మూలం: హృదయ్ కౌల్ భారతి
అనువాదం: చింతపట్ల సుదర్శన్
(అపరిచితుడు’ ఐడెంటిటీకి ‘సంబంధించిన ప్రతీకాత్మక కథ. ఒక కాశ్మీరీ పురాగాధ ఈ కథకు ఆధారం. నాగరాజు అనే ఒక సర్పం మనిషి రూపంలో మానవ కన్య హీమాల్ నుప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నాగరాజు భార్య నాగరాణి అసూయతో హీమాల్ కు అతను మనిషి కాదని చెప్తుంది.నిజం తెలుసుకోవడానికి అతన్ని ఒక పెద్ద పాలతొట్టిలోకి దిగమని అడగమంటుంది. మనిషి రూపంలో ఉన్న నాగరాజు పాలతొట్టి లోకి దిగడం వల్ల తిరిగి సర్పంగా మారడంతో అతను మనిషి కాడనే నిజం హీమాల్ కు తెలుస్తుంది.)
అనుకోకుండా జరిగిపోయింది.
నేను అతన్ని ఢీ కొట్టానో లేక తనే నన్ను ఢీ కొట్టాడో ఖచ్చితంగా చెప్పలేను. చాలామంది జనం ఉన్నారు. అక్కడ ఎవరిని ఎవరు తోసేస్తున్నారో తెలియడం లేదు కానీ అందరూ ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మీద ప్రేమతో జనం ఇళ్ళకి తాళాలు కూడా వేయకుండా పరిగెత్తుకు వచ్చారు.
ఒకరోజు ముందుగానే అక్కడికి చేరుకున్న నేను సురక్షితంగా ఉండే స్థలం చూసుకున్నాను, నాకు తెలుసు ముందు వరుసలో జాగా లేకపోతే వెనక వచ్చే వాళ్లకు అడుగుపెట్టేందుకు కూడా స్థలం దొరకదు. ముందుగానే వెళ్లి స్థలం సంపాదించినా జనం తోపులాటకి నేను ఉండాల్సిన చోటు నుంచి మరోచోటికి తోసి వేయబడ్డాను. ఒకరినొకరు తోసుకుంటున్న జనం కాసేపటికి సర్దుకున్నారు.
నేను అతన్ని ఢీకొట్టానో లేక అతనే నన్ను ఢీకొట్టాడో ఖచ్చితంగా చెప్పలేను కానీ అలా ఢీకొట్టుకోవడం మరొక మనిషిని తోస్తే ఆ మనిషి మరొకరిని, మరొకరు,ఇంకొకరిని ఇలా ఒకరిని ఒకరు తోసుకోవడం గాలికి పొలంలో వరిచేను ఉయ్యాల ఊగినట్టు కనిపించింది.
“దీన్నే చైన్ రియాక్షన్ అంటారు” అన్నాడు అతను.
కాదు అన్నట్టు నేను తల అడ్డంగా ఊపాను.
“కాక మరేమిటి? అన్నాడు అతను.
“అసహనం, అశాంతి, చంచలత్వం అనుకుంటా”
అని నేను అంటూ ఉంటే ‘అవును’ అంటూ తల ఊపుతూ, నేనింకా వివరణ ఇస్తానేమోనని నా వైపు చూడసాగాడు అతను.
ఒక అపరిచితుడితో ఇంతకుమించి మాట్లాడకూడదు అనుకుని మౌనంగా ఉన్నాను. జనం గోల గోల గా అరుస్తున్నారు.ఎవరితో ఎవరు మాట్లాడుతున్నదీ అర్థం కావడం లేదు.
“ఏం నిర్ణయించబడిందో తెలియడం లేదు” అన్నాడు అపరిచితుడు. అతని గొంతులో ఆందోళన తెలుస్తున్నది.బహుశా ఇది అతను నాతో సంభాషణ పొడిగించడానికి ఏమో అనుకున్నాను.
