ఆంగ్ల మూలం: మంత్రిప్రగడ వెంకట శ్రీనివాస్
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
బెంగళూరులో వేసవి త్వరగా మొదలవడంతో, సూర్యుడు కూడా సాధారణం కంటే కొంచెం ముందుగానే ఉదయిస్తునట్లు అనిపిస్తోంది. వాకింగ్ ముగించుకుని, పార్క్లో కూర్చున్నాను.
మనస్సులో మౌనంగా విచ్చుకుంటున్న ఆలోచన లాగా, వేకువ నెమ్మదిగా వ్యాపిస్తుంది. గాలిలో ఏదో సున్నితమైన విచారం ఉంది – అయితే, అదేమీ నిరుత్సాహపరచదు కానీ మృదువుగా, మనలోకి మనం తొంగిచూసుకునేట్టుగా చేస్తుంది. తేలికపాటి పిల్లగాలి చెట్ల గుండా సున్నితమైన అలలుగా కదులుతోంది. సృష్టిలోని అత్యంత అందమైన, అలసిపోని గాయకులైన పక్షులు, తమ ఉదయపు బృందగానాన్ని ఆరంభించాయి. కొంచెం దూరంగా వెళ్తున్న వాహనాల ధ్వని, అప్పుడప్పుడు, ఇక్కడి నిశ్శబ్దానికి కాసేపు అంతరాయం కలిగిస్తోంది, అంతలోనే ఆ ఘన నీరవతలో లీనమైపోతోంది.
ఈ చిన్న శబ్దాలు, కదలికలు కలిసి వేకువపై – మృదువుగా, విస్తారంగా, వింతగా సాంత్వన కలిగించే అగోచర ఆచ్ఛాదనని సృష్టిస్తాయి.
ఈ నిశ్శబ్ద సమయంలో, హఠాత్తుగా నా మదిలో హరివంశ్ రాయ్ బచ్చన్ గారి ‘మధుశాల’ లోని కొన్ని పంక్తులు మెదిలాయి:
జీవన్ మే ఏక్ సితారా థా
మానా వహ్ బేహద్ ప్యారా థా
వహ్ డూబ్ గయా తో డూబ్ గయా
అంబర్ కే ఆనన్ కో దేఖో
కితనే ఇస్కే తారే టూటే
కితనే ఇసకే ప్యారే ఛూటే
జో ఛూట్ గయే ఫిర కహాఁ మిలే
పర్ బోలో టూటే తారోం పర్
కబ్ అంబర్ శోక్ మనాతా హై
జో బీత్ గయీ సో బాత్ గయీ
ఈ వేకువలో ఏదో గమ్మత్తు ఉంది, ఆ పంక్తులను తిరిగి సజీవం చేసింది. జీవితం తప్పనిసరిగా తన నక్షత్రాలను – మన వ్యక్తిగత ఆకాశంలో ఒకప్పుడు ప్రకాశవంతంగా ప్రకాశించిన – వ్యక్తులను, క్షణాలను, కలలను కోల్పోతుందని హరివంశ్రాయ్ బచ్చన్ భరోసానిచ్చే సరళతతో మనకు గుర్తు చేస్తారు. అలా జరిగినప్పుడు ఆ లోటు భరించలేనిదిగా అనిపిస్తుంది. అయినప్పటికీ విశాలమైన ఆకాశం ఎప్పుడూ ప్రకాశించడం ఆగదు. నక్షత్రాలు రాలిపోతాయి, కానీ విశ్వం ఎప్పటికీ దుఃఖించదు. జీవితం మౌనంగా, హుందాగా సాగిపోతుంది.
గాలి వీచినప్పుడు, పక్షులు చెల్లాచెదురైనా శ్రావ్యమైన రాగాలను కొనసాగిస్తున్నప్పుడు, నేనో నిగూఢమైన విషయాన్ని గ్రహించాను: వేకువ సౌందర్యం నా వెలుపల మాత్రమే లేదు. చల్లని గాలి, సున్నితమైన కిలకిలరావాలు, శబ్దాల మధ్య నిశ్శబ్దం కూడా – ఇవన్నీ నా చెవులను చేరిన క్షణంలో కరిగిపోయి, నిశ్శబ్దంగా గుండె లోపల ఎక్కడో స్థిరపడినట్లు అనిపించింది.
