తమిళ మూలం: ఎస్. రామకృష్ణన్
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ
తలుపును తడుతున్నప్పుడే అలాంటి ఒక గొంతు వినిపిస్తుందని మేము ఊహించలేదు. సందేహిస్తూనే వాకిట్లో నిలబడ్డాం. మధ్యాహ్నం మూడున్నర కావస్తుండొచ్చు. వీధిలో మనుషుల రాకపోకలు లేవు. పోస్టాఫీసు పక్కనున్న చిన్నవీధి అది!
‘‘వాకిట్లో ఏ కుక్కో వొచ్చి తలుపు తడ్తాంది. తలుపు తీసి సావమ్మా.’’ అని లోపలి నుండి ఒక మగగొంతు వినిపించింది.
తర్వాత కొన్ని నిమిషాలలో పచ్చగళ్లున్న చీర కట్టుకున్న ఒక వయసైన మహిళ మెల్లగా నడుస్తూ వచ్చి తలుపు తెరిచింది. అది కిర్రుమంటూ శబ్దం చేసింది.
వాకిట్లో నిలబడున్న మమ్మల్ని తీక్షణంగా చూస్తూ… ‘‘ఎవురు కావాలి?’’ అని అడిగింది.
‘‘నరసింహన్ సార్!’’ అని చెప్పగానే ఆ మహిళ ముఖం చిట్లించింది.
‘‘లోపలికెల్లండి.’’ అని వెనకున్న గదిని చూపించింది.
సందేహిస్తూనే మేము ముగ్గురుమూ లోపలికి నడిచాము. హాల్లో ఒక చెక్కకుర్చీలో మురికి బట్టలు కనిపించాయి. గోడకున్న చీలకు నల్లరంగు ప్యాంటు వ్రేలాడుతోంది. ఒకవ్యక్తి నేలమీద చాపను పరుచుకొని పడుకొనివున్నాడు. అతను చొక్కా వేసుకోలేదు. నీలిరంగు లుంగీ కట్టుకున్నాడు. ముందుకొచ్చిన అతని పొట్టంతా వెంట్రుకలే. మెడ మీదున్న చర్మం సాగి వ్రేలాడుతోంది. ఎర్రబడ్డ కళ్లు. అతను తలతిప్పి మమ్మల్ని సూటిగా చూశాడు.
లోపలి గదిలో టివి ప్రసారమవుతోంది. ఒక స్త్రీ మంచంమీద కూర్చొని ఆరిన బట్టలను మడుస్తూ టివిని చూస్తోంది.
ఇంటి గోడలు పాతబడి కనిపించాయి. కిటికీలను తెరుస్తున్నట్టు లేరు. గోడకు సాయిబాబా క్యాలెండర్ వ్రేలాడుతోంది.
పాతకాలం నాటి ఇల్లు. ఉత్తరం వైపున ఒక చిన్న గది. దానికి అడ్డుగా ఒక చిరిగిన చీరను వ్రేలాడదీశారు. ఆచీరను తొలగించి లోపలికి చూసేసరికి నరసింహన్ ఓ ఇనుప మంచంపై నిద్రపోతూ కనిపించారు. వీపుకు చెమటలు పట్టాయి. ఒక కాలు మంచం బయటికి చాపి వుంచారు. మనిషి బాగా పొడవు. మంచం చాలినట్టులేదు. సన్నని చేతులు. ఖద్దరు బనియనూ రంగు వెలసిన పంచా కట్టుకున్నారు. ఆ గదిలో ఒక చిన్న కిటికీ వుంది.
ఒక టేబుల్ ఫ్యాన్ స్టూలుపైన కనిపించింది. అదీ తిరగటం లేదు. ఆయనను లేపుదామా వద్దా అన్న ఆలోచనతో చూస్తున్నాను.
ఇలాగే వెనక్కు తిరిగి వెళ్లిపోదామా అని మోహన్ సైగచేశాడు. అయతే ‘తిరుజ్ఞానం’ ఆయన భుజాన్ని తడుతూ సన్నని గొంతుతో ‘అయ్యా అయ్యా…’ అని లేపాడు. ఆయన గాఢనిద్రలో వున్నట్టున్నారు. అతని గొంతు ఆయనను లేపలేదు.
