సంపాదకీయం:
సాహిత్యం కేవలం రంజింపజేసేది మాత్రమే కాదు. బుద్ధిని వికసింపజేసేది కూడా. ఆలోచనకు పదును పెట్టడంలో సాహిత్యం పాత్ర చాలా ఉంటుంది. చదవడం వల్ల మన సృజనాత్మకత, ఆలోచన వికసిస్తుంది. కథలు, కవితలు, నవలలు.. ఇలా సాహిత్యంలో ఏ ప్రక్రియ తీసుకున్నప్పటికీ.. చదువరుల ఆలోచనను వికసింపజేయడంలో తమదైన ముద్రను అవి కలిగి ఉంటాయి. ఎక్కువ తక్కువలుగా వింగడించడం సాధ్యం కాదు. భావగర్భితంగా, మార్మికత ప్రధానంగా సాగే కవిత్వంతోను, చదవడానికి సమయం ఎక్కువగా తీసుకునే నవలతోను పోలిస్తే కథా సాహిత్యం పాత్ర భిన్నమైనది. తెలుగులో ఇప్పుడు కథా సాహిత్యం విస్తారంగా వస్తుండడం శుభపరిణామం.
వర్తమానంలో.. సాహిత్యాన్ని పాఠకులకు అందించే మాధ్యమాలు మారుతున్నాయి. ఆధునిక యుగంలో పత్రికలు చాలా తగ్గిపోయాయి. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన దుర్మార్గపు సందర్భంలో సమూలంగా దెబ్బతిన్న రంగాల్లో పత్రికలు కూడా ఉన్నాయి. అనేకం మూతపడ్డాయి. అయితే, సమాజాన్ని సజీవంగా ఉంచగల సాహిత్యాంశ చచ్చిపోలేదు. ఆ అంశ విరాడ్రూపం దాల్చే ప్రయత్నంలో కొత్తకొత్త ఉరువులను, ఉడుపులను తొడుక్కుంది. సాహిత్యాన్ని పాఠకులకు అందించడానికి అనేక వెబ్ మేగజైన్లు వచ్చాయి. విస్తృతంగా కథలను, కవితలను, సాహిత్య వ్యాసాలను, నవలలను కూడా అందిస్తున్నాయి. ప్రత్యేకించి వెబ్ మాధ్యమంలో పేజీల పరిమితి లాంటి ఇబ్బందులు కూడా ఉండవు గనుక.. పెద్దకథలు కూడా బాగా అందుబాటులోకి వస్తున్నాయి. పైగా సోషల్ మీడియా రూపంలో అనేక వేదికలు ఏర్పడిన తర్వాత.. పలువురు రచయితలు ముద్రణ, వెబ్ పత్రికల కంటె తమ సొంత వేదిక మీద ప్రచురించుకోవడాన్నే ఇష్టపడుతూ ఉండడం కూడా మంచి పరిణామం. ఎవరు ఏం రాసినా సరే, ఎలాంటి పరిశీలన– ఎంపిక– ఎడిటింగ్ తో నిమిత్తం లేకుండా, వాటిని యథేచ్ఛగా పబ్లిష్ చేసుకోవడానికి అనుమతిస్తున్న వేదికలు చాలానే ఉన్నాయి. వీటివలన మేలుతో పాటు కీడు కూడా జరుగుతోంది. దీనివల్ల.. రచయితకు స్వేచ్ఛ పెరుగుతోంది. రాసేవారి సంఖ్య పెరిగింది. అంతిమంగా రాశి పెరుగుతోంది, కొన్నింటిలో వాసి ప్రశార్థకం అవుతోంది. కథలు ఎక్కువ రావడం ఎంత ముఖ్యమో.. అంతే సమానంగా నాణ్యమైన కథలు రావడం కూడా ముఖ్యం. నాణ్యతప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి, ఇతర భాషా సాహిత్యాలను గురించి తెలుసుకోవడానికి అనువాదాలు ఉపయోగపడతాయి.
తెలుగులో చాలా ఎక్కువగా సాహిత్య సృజన జరుగుతూ ఉంది. మంచి మంచి కథలు, కవితలు వస్తున్నాయి. భిన్న నేపథ్యాలను, విలక్షణ జీవిత పార్శ్వాలను పాఠకలోకానికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఇతర భాషా సాహిత్యాల విస్తృతి కూడా తక్కువేం కాదు. పత్రికల సంఖ్య గతంలో కంటే తగ్గినప్పటికీ సాహిత్యాన్ని మాత్రమే అందించే వెబ్ పత్రికలు అనేకం పుట్టుకు వచ్చాయి. రచయితల సంఖ్య కూడా పెరిగింది.

