[ గిడ్డకింది మాణిక్యం అనువదించిన తమిళ హైకూల సంకలనం ‘దిగులు కొంగ’ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
గిడ్డకింది మాణిక్యం కవి, కథకుడు, అనువాదకుడు. వారిది తమిళనాడు – ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోని పుత్తూరు పక్కన నారాయణవనం. అందువల్ల తమిళ భాష కూడా వచ్చు.
ప్రసిద్ధ తమిళ కవి అబ్దుల్ రెహమాన్ సంస్మరణలో భాగంగా తమిళనాడులో ఒక కవితా పోటీ నిర్వహించగా, ఎనిమిదివేల పై చిలుకు కవితలు వచ్చాయి. వాటిని మూడు దశలలో వడపోసి, 53 కవితలతో ‘వాడియదు కొక్కు’ అనే సంకలనం తెచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు లింగుసామి. ఈ సంకలనానికి వడియప్పన్ గారు సంపాదకులు. తమిళంలో ఈ పుస్తకాన్ని చదివినప్పుడు, అందులోని హైకూలు బాగా నచ్చడంతో, లింగుసామి గారిని, వడియప్పన్ గారి సంప్రదించి, అనువాదానికి అనుమతి పొంది తెలుగులో ‘దిగులు కొంగ’ అనే పుస్తకంగా తెచ్చారు మాణిక్యం.
హైకూ అనేది ప్రాస లేని మూడు పంక్తులతో, 5, 7, 5 syllable structure తో కూడిన ఒక సాంప్రదాయ జపనీస్ కవితా రూపమని అందరికీ తెలిసినదే. హైకూలు తక్కువ పదాలలోనే విస్తృత భావాన్ని వ్యక్తీకరిస్తాయి, ఒక స్పష్టమైన చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి. అనతి కాలంలోనే అత్యంత జనాదరణ పొంది, ఓ కవితా ప్రక్రియగా ఆయా భాషల సాహిత్యంలో స్థానం దక్కించుకున్నాయి. అన్యభాషలలోనూ అనువాదమయ్యాయి.
అయితే, హైకూ కవిత్వ అనువాదం చర్చనీయాంశం. హైకూలను చక్కగా అనువదించడం అత్యంత కష్టమని, అనువాదంలో తరచుగా మూల రచనలోని సొగసు, సూక్ష్మభేదాలు, ఇంకా structural precision లోపిస్తాయని చాలా మంది విమర్శకులు భావిస్తారు. కానీ నిపుణులైన అనువాదకులు పదానికి పదం ప్రత్యక్ష అనువాదం కంటే, కవితలోని దృశ్యాన్ని, భావోద్వేగ ప్రభావాన్ని లక్ష్యభాషలో వ్యక్తీకరించడంపై దృష్టి సారిస్తారు. ఒక హైకూను నేరుగా అనువదించడం కష్టసాధ్యమైనప్పటికీ, ‘అదొక కవిత’లా పనిచేసే సున్నితమైన, సృజనాత్మక అనువాదం అసలు రచన యొక్క సారాన్ని, గాఢమైన సౌందర్యాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించగలదు. ‘దిగులు కొంగ’ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ భావన బలపడుతుంది.
♣
“అనువాదం చదివేటప్పుడు హృదయాన్ని తాకడం ప్రధానమైన విషయం. అది అనువాదకుడి శ్రద్ధను పట్టిస్తుంది. అది అనువాదకుడి సామర్ధ్యాన్ని తేటతెల్లం చేస్తుంది” అని అనువాదాల గురించి చెబుతూ, “ప్రతీ కవితా ఒక్కొక్క కవిది. కవితా పూలను ఒక అందమైన దండలా కూర్చడానికి అనువాదకుడికి అవగాహన అవసరం. పూలన్నీ ఒకటే ఐతే సమస్య లేదు. పువ్వుక్కొక్క రంగు! పువ్వుక్కొక్క పరిమళం! ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే ప్రతి పువ్వులోని ప్రత్యేకతని అనువాదంలోకి తీసుకురావడానికి గిడ్డకింది మాణిక్యం చేసిన కృషి హర్షణీయం” అని వ్యాఖ్యానించారు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి తమ ముందుమాటలో.
“జీవితపు అనుభవాల సానరాయి మీద అరిగిపోతూ పదునుదేలిన మాటగా, పదంగా వ్యక్తం అవుతున్న కాలం గుండెచప్పుడు ఈ సంపుటిలో మనకు అడుగడుగునా వినిపిస్తుంది. వాక్యాల నిడివి క్లుప్తతే కాదు, వాస్తవాల వాడి, వేడి, తడి, సడి, జడి, దడి.. ఈ పుస్తకం మనకు అనుభవంలోకి తెస్తుంది” అన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పల్లిపట్టు నాగరాజు తమ ముందుమాటలో.
ఈ హైకూలు చదివాకా, వీరి అభిప్రాయాలు నూటికి నూరు శాతం సరైనవేనని పాఠకులకు అనిపిస్తుంది.
♣
ఈ పుస్తకంలోని కొన్ని హైకూలను పంచుకుంటాను.
జీవితంలో సంఘర్షణనీ, జీవన పోరాటంలో వ్యక్తి అనుభవించే వ్యథని కళ్ళకు కడుతుంది ర. దయాలన్ గారి హైకూ. “మంచు నిండిని అద్దంలో/కళ్ళ బొమ్మ గీసాను/కన్నీళ్ళు కారుస్తోంది.” మనిషి అంతర్వేదనకి దర్పణం పడుతుందీ హైకూ.