గదిలో ఒక చిన్న మట్టి కుండ కనిపించింది. మంచం కింద ఒక రేకుల పెట్టె. పక్కన చెక్క మేజా. దానిమీ దసగం తిని వుంచిన ఆపిల్ పండును ఈగలు ముసురుకొని వున్నాయి. ఏవో మాత్రలు, చూర్ణం డబ్బా వుంది. దండెంమీద రెండు ఖద్దరు తువ్వాళ్లు కనిపించాయి.
గోడకు ఏదో పుస్తకం నుండి చించి అతికించబడిన ఫ్రెంచి కవి ‘రిల్గే’ ఛాయాచిత్రం కనిపించింది. యవ్వనంలో వున్న రొయ్నర్ మరియా రిల్గే. ఆ గది వినోద పరిస్థితిని రిల్గే విచిత్రంగా చూస్తున్నట్టుగా వుంది.
యాభై ఏళ్లల్లో నరసింహన్ మూడు కవితా సంపుటాలను వెలువరించారు. ఒక అనువాద సంపుటం, కవిత్వానికి సంబంధించిన రెండు వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. ఆయన కవిత్వం ఇంగ్లీషులోనూ, ఫ్రెంచ్లోనూ తర్జుమా చెయ్యబడ్డాయి.
ఇప్పటివరకూ ఏ పురస్కారమూ ఆయనకు ఇవ్వలేదు. ఆయన రాసిన ఏ పుస్తకానికీ ఆవిష్కరణ సభ జరగలేదు. ఏ పుస్తకంలోనూ ఆయన ఫోటో వుండదు. వ్యక్తిగత వివరాలేవీ తెలుసుకోలేము.
ఏ సాహిత్య కార్యక్రమాలకూ ఆయనను ఆహ్వానించినట్టుగా గుర్తులేదు. అయితే సీరియస్గా సాహిత్యాన్ని చదివేవాళ్లు ఆయనను ఓ ఉన్నతమైన కవిగా అభిమానించారు. అప్పుడప్పుడూ ఆయన కవిత్వాన్ని ఉదహరిస్తూ వుండేవాళ్లు.
గత పదిహేనేళ్లలో సాహిత్యపు ధోరణులు పూర్తిగా మారిపోవటంతో నరసింహన్ను గురించో, ఆయన కవిత్వం గురించో తెలియని ఒక యువతరం తయారైంది. ఆయన ప్రాణంతోనే వున్నారని కూడా ఎవరికీ గుర్తులేదు.
‘ముడివిలి’ అన్న కవిత్వ పత్రికలో పునః ప్రచురింపబడ్డ కవితలను చదివాకే, వాళ్లూ నరసింహన్ ఆనవాలునుకనిపెట్టారు. ఆయన తమ వూళ్లోనే వుంటున్నారని తెలిసి ‘తిరుజ్ఞానం’ ఆశ్చర్యపోయాడు. అతనే, ‘మనమే ఆయన చిరునామాను వెతుక్కుంటూ వెళ్లి ఆయన కవితలను విందాం’ అన్న ఆలోచనను వాళ్ల ముందుచాడు. అందుకనే వాళ్లు వచ్చారు.
![]()
‘‘ఆయన నిద్రపోనీ, మనం వెళ్లిపోదాం.’’ అని సన్నని గొంతుతో అన్నాను.
తిరుజ్ఞానం దాన్ని ఇష్టపడనట్టుగా గట్టిగా ‘‘అయ్యా…’’ అని మళ్లీ పిలిచాడు. ఆయన మేల్కొన్నట్టుగా పక్కకు ఒత్తిగిలాడు. తన గదిలో అపరిచిత యువకులు నిలబడి వుండటం చూసి ఆశ్చర్యపోతున్నట్టుగా ఆయన ముఖం మారింది. కళ్లను నలుపుకుంటూ చేతిని మంచంపై ఆనించి లేవటానికి ప్రయత్నించారు. చాతీ ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి. మనిషి చాలా వంగిపోయారు. తల వెనక మాత్రం కాస్త వెంట్రుకలున్నాయి. కళ్లద్దాలను వెతికి ముఖానికి తగిలించుకుంటూ తలగడను కాస్త వాల్చి పెడుతూ… ‘‘వచ్చి చాలాసేపయిందా?’’ అని అడిగారు.
