కన్నడ మూలం: సరితా నవలి
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
“భట్టూ! ఈసారి జాతర మహోత్సవంలో దేనికీ లోటు రాకూడదు, అంతా అచ్చుకట్టుగా జరగాలి.” జాతర కమిటీ పర్యవేక్షకులు గోవిందరావు అన్నప్పుడు, “అలాగే చేద్దాం రావుగారూ, ఊరి జాతరలో పాల్గొనే అవకాశం దక్కడం మా అదృష్టం. మన శక్తివంచన లేకుండా శ్రద్ధగా చేద్దాం” అంటూ తన చేతిలోని చిన్న పుస్తకంలో ఏదో రాసుకున్నారు సుబ్బాభట్టు. అప్పగించిన పనులను నిర్వహించడంలో భట్టు గారు సమర్థుడని తెలిసిన గోవిందరావు ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు కనిపించింది.
సముద్ర తీరంలో ఉన్న అందమైన నగరం రాజేశ్వరీపురంలో గ్రామ దేవత వార్షిక జాతర సంబరం. వారం రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో స్వర్ణ రథోత్సవం, రజత రథోత్సవం, పల్లకి ఉత్సవాలు, త్రికాల పూజలు, విశేష హోమ హవనాలు, రకరకాల నైవేద్యాలు, భక్తి-సంగీత కార్యక్రమాలు మేళవించి ఉన్నాయి. గోవిందరావు, శ్యామరావు, వేణుగోపాలరావు ఇంకా ఇతర సభ్యులతో కూడిన జాతర కమిటీ వందలాది భక్తులను ఏకం చేసి, వివిధ విభాగాలను ఏర్పాటు చేసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని ప్రణాళిక వేసుకుంది. దానికి అనుగుణంగా పదుల సంఖ్యలో ఉన్న విభాగాలలో అనేకమంది భక్తులు తమను తాము అంకితం చేసుకున్నారు. అప్పుడే గోవిందరావు సుబ్బాభట్టును పిలిపించి మాట్లాడారు. ఎవరీ సుబ్బాభట్టు? మధ్య వయస్కుడు, మృదుభాషి, చిరునవ్వు చిందించే ముఖం కలిగిన వంట మాస్టారు! వంటలు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి.
పరిచయస్తులు ఎవరైనా పలకరించి, “ఏవండీ భట్టు గారూ, మీరు పిండివంటలు చాలా బాగా చేస్తారట కదా?” అని ప్రశ్నిస్తే, “మీకందరికీ నా చేతితో తీపి వంటకాలను తినిపించాలన్నదే నా ప్రయత్నం, చేదునైతే తినిపించను లెండి బాబూ!” అంటూ మార్మికంగా నవ్వేవాడు. చేతిలో గరిటెలు, వివరాలు రాసుకోవడానికి ఒక చిన్న పుస్తకం, ముఖంపై చెరగని చిరునవ్వు.. ఇవే సుబ్బాభట్టు అసలైన గుర్తులు. కేవలం పిండివంటలు తయారు చేయడమే కాకుండా, అందమైన రంగవల్లులు వేయడం, వేద పారాయణం, పూజా విధానాలలో కూడా ఈ భట్టు ఆరితేరిన వాడు!