గతంలో సాహిత్యం కోసం ప్రత్యేకించిన పత్రికలు అనేకం ఉన్నప్పటికీ రామోజీరావు సారథ్యంలో నడిచిన ‘విశ్వకథా వేదిక– విపుల’ మాసపత్రిక విభిన్నమైనదిగా మన్నన పొందింది. విపుల ఒక్కటే అనువాద కథ సాహిత్యానికి పెద్దపీట వేసింది. కరోనానంతర పరిణామాల్లో ‘విపుల’ మూతపడిన తర్వాత అలాంటి ప్రయత్నం మరొకటి జరగలేదు. కేవలం అనువాద సాహిత్యం కోసం మాత్రమే ‘కథావసుధ’ వెబ్ మాసపత్రికను ప్రారంభించడం జరిగింది. కొన్ని సాంకేతిక ఇబ్బందులు, తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వలన కొంతకాలం ఆగిపోయింది. వాటన్నింటినీ దాటుకుని జులై నెల నుంచి తిరిగి ప్రారంభిస్తున్నాను. కథావసుధ పుట్టుక పూర్తిగా ‘విపుల’ అడుగుజాడలలో, రామోజీరావు స్ఫూర్తితోనే జరిగింది.
అనువాద సాహిత్యం వలన తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు జరిగే అవకాశం ఉంది. సమకాలీన ప్రపంచంలో ఎలాంటి రచనలు వస్తున్నాయో తెలుగు వారు కూడా తెలుసుకుంటూ ఉంటే.. వారి రచనలలో విలక్షణత, వైవిధ్యం పెరిగి సాహిత్యం సుసంపన్నం అవుతుంది. అందుకోసం ఈ ‘కథావసుధ’ వెబ్ పత్రిక తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది. బహుశా ఇతర భాషలలో కూడా ఎక్కడా లేని విధంగా తెలుగులో ఒకటి రెండు కథలు మినహా కేవలం అనువాద కథా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ ‘విపుల’ను తెలుగులోకానికి అందించిన రామోజీరావు స్ఫూర్తి ‘కథావసుధ’ పునాదుల్లో ఉంది. విపుల మూతపడడం వలన మాత్రమే ‘కథావసుధ’ పుట్టింది. ఇప్పుడు విపుల లేదు.. రామోజీరావు కూడా లేరు. విశ్వకథా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలని, తెలుగు రచయితల దరి చేర్చాలని తపనపడిన ఆయన స్ఫూర్తి, ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. ఈనాడులో కుడి ఎడమగా 14 ఏళ్లపాటు జర్నలిజం అభ్యసించిన నేను.. కష్టనష్టాలను ఓర్చుకోగల శక్తిని, జీవితంలో ఎన్నిసార్లు కిందపడ్డా సరే తిరిగి లేచి నిల్చోగలననే నమ్మకాన్ని అలవరచుకున్నాను. ఫలితమే ఒకసారి ఆగిన ‘కథావసుధ’ మళ్లీ ప్రారంభం కావడం! అందుకే ఈ ‘కథావసుధ’ వెబ్ మాసపత్రికను రామోజీరావు స్ఫూర్తికి అంకితం ఇస్తూ ముందుకు సాగాలనుకుంటున్నాను. విశ్వ కథా వేదికను తెలుగువారి ఎదుట ఉంచాలనుకున్న ఆయన ఆలోచనను, స్ఫూర్తిని శక్తి మేరకు కొనసాగించడం నాకు సంతోషకరం, గర్వకారణం అవుతుంది. ఈ ప్రయత్నం మీ అందరి ప్రోత్సాహంతో దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.
పరభాషా కథలను, కవితలను తెలుగులో అందించడంలో అనేక మంది అనువాద రచయితలు సహకరిస్తున్నారు. కథావసుధ కోసం ప్రత్యేకంగా అనువదిస్తున్నారు. అంత శ్రమ తీసుకుని అనువదిస్తున్నారంటే.. అది ఉత్తమ సాహిత్యమే అయిఉండే అవకాశం ఉంది. కథాప్రియులందరూ కథావసుధ వెబ్ మాసపత్రికను తప్పకుండా చదవండి. అనువాదంలో ఆసక్తి, అనుభవం ఉన్న రచయితలు కథలు, కవితలు తెలుగులోకి తర్జుమాచేసి పంపి సహకరించండి. ప్రతినెలా 1వ తేదీన ‘కథావసుధ’ పబ్లిష్ అవుతుంది. ఒకనెలకు సరిపడా పుష్కలంగా కథాప్రియులు చదువుకోగలిగిన ఉత్తమ సాహిత్యం మీకు అందుబాటులో ఉంటుంది.
మీ ప్రోత్సాహం అందుతుందనే నమ్మకంతో..
మీ
కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. మూడు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ‘గారడీవాడు’, ఒక కవితా సంపుటి ‘షష్ఠముడు’, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’, ‘పుత్రికాశత్రుః’, ఒక సంపాదకీయ వ్యాసాలసంపుటి ‘మునివాక్యం’ ప్రచురించారు. శీలా వీర్రాజు కథానిక పురస్కారం సహా ఆరు పురస్కారాలు లభింంచాయి.



Discussion about this post