనిషికి చెడుకాలంలో ఒక చేయి జోడిస్తే రెండు చేతులు విరిగిపోతాయంటారు! గనేశా తల్లి సంపాదించేదంతా మొగుడి వైద్యానికే సరిపోయేది. ఇంట్లో అమ్మి ఖర్చు పెట్టడానికి ఏమీ లేదు.
ఇక గనేశా సర్పంచ్ గేదెలను మేపడానికి మారాం చేయడం మొదలుపెట్టాడు. ఒకటి రెండు రోజులు గేదెలు గుంజలకే కట్టేసున్నాగానీ గనేశా వాటిని మేపడానికి తీసుకెళ్లలేదు. తల్లి ఎంత చెప్పినా తిరుగుబాటు ధోరణిలో ఉన్న గనేశా వినలేదు. వీడి కడుపులో గింజలు పడుతున్నాయి కాబట్టే ఇలా ఎగురుతున్నాడని సర్పంచ్కి అర్థమైంది. తక్షణం ఆయన సహాయం ఆపేశాడు. మళ్లీ రొట్టెల కోసం అల్లాడాల్సి వచ్చింది. వారంలో ఒకటి రెండు రోజులు కూలి దొరికేది, మిగతా రోజులు ఇంట్లో కూర్చోవాల్సిందే.
గనేశాకి పద్నాలుగు- పదిహేనేళ్లు వచ్చాయి. గడ్డం, మీసాలు నల్లబడుతున్నాయి. తెలివితేటలు కూడా బాగానే పెరిగాయి. ఊళ్ళో పెద్ద లాభం లేదని మెల్లగా అర్థమైంది. ఊరు విడిచి బయటకు వెళ్లాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఊరి నుంచి బయటకు వెళ్లిన కొందరు బాగా సంపాదించుకుంటున్నారు.. తింటున్నారు. ఈ విషయాలే అతడి బుర్రని తొలిచేస్తున్నాయి.
సర్పంచుగారికి కూడా కుర్రాడు ఇక ఇక్కడ నిలవడని అర్థమైంది. మరి తన గేదెలను మేపేదివరు? వెంటనే ఓ పన్నాగం వేశాడు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయకపోతే తను సర్పంచ్ ఎలా అవుతాడు మరి! గనేశా తల్లికి ఒక ఆశ చూపించాడు-‘అబ్బాయి గేదెలు మేపే పని చూస్తే, నీకు పెన్షన్ సంగతి నేను చూసుకుంటా’నని చెప్పాడు.
సర్పంచ్ ప్రతిపాదనకు గనేశా తల్లి సంతోషంతో ఉప్పొంగిపోయింది. కృతజ్ఞతతో ‘ధర్మప్రభువులు’ అని కొనియాడింది. కొడుకుని బ్రతిమిలాడి గేదెలు మేపడానికి ఒప్పించింది.
ఆమె సంతోషానికి హద్దులు లేవు. వేయివిధాల సర్పంచ్ను దీవిస్తోంది. నేడు ఆమె చేతిలోకి ఎన్నడూ లేనిది, ఫెళఫెళలాడే నోట్లు వచ్చిపడ్డాయా…. ఆ డబ్బులు చూసి ఆమె కాళ్లు నేలపై నిలవడం లేదు. గాలిలో తేలిపోతున్న గనేశా తల్లికి దారిలో ఝున్నో ఎదురైంది. తలపై బస్తా చూసి ఝున్నో, “ఏం తెచ్చావే?” అని అడిగింది.
“గోధుమలు కొనుక్కొచ్చాను పిన్నమ్మా. ఇంట్లో తినడానికి గింజయినా లేకపాయె,” ఉత్సాహంగా అంది తల్లి. “బాబాయిగారు మహ మంచోరు.” తలపై బస్తా కిందకు దించుతా, “కాసిన్ని ఎక్కువ గోధుమలే వేశారు.” అంది సంబరంగా.
ఝున్నో ఆమె సంతోషాన్ని కనిపెడుతూ, “బస్తాలో ఎంత ఉందేమిటి?” అడిగింది
“ముప్పై సేర్లు” మురిసిపోతూ అంది ఆ తల్లి, “పిన్నమ్మా, పించను డబ్బులొచ్చాయి, అందుకే గోధుమలు కొన్నా!”