‘‘ఇప్పుడే వచ్చాం. మీరు నిద్రపోతూ వున్నారు.’’ అన్నాడు మోహన్.
‘‘ఎండ ఎక్కువగా ఉంది. ఉక్కపోత తట్టుకోలేకపోతున్నా. కబీరును పట్టుకుని వున్నాను. అలాగే నిద్ర పోయాను.’’ అని తన తలగడ పక్కనున్న చిన్న ఇంగ్లీషు పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చూపించారు.
ఆ గదిలో పురుగుల మందు వాసనలాంటి వాసన వస్తోంది.
‘‘కూర్చోవటానికి చెయిర్లు లేవు. అలాగే నేలమీద కూర్చోండి. ఆ ఫ్యాన్ను పక్కకు జరపండి.’’ అన్నారు నరసింహన్.
ముగ్గురూ మంచం పక్కనే కూర్చున్నాం. ఆయన మా ముఖాల కేసే చూడసాగారు.
తిరుజ్ఞానమే చెప్పాడు: ‘‘అగవులగు’(అక్షర ప్రపంచం) అని ఒక చిరు సంచికను నడుపుతున్నాం. దానికి మీ కవితను అడుగుదామని వచ్చాం.’’
‘‘కాలేజీలో చదువుతున్నారా?’’ అని అడిగారు.
‘‘నేను పండ్ల అంగడి పెట్టుకోనున్నాను. ఇతను ఇంజనీరింగ్ చదివాడు. కానీ పూర్తిచెయ్యలేదు. మోహన్ ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాడు.’’ అన్నాడు తిరుజ్ఞానం.
‘‘ముగ్గురూ రాస్తారా?’’ అని అడిగారు నరసింహన్.
‘‘మేమిద్దరం కవితలు రాస్తాం. వీడు అనువాదాలు మాత్రం చేస్తాడు. పోయిన ఇష్యూలో కూడా ‘విలియమ్ కార్లోస్ విలియమ్స్’ ను ట్రాన్స్లేషన్ చేశాడు.’’ అని నన్ను చూపించాడు.
‘‘చక్కటి పొయెట్. నేనూ చదివాను.’’ అంటూ నరసింహన్ ఏదో ఆలోచనలో మునిగిపోయారు. గదిలో ఉక్కపోత భరించలేనంతగా వుంది. మెడకింద చెమట కారటం మొదలైంది.
‘‘సంచిక పేరేమిటన్నారు?’’ అని అడిగారు నరసింహన్.
‘‘అగవులగు’’ అన్నాడు తిరుజ్ఞానం.
‘‘మంచి పేరు. ఎన్ని ఇష్యూలొచ్చాయి?’’
‘‘మూడు. రాబోయేది నాల్గవది. దానికోసమే కవితలను అడుగుదామని వచ్చాం.’’ అన్నాడు తిరుజ్ఞానం.
‘‘నేను కవితలు రాయటం మానేసి ఇరవై ఏళ్లు అయిపోయాయి. అదే, మీలాంటి కొత్తగా చాలామంది కవులు వచ్చేశారుగా. ఇక మేమెందుకు?’’
‘‘అలా కాదయ్యా… మీ కవితలంటే మాకు చాలా ఇష్టం. ‘సోడియమ్’ అని మీ తమిళ కవితల సంపుటికి శీర్షికగా పెట్టటం సూపర్. అందులోనూ యాభైఏళ్ల క్రితమే. మీరు ఎక్స్పెరిమెంటల్గా చాలా రాశారు. ఇవ్వాళున్న కవిత్వానికి అదే మార్గదర్శి.’’ అన్నాడు మోహన్.
‘‘నేను కెమిస్ట్రీ చదివినవాణ్ణి. ఆ వాసన నా కవిత్వంలోనూ వుండి తీరుతుంది కదా.’’ అని సన్నగా నవ్వారు.
