చిన్నప్పుడు ‘చందమామ’ చదవకుండా పెరిగిన వాళ్లు, ఇవాళ్టి నడివయసు సాహిత్యకారులు, సాహిత్యాసక్తిపరుల్లో చాలా తక్కువగానే ఉంటారు. చందమామను చదువుకుంటూ కథలను తెలుసుకుంటూ పెరిగిన వారిలో నేను కూడా ఒకణ్ని. ఇప్పటికీ అనేక సందర్భాల్లో పిల్లలతోను, మిత్రులతోను మాట్లాడుతున్నప్పుడు, ఆ చందమామ కథలను నేను ఉదాహరిస్తుంటాను. చందమామ పార్సిళ్లు ప్రతినెలా కుడిఎడమగా పలానా తేదీల్లో మా ఊరికి వస్తాయని తెలుసు. వచ్చిన తర్వాత పేపర్ బాషా మా ఇంటికి కాపీ తెచ్చి ఇవ్వడానికి కొన్ని రోజులు పట్టేది. అప్పటిదాకా ఆగలేకపోయే వాడిని నేను. పైగా పేపర్ బాషా ఇల్లు మా ఇంటికి దగ్గరే. ఏడుగంగల గుడి దగ్గర!
ఈ పాటికి చందమామ వచ్చేసి ఉంటుందని అనిపించిన రోజునుంచి.. ప్రతిరోజూ సాయంత్రం పేపర్ బాషా ఇంటికెళ్లి.. ‘నా చందమామ వొచ్చిందా’ అని అడిగేవాణ్ని. బాషా ఇంట్లో లేకపోయినా, అప్పటికి రాకపోయినా.. రెండు మూడురోజుల పాటూ వరుసగా ప్రతి సాయంత్రం వాళ్ల ఇంటికి తిరిగి మరీ తెచ్చుకునే వాణ్ని. చందమామ చేతికి రాగానే మొట్టమొదటగా చదివేది మాత్రం ‘చైనా కథ’. చందమామలో, అప్పట్లో, చివర్లో ‘చైనాకథ’ అనే శీర్షిక కింద ప్రతినెలా ఒక కథ వేసేవాళ్లు. చైనా పేర్లున్న పాత్రలు, ప్రాంతాలు, చైనా వస్త్రధారణలో తమాషాగా కనిపించే బొమ్మలు ఇవన్నీ కలిసి మొదటగా నా ఆసక్తిని అక్కడకు లాక్కువెళ్లేవి. అందులో పేర్లు, ఊర్లు నిజంగా చైనాలోనివో, ఆ మాదిరి తమాషాగా పెట్టేవాళ్లో కూడా నాకు తెలియదు. కానీ.. మామూలు కథల కంటె భిన్నంగా, ఆసక్తికరంగా ఉండేవి అవి. అందుకని ముందు ఆ కథలను చదవడం ఒక ముచ్చట!
అనువాద సాహిత్యంలో ఉండే విలక్షణతే అది. అనువాద కథలను చదువుతున్నప్పుడు.. భిన్నమైన వాతావరణాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన వ్యక్తుల పేర్లు.. అన్నీ ఆసక్తిగా కనిపిస్తాయి. కొత్త ప్రాంతంలో పర్యటిస్తున్నట్టు, కొత్త మిత్రులను పరిచయం చేసుకున్నట్టు అనిపిస్తుంది. అనువాద సాహిత్యం చదవడం వల్ల ఇంకో గొప్ప మేలు ఉంది. ఇతర భాషల్లోని రచయితలు ఎలా ఆలోచిస్తున్నారు.. ఎలాంటి అంశాలు తీసుకుంటున్నారు. ఎలా రాస్తున్నారు.. ఇదంతా కూడా మనకు బోధపడుతుంది. సాహిత్యాన్ని ఇష్టంగా చదివేవాళ్లకు ఇదంతా ఎంత విలక్షణంగా కనిపిస్తుందో, కథలో కవితలో రాసే వారికి అంతే బాగా ఒక పాఠంలాగా ఉపయోగపడుతుంది. అనువాద సాహిత్యం కోసం ప్రత్యేకించిన ‘కథావసుధ’ ఇవాళ్టి పాఠకులు, రచయితలకు ఆ రకంగా ఉపయోగపడుతున్నదనే నమ్మకం కలుగుతోంది.