ఆ పెన్షన్ విషయమే చెప్పడానికి ఇందాకట్నుంచి ఆమె ఆరాటపడుతున్నది. ఎవరూ ఆమెను అడగలేదు, బస్తాలో ఏమిటని అజకోసం ఆపనూ లేదు. మరి ఇప్పుడు పిన్నమ్మ అడగడంతో ఆమె కోరిక నెరవేరింది. తన విజయగాథంతా చెప్పడానికి తహతహలాడుతోంది.
ఝున్నో ఆలోచనలో పడింది. వీళ్ల ఇంట్లో ఎవరికి పెన్షన్ వస్తోంది, దేనికి వస్తోంది? ఆమె ఎంత ఆలోచించినా తెగలేదు.
చివరికి విసిగిపోయి, “ఏమే! దేనికే నీకసలు పెన్షన్ వచ్చింది? నీ మొగుడేమైనా మిలటరీలో చేరాడా ఏమన్నా?” అంది ఝన్నో.
ఆమె మాటను పట్టించుకోకుండా గనేశా తల్లి ఆనందంతో, “వితంతు పించను డబ్బులొచ్చాయి పిన్నమ్మా. నిన్ననే బ్యాంకు నుంచి తీశా” అంది
“వితంతు పింఛనా!” అవ్వ కళ్లు చిన్నవిగా చేసి, “నీ ఇంట్లో ఎవరున్నారే ముండమోసినాళ్లు?” అంది
” నాకే వచ్చింది.”
“నీ మొగుడెప్పుడు చచ్చాడే?” ఝున్నో కోపంతో ఊగిపోయింది.
“ఏం చేసేది మరి! ఈ మొగోడికి ఎప్పుడు చూడు- కడుపునొప్పి! కష్టపడి కూలి చేయలేరు. సర్పంచ్ గారి దగ్గరకు పని కోసం వెళ్తే, పని దొరకలేదు కానీ ఈ పించను మంజూరు చేయించారు.” అంది. పైగా సంతోషంతో పొంగిపోతూ, “ఆరు నెలల పెన్షన్ ఒక్కసారిగా వచ్చింది పిన్నా!! వెయ్యి రూపాయలేమో సర్పంచ్ గారు తీసుకున్నారు, ఎనిమిది వందలు చేతికిచ్చారు. ఇకపై ఆయన డబ్బులు తీసుకోరు, మొత్తం నాకే వత్తాయంట. నా డబ్బులు ఆయనెందుకు తీసుకుంటారు గానీ…పాపం ఆ పై వొళ్ళకి కూడా లంచాలు పెట్టాలంటగా. సర్పంచి గారు సొంత జేబులోంచి ఇవ్వరుగా మరి”
ఝున్నోకి, గనేశా తల్లికి సాపత్యమే లేదు.. అయినా గనేశా తల్లి తృప్తిగా ఉంది. ఝున్నో మనసు కలవరపడింది. ఆ అయోమయంలోనే ఆమె, “అలాంటప్పుడు ఆయన ఇంట్లోనే పనికి కుదరొచ్చు కదంటే, దీనికంటే ఎక్కువ డబ్బులే ఇచ్చేవోడుగా”
“పిన్నమ్మా… నేను బాగానే పని చేస్తా గానీ గొడవలు ఎక్కడలేవు చెప్పు? అందరి ఇళ్లలోనూ ఉండే బాగోతమే. సర్పంచ్ గారు గొడవలకు దూరంగా ఉంటారు. కానీ సర్పంచ్ భార్య కాస్త అనుమానస్తురాలు. నాకు ఇది చాలు. ఏడాదికో, ఆరు నెలలకో కొంత మొత్తం చేతికి అందుతుంది కదా.”
అవ్వకి మతిపోయినట్లయింది. ఇదేం మాట? ఇలాంటిది ఆమె జీవితంలో మొదటిసారి వింటోంది, చూస్తోంది. కాసిన్ని కాసుల కోసం ఈమె ఇలాంటి వేషం వేసిందా! వేసింది సరే, ఊరుకోక ఊరంతా చాటింపు వేసి చెబుతోంది!
ఝున్నో తట్టుకోలేక గనేశా తల్లిని గద్దిస్తూ, “ఏమే! బతికున్న మొగుడిని చంపేసి విదవలా నాటకాలాడతావంటే.. సిగ్గు లేదా?” అని నిగ్గదీసింది.
“పిన్నమా… ఆకలికి విదవ-సదవా పట్టింపులుంటాయా.. ఈ పూజలు, పునస్కారాల ముచ్చట్లు కడుపు నిండినోళ్లకేనే. మనలాటోళ్ల జీవితాల్లో విదవరాలికి, సుమంగళికి తేడా యాడుందే చెప్పు?”