‘‘మీ పుస్తకాలేవీ ఇప్పుడు ప్రింట్లో లేవు. వాటిని రీ ప్రింట్ చెయ్చొచ్చేమో?’’ అని అడిగాడు మోహన్.
‘‘ఎవరు చదువుతారు? అవి వెలువడిన కాలంలోనూ వంద పుస్తకాలే అమ్ముడుపోయాయి. రెండువేల యేండ్ల కవిత్వ చరిత్ర కలిగిన తమిళ భాషలో ఒక కవి పుస్తకం రెండువేలు అమ్ముడుపోవటం లేదు. ఇదే యధార్థం.’అన్నారు నరసింహన్.
‘‘ఇప్పుడూ కవిత్వం తక్కువగానే అమ్ముడుపోతున్నాయి.’’ అన్నాడు తిరుజ్ఞానం.
వాళ్ల గదిలోకి గట్టిగా అడుగుల శబ్దాలతో ఎవరో వస్తున్నారన్న శబ్దం వినిపించింది. నరసింహన్ ముఖం మారింది.
హాల్లో పడుకొని వున్న ఆ వ్యక్తి గట్టిగా అరిచాడు: ‘‘ఎదురింటి వాకిలి ముందు బండిని నిలబెట్టింది ఎవురు? ముందు దాన్ని తియ్యండి. వోళ్లు అరస్తాండారు?’’
మోహన్ పైకి లేచాడు. ఆ వ్యక్తి నరసింహన్ను తీక్షణంగా చూస్తూ వెనుతిరిగాడు.
అతని ఆకారం తెరమరుగు కాగానే నరసింహన్ సన్నని కంఠంతో అన్నారు: ‘‘లోపలికి వస్తున్నప్పుడు మిమ్మల్ని తిట్టారా?’’
తిరుజ్ఞానం ప్రశాంతంగా వున్నాడు.
‘‘ఈ ఇంట్లో ఎవరికీ నేనంటే నచ్చదు. అసహ్యం. ఎంతగా అంటే చెప్పలేనంత అసహ్యం. ఎవరైనా నన్ను కలవటానికి వస్తే చాలు, వాళ్లపైనా విషాన్ని కక్కుతారు. ఇప్పుడు వెళ్లాడే, వాడు నా పెద్ద కొడుకు. లోపలున్నది నా భార్య. ఒక్కరికీ నేనంటే ఇష్టం లేదు. ఎందుకో చెప్పు `నేను చదవటం రాయటం నచ్చలేదు. పుస్తకం చదివి చెడిపోయానట. సగం లూజునట. ఇప్పటికీ నాకు పెన్షన్ డబ్బు వస్తూనే వుంది. దాన్ని తీసుకొని ఖర్చు పెడుతూనే వున్నారు. ఏమి జన్మాలో ఏంటో? వీళ్లను మార్చలేమని వదిలేశాను. అసహ్యంలోనే బ్రతకటం వుంది చూశావూ, అది నరకం. ‘తాంతే’ నరకాన్ని గురించి రాశాడే అదంతా ఒఠిదే, ఏమీ లేదు. ఈ నరకం నాకు బాగా అలవాటైపోయింది.’
‘‘మా నాన్నకూ పుస్తకాలు చదవటమంటే నచ్చదు.’’ అన్నాడు తిరుజ్ఞానం.
అది విని తలాడిస్తూ నరసింహన్ అన్నారు: ‘‘అందరి ఇండ్లల్లోనూ అంతే. పుస్తకాలు చదవటం మొదలు పెడితే సొంత ఆలోచలు వచ్చేస్తాయి. తర్వాత మనం చెప్పేది వినరని భయం. తాగుబోతును కూడా ఇంట్లోవాళ్లు అనుమతిస్తారు. కవిత్వం రాసేవాణ్ణి అనుమతించరు. దాని పేరే సంప్రదాయం.’’
అలా చెబుతున్నప్పుడు ఆయన గొంతులో కోపమూ, ఆవేశమూ ఉగ్రంగా బయటికొచ్చాయి.
మోహన్ బయటున్న బైక్ను పక్కగా పెట్టి లోపలికొచ్చాడు.