“మంచి నిర్ణయమే అయి ఉంటుంది.మంచి వాళ్లకు అంతా మంచే జరుగుతుంది. “
నా మాటలు నమ్మినట్టు ముఖం పెట్టాడు అతను.నేనేదో ఒకటి అనాలని అనేశాను కానీ పెద్దగా ఆలోచించి అనలేదు. జనం మధ్య శబ్దం పెద్ద నోటితో తిరుగుతున్నది కానీ ప్రతి ఒక్కరి పక్కన ఉన్నది ఒక అపరిచితుడే.హఠాత్తుగా ఎవరో మంత్రం వేసినట్టు శబ్దాలు ఆగిపోయినవి. చాలాసేపటి వరకు నిశ్శబ్దమే రాజ్యమేలింది. తోలుతిత్తిలో నీళ్లు నింపుకు వచ్చిన ఒకడు మైదానంలో స్టేజి మీదకు వెళ్లే దారంతా నీళ్లు చిలకరిస్తున్న శబ్దం, శబ్దానికి మళ్లీ ప్రాణం పోసింది. వాడు వెళ్లిపోయేక పొడుగాటి ఎర్రటి చారలున్న తివాచీలను స్టేజి మీద పరిచారు కొందరు. ఆ తరువాత కొందరు అమ్మాయిలు పూల బుట్టలతో వచ్చి స్టేజిని పూల పందిరిలా అలంకరించారు. వాళ్లు వినయంగా తలలు వంచుకు వెళ్లిపోయాక
“ఇప్పుడు నాగరాజు వస్తాడు” అన్నాడు అపరిచితుడు తన ఊపిరి నాకు తగలేంత దగ్గరగా వచ్చి.
మొదట పనివారు ఆ పైన ఉన్నత ఉద్యోగులు వారి తర్వాత మంత్రులు, ఆపైన జనం ఆతృతగా ఎదురుచూస్తున్న ఆయన వచ్చాడు. ఆయన నాగరాజు అవునో కాదో ఎవరూ చెప్పలేదు. స్టేజి మీదకు వస్తూనే పాలతొట్టిలోకి దిగే పాత పద్ధతిని వ్యతిరేకిస్తున్నానని అన్నాడు. తరువాత గంభీరంగా ఇలా ప్రకటించాడు.
“ఈ నిమిషం నుంచి శరీరం మీద కానీ కాళ్ళూ చేతుల మీద కానీ పుట్టుమచ్చ ఉన్న ఏ వ్యక్తీ మన సమాజానికి చెందిన వాడు కాదు. మనవాడు కానే కాదు. పుట్టుమచ్చ ఉండడం అంటే గుర్తింపు లేకపోవడమే. పుట్టు మచ్చ లేకపోవడమే మన గుర్తింపు ముద్ర” అంటూ ఉపన్యాసం కొనసాగించాడు.
గుర్తింపుకు సంబంధించిన ఈ ప్రకటన వినగానే జనం దిగ్భ్రాంతికి లోనయ్యారు. సభలో అరుపులు మొదలైనవి. జనం బయటికి వెళ్లిపోవడానికి తోసుకో సాగారు. కొందరు ఓవైపుకు వెళ్తే మరికొందరు ఇంకోవైపుకు వెళ్ళారు. నేను మాత్రం అరచేత్తో బుగ్గ మీద ఉన్న పుట్టుమచ్చను కప్పేశాను. నా పక్కనే ఉన్న అపరిచితుడు నన్ను స్థిమిత పరచడానికి,
“మీరేం వర్రీ అవ్వకండి బ్రదర్! ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. నా వెంట రండి” అంటూ నా రెక్క పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకుపోయాడు.
నాకున్న పుట్టుమచ్చ ఒక రత్నంలా మెరుస్తుంది అనుకునే వాడిని ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది ఓ శాపంలా,ఓ పాపంలా, ఓ రోగంలా అంటరానితనానికి గుర్తులా కనిపించ సాగింది. అపరిచితుడు నన్ను ఆ పుట్టుమచ్చ నుంచి విముక్తి కలిగించే వారి దగ్గరకు లాక్కు వెళ్లాడు.