చిరు వ్యాపారుల బీద బ్రతుకుని అత్యద్భుతంగా వ్యాఖ్యానించింది మా. లోకేశ్వరన్ గారి హైకూ. “బుడ్డలమ్మేటోల్ల/ఊపిరి వెల/పది రూపాయలు”. తేలికపాటి బుడగలని అమ్ముకునే వారి బతుకు భారాన్ని అత్యంత ఆర్ద్రంగా చెప్పిందీ హైకూ.
“మనలాగే/నటిస్తోంది/మన నీడ కూడా” అనే హైకూని ఎమ్. సోలై వ్రాశారు. మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ, కృత్రిమంగా ప్రవరిస్తాం. ఎదుటివారు గ్రహించరని భావిస్తాం. కాని కొన్ని సందర్భాలలో మన నీడ కూడా మనలాగే నటిస్తుందని అంటున్నారు కవి.
ఈ హైకూలో విరోధాభాస బాగా పండింది. “శ్మశానానికి/జీవం పోసింది/ఓ శవం”. శ్మశానం అంటే నిర్జీవులను శాశ్వతంగా సాగనంపే తావు. సాధారణంగా అక్కడ మరణ సంబంధ వాతావరణం ఉంటుంది. కొత్తమంది సిబ్బంది ఉన్నా, అంత్యక్రియలు చేయాల్సి ఉన్నప్పుడే వాళ్ళకి పని ఉంటుంది. అంటే శవం ఉంటేనే వాళ్ళకి జీవిక గడుస్తుంది. అందుకే శవం శ్మశానానికి జీవం పోసిందన్నారు కి. శేఖర్.
వృద్ధాశ్రమంలో దింపేసిన తల్లిదండ్రులని ఇంటికి తీసుకొస్తే సంతోషమే. కానీ మరో రకంగా వస్తేనే బాధ. “వృద్ధాశ్రమంలో/తల్లిదండ్రులు/ఇంటికొచ్చారు చిత్రపటంలో” అన్నారు కవి మునివర్ హోసూర్ మునిమేఘలై. ఏమని వ్యాఖ్యానించగలం, మదిలో మెదిలే వేదనని అదుపు చేసుకోడం తప్ప!
బలహీనులకు, అల్పజీవులకు ప్రకృతే అండగా ఉండాలని ఆశిస్తున్నారు కవి వి. ముత్తురాజ. “గాలీ! నిదానించు/ఎగరడానికి నేర్చుకుంటోంది/చిన్ని సీతాకోకచిలుక” అని అనడంలో ఎంతో ఆశావాదం వుంది.
“చెట్టు నీడలో/మాట్లాడుతున్నారు/నరికే రోజు గురించి” అనే హైకూని కో. నారాయణన్ వ్రాశారు. తనని నరికేవాడికి సైతం నీడనిప్పడం చెట్టు ఔదార్యమైతే, ఇష్టారాజ్యంగా చెట్లని నరికి పర్యావరణానికి హాని చేయడం మనిషి ఆలోచనా రాహిత్యం!
తమిళనాడు కేరళ రాష్ట్రాలలో ఏనుగులు ఎదుర్కుంటున్న ఆవాస సమస్యలని, అడవుల్లో చోటు లేక జనారణ్యంలోకి వచ్చే ప్రయత్నంలో ఏనుగులు ఎదుర్కునే ప్రమాదాలను చక్కని హైకులో ఏడు పదాలలో వివరించారు పా. కవిత. “రైలు గుద్దిన/ఏనుగు అరుపులో/అడవి లేదనే బాధ వినబడుతోంది.” అన్నారామె.
ఆఖరున చేర్చిన ఓ హైకూ (కవి పేరు లేదు) బీదింటి పిల్లల పాట్లని అయిదు పదాల్లోనే వ్యక్తీకరించినా, వాటిలోని లోతైన భావం పఠితులను కదిలిస్తుంది. “బుడ్డలమ్మే బిడ్డలకూ/బుడ్డలు/ కొనే వయసే.”
చితికి, శకలాలుగా మారుతున్న జీవితాల వెతలను అత్యంత సరళంగా, ప్రభావంతంగా వ్యక్తీకరించారు తమిళ కవులు. మాణిక్యం గారు అంతే సరళంగా తెలుగులో అందించారు. “మూల భాషలోని స్వచ్ఛత లక్ష్య భాషలోనూ ప్రతిఫలించింది” అన్న కె. వి. మేఘనాథ్ రెడ్డి మాటలు యథార్థాలు.
ఆయా హైకూలకు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉండి కవితలోని స్ఫూర్తిని ప్రదర్శించాయి.
ఆర్ద్రత, సాంద్రత నిండిన ఈ హైకూల అనువాద పుస్తకం చదవదగ్గదనడంలో సందేహం లేదు.
~
(అనువాదకుడి మెయిల్:- gmanikyam1@gmail.com, మొబైల్:- 9492164107)
![]()
దిగులు కొంగ (అనువాద హైకూలు)
అనువాదం: గిడ్డకింద మాణిక్యం
ప్రచురణ: రేగి అచ్చులు
పేజీలు: 127
వెల: ₹ 100/-
పుస్తక ప్రతులకు కొరకు:
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
అటక.కో.ఇన్,
ఫోన్: 9010866078
ఆన్లైన్లో:
https://books.ataka.co.in/products/digulu-konga?variant=44888136712239
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.




Discussion about this post