గోవిందరావును కలిసిన తర్వాత, పెద్దలైన వెంకన్నభట్టు, తనతో పాటు అప్పుడప్పుడు వంట చేయడంలో తోడుగా ఉండే రంగన్న, నానిలతో కలిసి సుబ్బాభట్టు ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వెంకన్నభట్టు గారిని తన మార్గదర్శకుడిగా భావించిన సుబ్బాభట్టు, తన ఈడు వారైన రంగన్న, నానిలను తన ఆప్తమిత్రులుగా పరిగణించేవాడు. నైవేద్యానికి, మహాప్రసాదానికి వివిధ రకాల ప్రత్యేక భక్ష్యాలను తయారు చేయాలని నిర్ణయించుకొని, ఆ కొత్త రకపు వంటకాలకు కావలసిన సామాగ్రిని, వంట చేసే విధానం గురించి తన బృందంతో చర్చించి, వాటన్నింటినీ తన పుస్తకంలో రాసుకున్నాడు. అనేక విషయాల్లో ప్రావీణ్యం, అవగాహన ఉన్న భట్టు జాతర మహోత్సవంలో తనకు కేటాయించిన వంటపనితో పాటు ఇతర పనుల్లో కూడా తనను తాను నిమగ్నం చేసుకున్నాడు. సుబ్బాభట్టుకు తాము అప్పగించిన పనులను నిష్టతో నిర్వహిస్తాడని తెలుసుకున్న చాలామంది, తమ బాధ్యతలనన్నింటినీ భట్టు భుజాన వేసి, తాము మాత్రం పైపైన పర్యవేక్షణ చేస్తూ తిరుగుతుండేవారు. ఇవేవీ పట్టించుకోని భట్టు, తాను ఒప్పుకున్న పనులను సరిగ్గా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
భక్తులందరూ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న దేవి మహోత్సవం శ్రద్ధాభక్తులతో ప్రారంభమైంది. వివిధ పూజలు, విశేష హోమ హవనాలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేవి అలంకరణ, దీపోత్సవం, అందంగా ముస్తాబైన స్వర్ణ-రజత రథాలు, భక్తి-సంగీత కార్యక్రమాలు అందరి మనసులను ఆకట్టుకున్నాయి.. పదుల సంఖ్యలో ఉన్న విభాగాలలో వందలాది మంది భక్తులు అన్ని పనులను నిర్వహించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. సుబ్బాభట్టు తన బృందాన్ని వెంటపెట్టుకుని దేవి నైవేద్యం కోసం రకరకాల తీపి పిండివంటలను తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు. మహోత్సవంలో మొదటి రెండు రోజులు పూర్తయ్యేసరికి, తాము అప్పగించుకున్న పనులను ప్రామాణికంగా పూర్తి చేసే విషయంలో అందరిలోనూ సంతృప్తి కనిపించినప్పటికీ, ఆ తర్వాతి రోజుల్లో అక్కడక్కడ అసహనం, అభిప్రాయ భేదాలు, భట్టు దృష్టికి వచ్చాయి. భక్తి, సేవ అనే భావం ఉండాల్సిన చోట, కొందరు తమ అభిప్రాయాలను రుద్ది, తమ అధికారాన్ని చలాయించే ప్రయత్నంలో ఉన్నారని ఆయనకు అనిపించింది. మరికొందరైతే తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి, తమతో ఉన్నవారి కష్టాన్ని, వ్యక్తిత్వాన్ని, చివరకు ఎన్నో ఏళ్ల నాటి స్నేహాన్ని కూడా విస్మరిస్తున్నారు. వీరికి తోడు ఊరి రాజకీయ నాయకులు కూడా చేరి, రాబోయే పంచాయతీ ఎన్నికలలో తమ బలాబలాలను ప్రదర్శించడానికి అమ్మవారి జాతర మహోత్సవాన్ని వాడుకుంటున్నట్లు కనిపించింది. ఈ విషయం గురించి కొందరు స్నేహితులు ప్రస్తావించినప్పుడు, “ఇదేమైనా కొత్త విషయమా? ఇది అన్ని చోట్లా ఉండేదే!” అంటూ సుబ్బాభట్టు మౌనంగా ఉండిపోయాడు.
భట్టు బృందంలోని స్నేహితులు కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఒకరోజు సాయంత్రం నైవేద్యం కోసం తయారు చేయాల్సిన ‘దివ్యపాకం’ అనే ప్రత్యేక భక్ష్యం గురించి ఉపయోగకరమైన సలహా చెప్పబోతున్న భట్టు మాటలను మధ్యలోనే తుంచుతూ నాని ఇలా అన్నాడు:
“మేమంతా సామాగ్రిని సిద్ధం చేసేసుకున్నాం. ఇక దీనికి మరిన్ని పదార్థాలు కలపడం సాధ్యం కాదు భట్టూ”.
అతని గొంతులోని అసహనాన్ని ఈ సూక్ష్మబుద్ధి గల భట్టు ఇట్టే పసిగట్టాడు. “పదార్థాలు కలపడం అవసరం లేదు కానీ, కొలతలు సరిగ్గా ఉంటే బాగుంటుంది. ఈ వంట రుచి తెలిసిన భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ నీవు-నేను అనే మాటకే తావు లేదు” అంటూ వంటగది నుండి బయటకు నడిచాడు.