“నీకు ఇది కూడా ఆ సర్పంచ్ గాడే నేర్పించాడా?”
“పిన్నా….. సర్పంచ్ గారికి ఈ విషయాలెట్టా తెలుస్తాయి? అనుభవించినోళ్లకే ఇయన్నీ తెలుస్తాయి.”
ఝున్నో ఆమె ముఖం వైపు నిశ్చేష్టగా చూస్తూ ఉండిపోయింది. గనేశా తల్లి ముక్కెర పదే పదే కదులుతోంది. ముఖంలోని ఎర్రటి కాంతి ఆ ముక్కెరపై పడి మెరుస్తోంది. అవ్వ మనసులో ఎన్నో ఆలోచనలు సుడిగుండాలై తిరిగాయి. ఆ ఆలోచనలు మాటలుగా మారాయి, “అది సరేనే…ఆ పెభుత్వం నిన్ను విదవరాలని ఎలా నమ్మిందే?”
“ఏమీ లేదు పిన్నా, పోయేప్పుడు కాళ్ల మెట్టెలు తీసేసి, చేతులకి లబ్బరు గాజులేసుకున్నా…. అంతే, పించను మంజూరైపోయింది. ఇంటికి రాగానే మళ్లీ మెట్టెలు తొడుక్కున్నాను.”
విస్తుపోయింది పెద్దావిడ. తన ఊహకి అసలు అందనిదేమంటే, ఒక సుమంగళి ఇలా కూడా చేయగలదా?!! దేవుడిన్యాయాన్ని ధిక్కరిస్తున్నట్లుగా ఝున్నో నోటి వెంట బాధాకరమైన నిట్టూర్పుతో మాటలు పొంగుకొచ్చాయి : “అయ్యో రామా! ఎంతటి దౌర్భాగ్యంరా దేవుడా! ఓవైపు డబ్బంతా రాసులుగా పోశావా– ఈ వైపు కనీసం మడుసుల కడుపు నిండా తిండి కూడా లేకండా చేశావా! దేవుడా! అసలీ ఆకలి కడుపులు ఎందుకురా పుట్టించావు?”
![]()
రచయిత డా. లఖన్ లాల్ పాల్
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఉరయీ జిల్లాలో రామ్ నగర్ అనే చోట నివాసముంటున్నారు. అత్యంత సాధారణమైన వ్యవసాయదార్ల కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగి, పీ హెచ్డీ పూర్తిచేసి ప్రభుత్వోద్యోగం సాధించారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీ స్థాయిలో హిందీ లెక్చరరుగా పనిచేస్తున్న వీరి రచనలు హిందీలో దాదాపు అన్ని పత్రికలలో టంచనుగా ముద్రితమవుతుంటాయి. గ్రామీణ జీవనం వీరి కథలలో తొంగి చూస్తుంది. వందలకొలదీ కథలు దాదాపు పన్నెండు నవలలు రచించారు. అనేక పుస్తకాలు ప్రచురించారు. బుందేల్ ఖండ్ జీవనం, ఆ బుందేలీ భాష అంటే మక్కువ ఎక్కువ. కథలు హిందీలో రాసినప్పటికీ బుందేలీ భాషారూపం జారనివ్వరు. బుందేలీ జానపద నాట్యంలో (మన కోలాటం వంటిది) అందె వేసిన చేయి!
అనువాదకుడు డా. దండిభొట్ల నాగేశ్వరరావు
తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి వందకు పైగా కథలను అనువదించారు. ఇప్పటికి ఆరు అనువాద పుస్తకాలు ప్రచురించారు. విజయవాడ లొయోలా కాలేజీ, తమిళనాట కంచి విశ్వవిద్యాలయంలో హిందీ లెక్చరర్ గా సేవలందించి, ప్రస్తుతం కేంద్రప్రభుత్వ తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీశాఖలో సహాయక ఆచార్యులుగా పనిచేస్తున్నారు. తిరువారూర్ లో నివాసం. పాత లిపి అంటే మక్కువ. వివిధ శాసనాలు చదవటం, చరిత్ర పరిశోధన, అనువాదం అంటే ఇష్టం. తాళపత్రాల సంరక్షణలో అనుభవం. తిరుమల రామచంద్రగారంటే వల్లమాలిన అభిమానం!
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.




చాలా బాగుంది. ఈ తరం పిల్లలు తప్పక చదవాలి. అప్పుడే వాళ్ళకు కష్టం అంటే తెలుస్తుంది.