బహుశా సూర్యోదయం బాహ్య ప్రపంచంలోనే జరగకపోవచ్చు.
నాలోపల కూడా వేకువ విచ్చుకుంటోంది.
ఆపై, దాదాపుగా కాలపు పొగమంచు నుండి బయటకు వచ్చిన పాత ఛాయాచిత్రం లాగా, నా జ్ఞాపకాల నుండి ఒక స్నాప్షాట్ తీసుకోవడానికి ప్రయత్నించాను – దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ప్రపంచం. ఒకప్పుడు మా జీవితాలను నింపిన ముఖాలు – దగ్గరి దూరపు బంధువులు, పొరుగువారు, స్నేహితులు, సన్నిహితులు – అప్పుడు యవ్వన శక్తితో నిండి ఉన్నారు. వారి నవ్వు బిగ్గరగా ఉంది, వారి ఆశయాలు సరళమైనవి, వారి జీవితాలు ఒకదానికొకటి గట్టిగా అల్లుకున్నాయి. అయినప్పటికీ, అన్ని మానవ సమావేశాల మాదిరిగానే, అవి కూడా పుకార్లు, శత్రుత్వం, కనబడని అసూయలు ఆడే చిన్న నాటకాలతో నిండి ఉన్నాయి – ఇవన్నీ మనల్ని నిస్సందేహంగా మనుషులుగా చేసే సున్నితమైన అసంపూర్ణతలు.
నేడు, ఆ ముఖాలు చాలా వరకు తెలియని ఆకాశంలోకి అదృశ్యమయ్యాయి. అవి రాత్రి నుండి నిశ్శబ్దంగా జారిపోయిన నక్షత్రాలలా చెల్లాచెదురుగా ఉన్నాయి. విచిత్రంగా, ఆ లోటు, జ్ఞాపకాలలో బాధాకరమైన మాయాజాలంలా వ్యాపించింది – అవి ఒకప్పుడు మొత్తం ప్రపంచాలను నింపినట్లుగా అనిపించినా, ఇప్పుడు మాత్రం క్షణికమైన నీడల్లా కనిపిస్తున్నాయి. అవి నిజంగా అదృశ్యమయ్యాయా లేదా సడి లేని కాలపు అంబరంలో కరిగిపోయాయా అని ఆశ్చర్యపోతాం.
నిజానికి, జీవితం చాలా దుర్బలమైనది, కానీ అపారమైన శక్తితో నిండి ఉంటుంది. అయినప్పటికీ, ఆ పవిత్ర శక్తిలో ఎక్కువ భాగం చిన్న చిన్న తీర్పులు, ఆగ్రహాలు, ఇంకా అవ్యక్తంగా ఉండే స్పర్ధలలో ఖర్చైపోతుంది. ఆ పూర్వ యుగం నుండి సాక్షులుగా నేడు నిలబడి ఉన్న మనం, కొన్నిసార్లు, తరువాతి తరాలకు నిజంగా ఏ శాశ్వత సందేశాన్ని వదిలిపెట్టామో గుర్తుచేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.
అసలు జీవితమే కాలపు లోయల గుండా నిశ్శబ్దంగా ప్రవహించి వ్యాపించాలని నిర్ణయించబడితే – తీర్పులు ఇవ్వడంలోనూ, ద్వేషం నిండిన తీవ్రమైన విచారంలో జీవించడంలో మనం మన దివ్య శక్తిని ఎందుకు వృథా చేస్తున్నాం?
బహుశా, మనం తరచూ మరిచిపోయేది, బయట ఉన్న పక్షులకు తెలిసి ఉండవచ్చు. అవి వాదన లేకుండా పాడతాయి. గాలి, నిందారోపణ లేకుండా వీస్తుంది. ఆకాశం రాలిన, మెరిసే నక్షత్రాలను ఫిర్యాదు లేకుండా మోస్తుంది.
నిజానికి, వేకువ పాఠం చాలా సరళం: జీవితం మనల్ని – రాలిపోయిన నక్షత్రాలను పట్టుకోవద్దని, కానీ ఇప్పటికీ మిగిలి ఉన్న కాంతి కోసం మన హృదయాలను తెరిచి ఉంచమని అడుగుతుంది.
![]()
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.




Discussion about this post