గోవిందరావు తనను పిలిపించి నైవేద్యపు పిండివంటలు తయారుచేసే బాధ్యతను అప్పగించారని చెప్పి, సుబ్బాభట్టు నానిని పిలవడానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం గుర్తొచ్చింది. ఇది దైవసేవ చేసే అవకాశమని మర్చిపోయి, ఈ వంట పని వల్ల తనకు కలిగే లాభనష్టాల లెక్కలు వేసుకున్నవాడు ఈ నాని. సాయంత్రం నైవేద్యానికి చేయాల్సిన ‘దివ్యపాకం’ మాత్రమే కాదు, మరెన్నో రకాల భక్ష్యాలను తయారు చేసే విధానాన్ని భట్టు దగ్గరే అడిగి నేర్చుకున్న నాని, ఇప్పుడు తనే అంతా తెలిసినవాడిలా మాట్లాడాడు.
వంటగది నుండి బయటకు వచ్చి, హోమ గుండం వద్ద మండల రంగవల్లి వేయాలని యాగశాల వైపు వెళ్తున్న సుబ్బాభట్టుకు, పెద్దల ద్వారా అప్పుడప్పుడూ వింటున్న డి.వి.జి. గారి ‘మంకుతిమ్మన కగ్గ’లోని పద్యపాదాలు గుర్తొచ్చాయి.
నిండు చిన్నమట్టికుండ, అపార పారావారమున్ మఱచి
నిండు గర్వంబున ‘నేనే నేనే’యనుచు గానంబు జేసిననేమి?
నిండు కడలిన్ దానినుంచ తన యస్తిత్వంబు గోల్పోయి లీనమై
నిండుతనంబున్ కోల్పోవు; గర్వంబు వలదు – మంకుతిమ్మ!
నాని వంటి వారికి ఇది సరిగ్గా సరిపోయే మాట అని భట్టు అనుకున్నాడు.
వారం రోజుల పాటు జరిగిన జాతర మహోత్సవం ఎంతో వైభవంగా ముగిసింది. ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు అక్కడి సంబరాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. రుచికరమైన పిండివంటలను ఆరగించి తృప్తి చెందారు. జాతర కమిటీ సభ్యులు కూడా ఎటువంటి పెద్ద ఆటంకాలు లేకుండా (రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ) కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు సంతోషించి, రాజేశ్వరీ దేవికి నమస్కారాలు సమర్పించుకున్నారు.
రాత్రి మహా మంగళహారతి తర్వాత, వివిధ విభాగాల్లో పనిచేసిన భక్తులందరినీ ఒకచోట చేర్చి, మహాప్రసాదం అందించి వారి సేవలను, శ్రమను కొనియాడారు. జాతర కమిటీ పర్యవేక్షకులైన గోవిందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్యామరావు, వేణుగోపాలరావు మొదలైనవారు మాట్లాడి అందరి పనితీరును మెచ్చుకున్నారు. వంట బృందం వారి పేర్లను ప్రస్తావించినప్పుడు, భక్తులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. గోవిందరావు చిరునవ్వు నవ్వుతూ తన ఎంపిక పట్ల గర్వపడ్డారు.
అదే సంతోషంతో ఆయన ‘వంట బృందం’ వైపు కన్నెత్తి చూడగా, ముందు వరుసలో వెంకన్నభట్టు, నాని మరియు రంగన్న కనిపించారే తప్ప సుబ్బాభట్టు కనిపించలేదు. వెంకన్నభట్టుగారు మాట్లాడూతూ తన బృందంలోని నాని, రంగన్నలను ఆకాశానికెత్తేశారు. అక్కడున్న కొందరు “సుబ్బాభట్టు”, “సుబ్బాభట్టు” అని అరిచినా, ఆ గందరగోళంలో ఎవరికీ వినిపించలేదు. పెద్దలైన వెంకన్భట్టు గారు తన మాటల మధ్యలో భట్టు పేరు మర్చిపోయి ఉంటారని అనుకున్నా, నాని, రంగన్నలు కూడా ఆయన పేరును గుర్తు చేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. రంగన్న మాట్లాడుతూ దైవసేవ చేసే అవకాశం కల్పించిన వెంకన్నభట్టు గారిని కీర్తించారు.