అతను నేలమీద కూర్చోబోతుండగా నరసింహన్… ‘‘కుండలో నుండి కొద్దిగా నీళ్లియ్యప్పా.’’ అని అడిగారు. మోహన్ కుండలోకి టంబ్లర్ను పెట్టాడు. కుండలో నీళ్లు లేవు.
‘‘నీళ్లు కావాలని అడగనా?’’ అన్నాడు తిరుజ్ఞానం.
‘‘ఎవరూ తీసుకొచ్చి ఇవ్వరు. నువ్వే లేచి వంటగదిలోకెళ్లి నీళ్లు పట్టుకు రా.’’ అన్నారు నరసింహన్.
తిరుజ్ఞానం మట్టికుండను తీసుకొని వంటగదిలోకి వెళ్లాడు.
తల వంచుకొని నరసింహన్ చెప్పారు: ‘‘మనిషి చాలాకాలం బతక్కూడదప్పా. బతికితే అన్ని అవమానాలనూ భరించే తీరాలి. రెండేళ్ల క్రితం ఒకరోజు బాత్రూమ్లో జారిపడ్డాను. నడుము ఎముక విరిగింది. మూడు నెలలు ఆసుపత్రిలో వున్నాను. నయమై ఇంటికొచ్చి చూస్తే ఒక్క పుస్తకమూ లేదు. అన్నింటినీ తీసి పాతపుస్తకాలు కొనేవాడికి వేసేశారు. నేను దాన్ని భరించలేకపోయాను. ఏడ్చాను. ఇకపై చదివి ఏం చెయ్యబోతావని అడిగాడు కొడుకు. చదవటానికి వయసుందా ఏంటీ? ఇలాంటి ఒక మతిహీనుణ్ణి కనుక్కున్నానని తల కొట్టుకున్నాను. పుస్తకాలే కాదు, కవితలు రాసి వుంచుకున్న నోటు పుస్తకం, పాత డైరీ అన్నింటినీ తీసి పడేశారు. నేను చచ్చిపోయాక ఏం జరుగుతుందో, దాన్ని ముందుగానే చూసేశాను. అదృష్టం, పాత పంచెలు పెట్టుకునే పెట్టెలో నాలుగు పుస్తకాలు పెట్టాను. అవే మిగులు. వాటినే మళ్లీమళ్లీ చదువుతున్నాను. పుస్తకాలు నన్ను వదిలి ఎప్పుడు వెళ్లిపోయాయో అప్పుడేనేను శవమైపోయాను. ఒఠి శవాన్ని మాత్రమే! భౌతిక కాయం పుస్తకాలు చదవవు.’’ అని చెప్పి ముగుస్తుండగా ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎడమచేత్తో దాన్ని తుడుచుకుంటూ చెప్పారు: ‘‘మీకు నా మనవడి వయస్సే వుంటుంది. తాతయ్యలా చెబుతున్నాను. చదవటం రాయటం అన్నీ ఇక చాలించండి. మీరైనా తెలివిగా బతకండి.’’
ఈ సలహాలే ఇంట్లోనూ చెబుతున్నారన్న అసహనంతో మోహన్ అన్నాడు: ‘‘ఎవరి కోసమూ నన్ను నేను మార్చుకోవటానికి వీలుకాదు.’’
నరసింహన్, మోహన్ను ఆసక్తిగా చూస్తూ వుండిపొయ్యారు. తర్వాత అంగీకరిస్తున్నట్టుగా చెప్పారు: ‘‘నేనూ అలాగే కదా ఉన్నాను. ఏదో నిరుత్సాహంతో చెప్పాను. నా కవిత్వాన్ని పక్కన పెట్టండి. మీ గురించి చెప్పండి. చిరు సంచికను నడపటం కోసం ఇప్పటివరకూ ఎంత ఖర్చు పెట్టారు?’’
‘‘ఇరవై వేలకన్నా ఎక్కువే ఉండొచ్చు!’’ అన్నాడు తిరుజ్ఞానం.
‘‘మీలాగా నేను ఏ రచయితనూ వెతుక్కుంటూ వెళ్లి కలిసింది లేదు. సిగ్గు, భయం! కవిత్వం రాసేవాడికి సాన్నిహిత్యం ఎందుకన్న భావన. పాఠకులలో ఎవరైనా నా కవిత బాగుందని ప్రశంసిస్తే కూడా సిగ్గుగానే వుంటుంది. నేను నగ్నంగా స్నానించటాన్ని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించేది.’’