వైద్య బృందంలో కొందరు నా రక్తాన్ని పరీక్షించారు. కొందరు నా ఎముకలలోని మూలుగును విశ్లేషించారు. కొందరు నా ఎముకలకు అతుక్కుని ఉన్న మాంసపు ఆరా తీశారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాళ్లంతా ఏకగ్రీవంగా నాలో ఏ లోపము లేదని చికిత్స చేస్తే మచ్చ మాయం అవుతుందని అన్నారు.
“చికిత్సకు చాలా కాలం పడుతుంది కదా! ఓపిక కూడా అవసరం కదా! దాన్ని నా చర్మం మీద నుంచి చెక్కేయకూడదా? శస్త్ర చికిత్స అభివృద్ధి ఇంతేనా?”అన్నాను నేను దిగులు పడుతూ.
నా పక్కనే ఉన్న అపరిచితుడు నన్ను మళ్ళీ ఆపాదమస్తకం పరిశీలించమన్నాడు. రోగ నిర్ధారణ యంత్రాలు పనిచేశాయి.ఎక్సరేలు తీయబడ్డాయి.మాంసం నెత్తురు మళ్ళీ పరీక్షించబడ్డాయి.రిపోర్టులన్నీ ముందు పెట్టుకుని వైద్యులు మళ్లీ చర్చించారు. వైద్య బృందం నాయకుడు నా వైపు చూస్తూ
“వీలుపడదు. నీ మచ్చను చెక్కేయడం కుదరదు” అన్నాడు నిక్కచ్చిగా.
“ఎందుకు?ఎందుకు వీల్లేదు?ఎందుకు? అన్నాను నేను మొదట కొంచెం కోపంగా తర్వాత దీనంగా.
“ఎందుకంటే మచ్చ మూలాలు చాలా లోతుగా ఉన్నవి, నీ రక్తంలో, నీ స్వభావంలో, నీ సంస్కారంలో, నీ జన్యువుల్లో. తరం నుండి తరానికి అది బదిలీ అవుతూ వచ్చింది కనుక మేము ఆ మచ్చను చెక్కెయ్యడానికి ప్రయత్నిస్తే నీ చర్మపు రంగే కాదు నీ శరీరం మొత్తం మారుతుంది. నీ ముఖం కూడా గుర్తించలేనంతగా మారిపోతుంది. నువ్వు ఆకారంలేని ఒక నీడగా మిగిలిపోతావు” అన్నాడు ఆ వైద్యుడు.
నేను పూర్తిగా నిరాశతో కృంగిపోయాను నా పక్కన ఉన్న అపరిచితుడు నాకంటే ఎక్కువ నిరాశ పడ్డాడు కానీ తనను తాను సంబాళించుకుని
“నువ్వేం దిగులుపడకు ఈ ప్రపంచంలో అద్భుతాలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. మన ఊళ్లోనే మామూలు మనుషుల అంచనాకు అందని ఒక తాంత్రికుడు ఉన్నాడు. ఆయనకు అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉంది” అన్నాడు.
అపరిచితుడు నన్ను స్మశానంలో ఉన్న ఆ తాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆయన మొదట నా వంక తర్వాత అపరిచితుడి వైపు చూశాడు. కాసేపు ఆకాశం వైపు కళ్ళెత్తి పరీక్షగా చూసి మా వైపు తిరిగి
“నావల్ల ఇతనికి మేలు జరగాల్సి ఉంది కనుకనే నా దగ్గరికి తీసుకు వచ్చావు “అంటూ చేతి సంచిలో నుంచి ఒక వస్తువును బయటకు తీశాడు.
అది ఒక తేలు. నల్లగా మృత్యువులా ఉన్న తేలు. అది ఆయన మంత్ర శక్తికి కట్టుబడి కదలకుండా ఉంది.
