అలాగే నిశ్చలంగా పడుకుని ఉన్న ప్రశాంత్ ని కౌగలించుకుని గట్టిగా ఏడవాలని పిస్తోంది. మానమర్యాదల్ని పక్కన పెట్టేసి. అలాగయితే తప్ప ఈ వేదనకి అంతం లేదు. వర్షా బహెన్ అలాగే ఏడుస్తోంది కదా! ఎంత మంది స్త్రీలు ఆమెకు సాంత్వన వాక్యాలు పలుకుతున్నారు! ఆమె ప్రశాంత్ నుదుటి మీద చేయి వేసి, రాస్తూ, వెక్కి, వెక్కి ఏడుస్తోంది. అదే సమయంలో తమ ఇద్దరి చూపులు కలిశాయి. వెనువెంటనే ఆమె మళ్లి రోదించ సాగింది.
“వర్షా బహెన్! ఇక ఊరుకో! నువ్వు కాస్త ధైర్యం చిక్కబట్టుకోవాలి. ….”
“ప్రశాంత్ ఎంతో అదృష్టవంతుడు. ఇలాంటి మృత్యువు అందరికీ రాదు. కళ్ళు మూసి తెరిచేటంతలో అంతా అయిపోయింది. ఇంకా నిద్రపోతున్నట్టే ఆ ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో! …”
ఎవరెవరో ఏమేమిటో అంటున్నారు.
ప్రశాంత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నప్పుడు తనని జ్జాపకం చేసుకున్నాడో లేదో! ఆ సమయంలో తనాతని సమక్షంలో ఉంటే బాగుండేది. తానైతే ఆ సాయంత్రం వచ్చి, ప్రశాంత్ తో గడపబోయే మధుర క్షణాల గురించే ఆలోచించ గలిగింది. కాని, ప్రశాంత్ ఇలా అర్థాంతరంగా, తనతో చెప్పకుండా, తన అనుమతి తీసుకోకుండా, తనకేమాత్రం తెలియని మరో దిక్కుగా వెళ్లిపోతాడని ఊహించలేకపోయింది.
వర్షా బహెన్ ఏడుస్తూనే ఎవరితోనో చెప్పుతోంది. “రాత్రి సుమారు పది గంటలకి కాబోలు. కడుపులో ఏదో గాభరాగా ఉందని, గొంతు ఎండి పోతున్నట్టుందని అన్నాడు. నిమ్మకాయ రసం తెద్దామని నేనిలా వంటింట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంకేముంది? అంతా అయిపోయింది. డాక్టర్ని పిలిచే టైము కూడా లేదు. “
“అవును. అలాగే అవుతుంది. జరగవలసిందేదో జరిగిపోయింది. మనం ఎంత సేపు దేవుళ్ళాడినా పోయిన ప్రాణం తిరిగి రాదు. నీ నోరెండి పోతోంది. కాసిని మంచి నీళ్ళు తాగు. ఇంక ఊరుకో!” ఒక స్త్రీ ఆమెను ఓదారుస్తోంది.
తను అలా మూలనే నిశ్చేష్టురాలై నిలబడి ఉంది. రాత్రి పది గంటలకే అంతా అయిపోయిందన్న మాట. తనకి తెల్లారి పది గంటలకి కాని కబురు తెలియ లేదు. తెచ్చిన గులాబీలు చేతిలో అలానే ఉండి పోయాయి. ముందుకు వెళ్లి ప్రశాంత్ కి ఇష్టమైన ఆ తెల్ల గులాబీలు అతని భౌతిక కాయం మీద పెట్టే ధైర్యం చేయలేక పోయింది తాను. నిలువునా కూలబడి పోతానేమో నని భయపడింది.