‘‘కీర్తిని గ్రహించి సిగ్గుపడటమంతా మీ కాలంతో ముగిసిపోయింది.’’ అన్నాడు మోహన్.
‘‘వచ్చినప్పటి నుండి ఆ తమ్ముడు ఏమీ మాట్లాడలేదు. అనువాదకుడు అంటే మాట్లాడకూడదా?’’ అని నన్ను చూస్తూ అడిగారు నరసింహన్.
‘‘నాకు మాట్లాడటం చేతకాదు.’’ అన్నాను.
‘‘నేనూ అలాగే వున్నాను. ఇంట్లోవాళ్లు పెట్టిన ఇబ్బందులకు ఇప్పుడు గడగడమంటూ వాగుతూ వున్నాను.’’
‘‘ఇష్టంలేని ఇంట్లో ఎందుకున్నారు? వేరేగా వెళ్లి వుండొచ్చు కదా?’’ అని అడిగాడు మోహన్.
‘‘భయం. ఒంటరిగా వుండాలంటే భయం. అందుకనే కదా పెళ్లి చేసుకున్నాను. భయం నుండి బయట పడటానికి బదులుగా భయాన్ని పెంచుకుంటూ వుండిపోయాను. ఇప్పటికీ భయం పోలేదు.’’
‘‘చనిపోతామన్న భయమా?’’
‘‘లేదప్పా. బతకటానికి చేతకాలేదన్న భయం. ‘సోడియమ్’ వున్నదే, అది నీటితో కలిస్తే మంటలొచ్చేస్తాయి. అది స్వాభావికం. నేను అలాంటి మనిషిని. నీళ్లతో కూడా కలవలేకపోయాను.’’
‘‘ఒకవేళ గొప్ప కవిగా మీరు అంగీకరించబడి వుంటే ఇంట్లోవాళ్లు అంగీకరించేవాళ్లా?’’ అని అడిగాడు మోహన్.
‘‘డబ్బు, పేరు, కీర్తి ఇవి సమస్యలు కావు. నీకు మాత్రం ఒక ప్రపంచం, నీకు మాత్రం ఒక అభిరుచి ఎందుకుండాలని ఇంటివాళ్లు అనుకుంటున్నారు. దాన్ని వదిలిపెట్టి నేనూ టివి సీరియల్ చూస్తూ, వీధి గొడవలను మాట్లాడుతూ, ఇతరులను చూసి అసూయపడుతూ వుంటే ఇంటివాళ్లు అంగీకరించి వుండేవాళ్లు. మనకు ఎదురయ్యేఎన్నో అనుభవాలు బయటికి చెప్పుకో లేనివి. ఏ మాటా చొచ్చుకు వెళ్లలేని కాంతిలోనే అవి సంభవిస్తాయని రిల్గే చెబుతాడు. దాన్ని పూర్తిగా గ్రహించాను. శారీరకంగా నేను నరసింహన్ను. వయసు 82. అయితే కవిగా నా వయసు రెండువేలకన్నా పైన్నే. నేను అక్షరాలలో బతికేవాణ్ణి. నన్ను అక్షరాలలో దాచిపెట్టుకో గలిగినవాణ్ణి. ఒక్కో అక్షరమూ ఒక గుహ. అందులోనే నేను దాక్కొని వున్నాను.’’
తిరుజ్ఞానం ఆశ్చర్యంగా ఆయననే చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఆయన ఆకారం మారిపోయినట్టుగా అనిపించింది. వంటగదిలోకి వెళ్లిన నరసింహన్ భార్య గట్టిగా అరిచింది: ‘‘పనికిమాలిన మాటలు మాట్లాడిందంతా సాలు, బయల్దేరండి.’’
ఉన్నట్టుండి దీపం వెలుగును ఆర్పేసినట్టుగా నరసింహన్ మాటలు ఆగిపోయాయి. చీకటి ముసురుకున్నట్టుగా గ్రహించాము.