కథావసుధ పునఃప్రారంభం అయిన తర్వాత స్పందన చాలా బాగుంది. కొత్తగా వచ్చిన వెబ్ మేగజైన్ అయినప్పటికీ.. పాఠకుల్లోకి బాగానే వెళ్లింది. అనుకున్నదానికంటె ఎక్కువ మందే చదివారు. అలాగే అనువాద రచయితల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. అనువాద సాహిత్యం కోసమే ప్రత్యేకించిన వెబ్ మేగజైన్ గా.. అలాంటి రచనల్లో ఆసక్తి, అనుభవం ఉన్నవారు గుర్తిస్తున్నారు. తమంతగా కాంటాక్ట్ చేసి.. తమ రచనలు కూడా పంపుతాం అంటున్నారు. ఇది చాలా మంచి ఫరిణామం.
‘విపుల’ మూతపడిన తర్వాత.. అనువాద సాహిత్యం కోసమే ప్రత్యేకించిన వెబ్ మేగజైన్ చేయవచ్చు కదా అని ఎవి రమణమూర్తిగారు మొదటగా సూచించినప్పుడు నాకు ఇష్టంగానే అనిపించింది. కానీ రచయితల ప్రపంచంలో నాకున్న అతి తక్కువ పరిచయాల కారణంగా.. రచనలు తెప్పించుకోగలగడం నాకు సాధ్యమేనా అనే భయం కలిగింది. జంకాను. చాలా మంది అనువాద రచయితల కాంటాక్ట్ లు ఇచ్చి రమణమూర్తి గారే ప్రోత్సహించారు. అలా తొలి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ‘కథావసుధ’ తనంతగా గుర్తింపు తెచ్చుకోగలదనే నమ్మకం ఏర్పడుతోంది. ముందు ముందు అనేక భాషల నుంచి తెలుగులోకి వచ్చే మరిన్ని విభిన్నమైన కథలతో కథావసుధ అందరికీ మరింత దగ్గరవుతుందని నమ్మకం.
ఈ సంచికలో జపాన్, ఇరాన్, రష్యా, టర్కీ, ఇంగ్లిషు దేశాల కథలతో పాటు, తమిళ, ఉర్దూ, కన్నడ కథలు ఉన్నాయి. జెయమోహన్ తమిళ నవల ‘తెల్ల ఏనుగు’ ను తెలుగులోకి అనువదించిన అవినేని భాస్కర్, ఎస్ కుమార్ లు తొలి రెండు అధ్యాయాలను కథావసుధ పాఠకులకోసం ప్రచురణకు ముందే అందించారు. వారికి, ఆ పుస్తకాన్ని ప్రచురించిన ఛాయ పబ్లికేషన్స్ వారికి కృతజ్ఞతలు. ఆగస్టు 10వ తేదీన బెంగుళూరు బుక్ బ్రహ్మ ఉత్సవంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తొలి రెండు భాగాలు చదివి ఆ పుస్తకం మీద ఆసక్తి కలిగిన పాఠకులు విడుదలైన తర్వాత పుస్తకం కొనుక్కోవచ్చు.
1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబు వేసింది. యావత్ ప్రపంచాన్ని ఎప్పటికీ కలచి వేస్తుండే ఈ దుర్మార్గానికి ఇప్పటికి 80 ఏళ్లు! ఆ సందర్భంగా అప్పటి అనుభవాల గురించి నమోదు చేసిన పిల్లల జ్ఞాపకాలు కొన్నింటిని.. పి.శ్రీనివాస గౌడ్ తెలుగులో అందిస్తున్నారు. ప్రపంచ విలయాన్ని, వినాశనాన్ని శాసించే అణుబాంబు దాడి బాధితులకు నివాళి ఇది. ఈ సంపాదకీయానికి జోడించిన చిత్రం కూడా హిరోషిమాలోని పీస్ మెమోరియల్ పార్క్ ది.
కథావసుధలోకి ప్రవేశించండి.
కృతజ్ఞతలు.
మీ.
కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. మూడు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ‘గారడీవాడు’, ఒక కవితా సంపుటి ‘షష్ఠముడు’, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’, ‘పుత్రికాశత్రుః’, ఒక సంపాదకీయ వ్యాసాలసంపుటి ‘మునివాక్యం’ ప్రచురించారు. శీలా వీర్రాజు కథానిక పురస్కారం సహా ఆరు పురస్కారాలు లభింంచాయి.




Discussion about this post