“నీ సమస్యకు ఇదే చికిత్స!” అన్నాడు ఆయన అరచేతిలో కదలిక లేకుండా ఉన్న తేలును చూపుతూ.
“ఇదేం చికిత్స? అన్నాను నేను భయపడుతూ.
“ఇదేం చికిత్స కాదు నాయనా!ఇదే చికిత్స. ఇంగువ ఎలాగైతే చెట్టు తెగులును తినేస్తుందో అలాగే ఈ తేలు విషం నీ పుట్టుమచ్చను తినేస్తుంది.”
అంటూ ఆయన తేలును పైకి ఎత్తి దాని కొండిని నా బుగ్గ మీద ఆనించాడు.తర్వాత ఏదో మంత్రం చదవడంతో ప్రాణం వచ్చి తేలు కదలింది. అది మొదట నా మచ్చ పరిమాణాన్ని పరికించింది. తర్వాత దాని విషపు తిత్తిని ఉబ్బించి విషం మొత్తాన్ని తోకలోకి పంపి కొండి మచ్చమీద పెట్టి కుట్టింది. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ కుట్టింది. నేను మూర్చ పోయాను తెలివి వచ్చాక చూస్తే ఆశ్చర్యం.. నా బుగ్గ మీద మచ్చ మాయమైపోయింది. తెగులును తొలగించడానికి ఇంగువ, చెట్టు అంతా వ్యాపించినట్టు విషం నా నరాల్లోని రక్తంలోకి, నా శరీరపు మూలాలలోకి పాకి శరీరం మొత్తం విషంతో నిండిపోయింది. లోలోపల నొప్పితో బాధపడుతున్నా, నా గుర్తింపును,నా జాతిని ఇక ఎవ్వరూ సందేహించరు అని సంతోషించాను.
![]()
మళ్లీ జనం ఒకరినొకరు తోసుకుంటూ అన్నివైపుల నుంచి అక్కడికి వచ్చారు. నేను ఒకరోజు ముందే వచ్చి స్థలం సంపాదించుకున్నాను. ” ఏం నిర్ణయించబడిందో తెలియడం లేదు” అన్నాడు నా పక్కనే ఉన్న అపరిచితుడు.ఇదివరకు చెప్పిన జవాబే మళ్లీ చెప్పాను.
మరొకసారి దారంట నీళ్ళు చిలకరించేవాడు వచ్చి నీళ్ళు చిలకరించాడు.అమ్మాయిలు పూలబుట్టలు తీసుకువచ్చి స్టేజి అలంకరించారు.మళ్ళీ అపరిచితుడు” ఇప్పుడు నాగరాజు వస్తాడు “అన్నాడు తన ఊపిరిని నాపైన వదులుతూ.
మొదట పనివారు,ఆ పైన ఉన్నత ఉద్యోగులు వారి తర్వాత మంత్రులు ఆపైన జనం ఆతృతగా ఎదురుచూస్తున్న ఆయన వచ్చారు. ఆయనే నాగరాజు ఏమో అనుకున్నా. ఆయనే నాగరాజు అవునో కాదో ఇప్పుడు కూడా ఎవరూ చెప్పలేదు. స్టేజి మీదకి వస్తూనే పాలతొట్టి లోకి దిగే పాత పద్ధతిని వ్యతిరేకిస్తున్నానని అన్నాడు. తర్వాత గంభీరంగా ఇలా ప్రకటించాడు.ఈసారి ప్రకటన ఇదివరకు ప్రకటనలా లేదు.
“ఈ నిమిషం నుంచి ఏ వ్యక్తికి అయినా సరే శరీరం మీద కాని కాళ్ళూ చేతుల మీద కానీ పుట్టుమచ్చ లేకపోతే మన సమాజానికి చెందినవాడు కాదు. మనవాడు కానే కాదు. మనకు నిజమైన గుర్తింపు పుట్టుమచ్చ ఉండడమే. పుట్టుమచ్చే మన గుర్తింపు ముద్ర. పుట్టుమచ్చ అందానికి మన స్వభావానికి గుర్తింపు. ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో..”అంటూ ఉపన్యాసం కొనసాగించాడు.