‘‘బయలుదేరతామయ్యా.’’ అన్నాడు మోహన్. ఆయన గోడకేసి చూస్తున్నట్టుగానే మౌనంగా తలాడించారు. అవమానాన్ని మరిచిపోవటానికి ప్రయత్నిస్తున్నవాడిలా తిరుజ్ఞానం కుండలో నుండి నీళ్లు ముంచుకొని తాగాడు.
నరసింహన్ సన్నని కంఠంతో అన్నారు: ‘‘నాకొక సాయం చెయ్యగలరా?’’
‘‘చెప్పండయ్యా…’’
‘‘ఇల్లొదిలి పెట్టి బయటికెళ్లి ఏన్నో ఏళ్లు అవుతున్నాయి…. వాకింగ్ స్టిక్ను వూతంగా పెట్టుకొని ఇంట్లోనే నడుస్తున్నాను. నన్ను వీధి చివరి వరకూ పిలుచుకొని వెళ్లి రాగలరా?’’
‘‘వెళదామయ్యా?’’
‘‘శ్రమేమీ లేదుకదా?’’
‘‘టీకొట్టుకెళ్లి టీ తాగుదామయ్యా.’’ అన్నాడు మోహన్.
ఆయన లేచి నిలబడ్డారు. ఆయన ఎత్తు ఇప్పుడు పూర్తిగా తెలిసింది. ఆరడుగులకన్నా ఎక్కువే. వూతకర్రను చేతబట్టుకొని తలెత్తి ముందుకు చూశారు.
అరిగిపోయిన రబ్బరు చెప్పులు ఒక పక్కగా పడుంది. దాన్ని వేసుకుంటూ గదిలో నుండి బయటికొచ్చారు.
ఏదో ఆలోచించాక తన వూతకర్రను పక్కన పెట్టేసి నా భుజమ్మీద చెయ్యేశారు.
‘‘నువ్వూ నాలాగే పొడవు. నన్ను పట్టుకుంటావు కదూ?’’ అని అడిగారు నరసింహన్.
తలాడించాను. వయసు మళ్లిన తండ్రిని వెంటబెట్టుకెళ్లినట్టుగా ఆయనను నడిపించుకుంటూ వెళ్లటం మొదలుపెట్టాను. హాలును దాటుతుంటే ఆ స్త్రీ అరవటం వినిపించింది.
‘‘ఇదిగో యాడికి పోతాండావ్. రోడ్లో పడి సచ్చేటందుకా, సెప్తే ఇను… లోపలికి పో.’’
ఆయన ఆ మాటల్ని పట్టించుకోలేదు. ‘‘ఇల్లొదిలిపెట్టి ఎల్తే… అట్నే ఎల్లిపో…’’ అని ఆ స్త్రీ మళ్లీ అరుస్తూ వుండటం వినిపించింది. వాకిలి దగ్గరకు రాగానే వీధిని తేరిపార చూశారు. ఆయన కళ్లు చిట్లించారు. నా భుజాన్ని గట్టిగా పట్టుకుని వీధినే చూడసాగాడు.
‘‘వేరే వూరులాగా వుంది… వీధి చాలా చిన్నదైపోయినట్టుగా అనిపిస్తోంది.’’ అన్నారు.
మేము వీధిలోకి దిగి నడవటం మొదలుపెట్టాం. నరసింహన్ మెల్లగా నడిచారు.
పదడుగులు నడిచాక వెనక్కు తిరిగి ఇంటికేసి చూశారు. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారు: ‘‘నేను కట్టిన ఇల్లు.దాన్ని చూస్తుంటే నాకే భయంగా వుంది.’’
తిరుజ్ఞానం అది విని నవ్వాడు. నేను నవ్వలేకపోయాను. మేము వీధి చివరికి రాగానే ఎండ తీవ్రంగా మాడ్చేస్తోంది. బడి వదిలిపెట్టి చిన్నపిల్లలు ఇండ్లకేసి వెళుతున్నారు. టీకొట్లో గట్టిగా పాట వినిపిస్తోంది.
నరసింహన్ బడిపిల్లల్ని ఆనందంగా చూస్తున్నారు.