బైట హడావుడి ఎక్కువైంది. కార్లూ, స్కూటర్లు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. వెళ్తున్నాయి. బహుశా శవవాహిక కూడా వచ్చే ఉంటుంది. ఇంక ప్రశాంత్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి. నీళ్ళతో నిండిన తన కళ్ళకి అవన్నీ అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రశాంత్ ని ఎత్తి పట్టుకున్నారు. వర్షా బహెన్ విరుచుకు పడిపోయింది. “నన్ను కూడా తీసుకు పొండి” ఏడుపు మధ్యలో ఆమె అంటున్న మాటలు తన చెవుల్ని తాకాయి.
ఒక్కసారి ప్రశాంత్ ముఖాన్ని చూడగలిగితే! ఒక్కసారి ఆ నుదుటి మీద చేయి వేసి రాయగలిగితే! తానంత దూరంగా కూడా లేదు. కేవలం అయిదారడుగులు మాత్రమే. కాని తను అడుగు ముందుకు వేయలేకపోయింది. తనని ఏదో అదృశ్య హస్తం ఆపు జేసింది. అయినా వర్షాబహెన్ ప్రశాంత్ శరీరాన్ని అంటిపెట్టుకుని వదలడం లేదు. కంపిస్తున్న చేతిలో గులాబులు కూడా కంపించసాగాయి. ప్రశాంత్ తనకి అతి సమీపంగానే నలుగురు మనుషుల భుజాల మీదుగా వెళ్లి పోయాడు.
కాసేపట్లో కాంపౌండు అంతా ఖాళి అయింది. వరండాలో మాధవీలతల పందిరి క్రింద రెండు కుర్చీలు ఖాళీగా పడి ఉన్నాయి. అక్కడే తామిద్దరూ కూర్చునేవారు. ఆడవాళ్ళంతా కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చారు. అక్కడ తానొకర్తె ఉందన్న విషయాన్ని కూడా విస్మరించి, అందరూ వర్షా బహెన్ చుట్టూ చేరారు. వారెవరూ తన ఉనికిని గుర్తించ లేదు. ఇక ఆమె అక్కడ నిలబడ లేకపోయింది.
ఏ సమయంలో నైనా తను స్పృహ తప్పి పడిపోవచ్చు. ఇక్కడి నుంచి తక్షణం నిష్క్రమించడం మంచిది. అసహాయురాలై రెండు చేతులు ఎత్తి, ఆ పైవాడికో నమస్కారం చేసి, ఇంటి బైటికి వచ్చింది. వర్షా బహెన్ తనను చూడను కూడా లేదు.
తనను ఉప్పుసముద్రంలాంటి కన్నీరు చుట్టుముట్టింది. వేదనా భరిత హృదయాన్ని తుపాను తనలోకి లాక్కుపోతోంది.
సరిగ్గా అదే సమయంలో ఎవరో తనకో చేయి అందించారు. తానాశ్చర్య పోయింది. కళ్ళు తుడుచుకుని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని పోల్చుకునేందుకు ప్రయత్నం చేసింది. కాని అలసిన కళ్ళు, ఉదాసీనమైన మనసు. బాధతో నిండిన హృదయం సహాయనిరాకరణం చేశాయి. తను అలానే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
“నువ్వు…. నువ్వు….? శ్రద్దా వి కదూ? నేను మాలతిని. ప్రశాంత్ చెల్లెల్ని. అదే… … పెద్దనాన్న కూతుర్ని. మనం ఎప్పుడూ కలుసుకోలేదు. కాని నీ పేరుతో నిన్నెరుగుదును. నాలుగు సంవత్సరాల క్రితం నేను ఒకసారి వచ్చాను. కాని అప్పుడు నువ్వు ఊళ్ళో లేవు. నేను దూరంగా ఉండడం వల్ల అరుదుగా వస్తూ ఉంటాను. కాని నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని నా కోరిక. ఈ సారి పది పదిహేను రోజులు ఉంటాను. తప్పక వస్తాను. ….”
తను ఎదురుగా నిలబడిన ఆ అజ్జాత వ్యక్తిని హఠాత్తుగా కౌగలించుకుంది.
![]()

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.




Discussion about this post