ఈసారి కూడా జనం ఉపన్యాసం వినలేదు మళ్లీ తోపులాట మొదలైంది జనం అన్ని వైపుల నుంచి బయటకు పరిగెత్తారు. నా పక్కన ఉన్న అపరిచితుడు నిరాశ నిస్పృహల కారణంగా అంగుళం కూడా కదల లేకపోయాడు.” వర్రీ అవ్వకు మిత్రమా! ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది” అంటూ నేను అతన్ని రెక్క పట్టుకొని బయటకు లాక్కుపోయి స్మశానంలో ఉన్న తాంత్రికుడి ముందు నిలబెట్టాను.
మళ్లీ తాంత్రికుడు తన చేతి సంచిలో నుంచి మంత్ర శక్తికి కట్టుబడి కదలకుండా ఉన్న తేలును బయటకు తీశాడు. తేలుని అపరిచితుడి బుగ్గ మీద ఉంచాడు. తేలు అతని బుగ్గమీద కొండి ఎత్తి కుట్టింది. ఒకసారి కాదు.. మళ్ళీ మళ్ళీ కుట్టింది. అపరిచితుడు ఇదివరకు నేను మూర్చ పోయినట్టుగానే మూర్చపోయాడు . అపరిచితునికి మెలకువ రాగానే కనిపించింది బుగ్గ మీద ఒక నల్లని గుండ్రని మచ్చ. తేలు కుట్టిన చోట ఓ పుట్టుమచ్చ. ఇప్పుడు కూడా విషం అతని నరాల నుంచి రక్తం లోకి పాకి అతని శరీరం మొత్తం విషంతో నిండిపోయింది.అపరిచితుడు కూడా నొప్పిగా ఉన్నా లోలోపల సంతోషపడ్డాడు. ఇప్పుడు అతన్ని, అతని గుర్తింపుని, జాతిని ఎవరూ సందేహించరు. తర్వాత నాదారిన నేను వెళ్తే అతని దారిన అతను వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఒక విషయంలో మాత్రం మేమిద్దరం ఒకటే. నాలోపల ఉన్నట్టుగానే అతని లోపల కూడా విషం ఉన్నది.
![]()

1952లో జన్మించిన చింతపట్ల సుదర్శన్ కృష్ణాపత్రిక, విశాలాంధ్రల్లో 1972లో కవితలతో రచనలు ప్రారంభించారు. హైదరాబాదు పాతనగరంలో ‘ఉషస్సు’ లిఖితపత్రిక సంపాదకుడిగా నడిపారు. 1973లోనే హైదరాబాదు పాతనగరం రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘వేదిక’ లిఖిత పత్రికర సంపాదకుడిగా ఉన్నారు. 1982 నుంచి వివిధ పత్రికల్లో 1500కు పైగా కాలమ్స్ ప్రచురితం అయ్యాయి. కాలమ్, క్రిటికాలమ్, హాట్ కేక్, మాయాబజార్, కానికాలమ్, నాశనగాలమ్, వలపులవల, క్విక్ బాక్సింగ్, కలంకారీ, చల్తే చల్తే, చౌరస్తా, రంగస్థలం వంటివి ప్రముఖమైనవి.
అద్దం, క్రిటికాలమ్, సుదర్శన్ సెటైర్స్, తెలంగాణ.కాం, అమృతం కురవని రాత్రి (కథలు), పగలే వెన్నెల (నవల) ప్రచురించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనేక అనువాద రచనలు చేశారు. ముల్క్ రాజ్ ఆనంద్- అంటరానివాడు, రవీంద్రనాధ్ టాగోర్- శిలావిలాపం, ఆదిశంకరాచార్య- భజగోవిందం, ఆర్కే నారాయణ్- మాల్గుడి నవలలు లాంటివి ముఖ్యమైనవి.