తర్వాత నిస్సహాయతతో అన్నారు: ‘‘నాతోపాటు రాయటం మొదలుపెట్టిన వాళ్లందరూ వెళ్లి చేరిపోయారు. నేనొక్కడినే బాకీ. ఈ తరానికి మేమెవరమూ తెలియదు. మీలాగానే మేమూ ఇరవై ఏళ్లప్పుడు ట్రిప్లికేన్లో గదిని తీసుకుని పగలూరాత్రీ కవిత్వం గురించే మాట్లాడుకుంటూ వుండేవాళ్లం. ఒక చిరు సంచికను నడిపాము. పెద్ద పత్రికలేవీ నన్ను కవితలు అడగలేదు. చిరు సంచిక అన్న మాటే ఎంతందంగా వుంది… అడివిపువ్వు లాగా! చిరు సంచిక అన్నది చిన్న కాలువ లాంటిది. అందులో మాత్రమే పెరిగే చేపలుంటాయి…వాటిని సముద్రంలో పడేస్తే చచ్చిపోతాయి. నేనూ అలాగే.’’ అంటూ వీధిని చూడసాగారు.
సిలిండర్లను ఎక్కించుకొని ఒక మూడు చక్రాల బండి మమ్మల్ని దాటుకొని వెళ్లింది. ఆ బండి చేస్తున్న శబ్దాన్ని చిన్నపిల్లవాడిలాగా ఆస్వాదించి వినసాగారు నరసింహన్.
తర్వాత తిరుజ్ఞానాన్ని చూస్తూ అన్నారు: ‘‘ఎవరైనా తనను చూస్తారని భావించా నక్షత్రం వెలుగుతోంది? తనను బహిర్గతపరుచుకోవటమే దాని ఆనందం. కవీ అంతే! మీరందరూ నన్ను కలవటానికి రావటం సంతోషం. నాకు టీ వద్దు. తాగితే గుండెల్లో మంట పుడుతుంది. చాలారోజులుగా ఒక కవిత రాయాలనిపిస్తూ వుంది. మనసులోనాలుగైదు లైన్లు ఫామ్ అయ్యాయి. అది చెప్పనా?’’
ఇరవై యేండ్లు ఏమీ రాయని మనిషి తన మనసు మూలలో నుండి పొంగుకొచ్చే నీటిని కుమ్మరిస్తున్నట్టుగా వణికే గొంతుతో తన కవిత యొక్క మూడు వరుసలను చెబుతున్నారు. టీకొట్టు పాట శబ్దంలో అది స్పష్టంగా వినిపించలేదు. దాన్ని ఆయనే గ్రహించినట్టుంది. చటుక్కున కవిత చెప్పటాన్ని ఆపి, ‘‘నన్ను ఇంటికి చేర్చేయండి.’’ అన్నారు.
నేను ఆయనను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని చెప్పాను. మోహన్ తలాడించాడు.
ఇంటి దాకా వచ్చిన వ్యక్తి మెట్లెక్కుతున్నప్పుడు అన్నారు: ‘‘ఇకపై ఇలా నన్ను కలవటానికి రాకండి. ఎవరైనా కలవటానికి వచ్చినప్పుడే మనసెంతో నేరభావనతో నిండిపోతుంది… నేను చనిపోయానని అనుకోండి. అదే మీరు నాకు చేసే ఉపకారం.’’
నరసింహన్ మెట్లెక్కగానే ఆ స్త్రీ కోపంతో అరుస్తున్న గొంతు వినిపించింది. ఆయన వణుకుతున్న కాళ్లతో వూగుతూ లోపలికి వెళుతున్నారు.
![]()

1961 మే 1 న తిరుత్తణిలో జన్మించారు. ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ చేశారు. 1983 రచనలు చేస్తున్న ఆయన 161కి పైగా కథలూ, 123 పైగా కవితలూ రాశారు. ఏడు కథాసంపుటాలు, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. వీరి సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి. తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు చేస్తుంటారు. తమిళం నుండి 130 కి పైగా కథలు, 11 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం అనువదించారు. అనువాదంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు మరిన్ని అవార్డులు లభించాయి.




Discussion about this post