అందరూ ఒకరినొకరు పొగుడుకోవడాన్ని అక్కడే వెనుక వరుసలో నిలబడి చూస్తున్న సుబ్బాభట్టులో ఒక రకమైన నిర్లిప్తత కలిగింది. “స్తోత్ర పాఠాలు చదివే వారి సభలో స్వాభిమానికేం పని?” అని ఆయనకు అనిపించింది. పొగడ్తల సంతలో ఉన్నట్లు అనిపించి, తాను నిలబడిన చోటు నుండి వెళ్ళిపోయాడు సుబ్బాభట్టు. ఇదంతా గోవిందరాయలు గమనిస్తున్నప్పటికీ, సమయం లేకపోవడంతో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు.
![]()
జాతర సంబరాలు ముగిసి ఒకటి రెండు నెలలు గడిచాయి. ఆ రోజు శుక్రవారం కావడంతో ఆలయంలో జరిగే ప్రత్యేక పూజ కోసం వెళ్ళిన గోవిందరావు, ప్రతి వారం ఆ పూజలో పాల్గొనే సుబ్బాభట్టు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అర్చకులను విచారించగా, గత కొన్ని రోజులుగా భట్టు దేవాలయానికి రావడం లేదని తెలిసింది. దీంతో గోవిందరావు కొంత కలవరపడ్డారు. ‘జాతర మహోత్సవంలో తన అర్హతకు తగ్గ గుర్తింపు ఇవ్వలేదని, తన వారే తనను నిర్లక్ష్యం చేశారని ఆయన కోపగించుకున్నాడా? లేదా బాధపడ్డాడా?’ అని ఆలోచించారు. ఆ రోజు మహాప్రసాద వితరణ తర్వాత భట్టుతో మాట్లాడలేకపోయాననే విషయం గుర్తొచ్చి, సుబ్బాభట్టు ఇంటికి బయలుదేరారు గోవిందరావు.
అక్కడ ఆయనకు తెలిసిన విషయం ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని రెండింటినీ కలిగించింది! జాతర మహోత్సవ ఘటనలన్నింటినీ తన జీవిత అనుభవాల జాబితాలో చేర్చేసుకున్న సుబ్బాభట్టు, తన ఇంటి వద్ద పిల్లలకు వేద పాఠాలు నేర్పిస్తూ, తన వంశపారంపర్యంగా వస్తున్న దేవాలయాన్ని స్వయంగా నిర్వహించుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. లోకాభిరామాయణం మాట్లాడిన తర్వాత గోవిందరావు తన ముందస్తు ప్రణాళికను ఇలా చెప్పారు:
“ఇక వచ్చే నెలలో నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి కదా భట్టూ, తొమ్మిది రోజుల నైవేద్యపు పిండివంటలు మీరే చేయాలి. మీకు సహాయంగా రంగన్న, నాని వద్దు అనిపిస్తే, వేరే ఎవరినైనా పిలిపిద్దాం. లేదా మీ పరిచయస్తులు ఎవరైనా ఉంటే చెప్పండి, ఏమంటారు?”
“మనం అనుకుంటే సరిపోదు రావుగారూ! అందరూ స్నేహితులే అని అవతలి వారు కూడా అనుకోవాలి కదా! అదంతా వదిలేయండి. అయితే ఈసారి నవరాత్రి పనులకు రావడం నా వల్ల సాధ్యపడదు. ఉదయం పిల్లలు వేదపాఠాలు నేర్చుకోవడానికి వస్తారు, ఆ తర్వాత పూజా కార్యక్రమాలతోనే సమయం సరిపోతుంది. మిగిలిన సమయంలో నేను కూడా పాఠం అభ్యాసం చేసుకుంటున్నాను, నా కొడుకుకు కూడా నేర్పిస్తున్నాను. అలా అని అమ్మవారి దర్శనాన్ని మాత్రం వదులుకోను. సాయంత్రం వస్తాను, నా వల్ల అయిన సేవ చేస్తాను” అని వినయంగా చెప్పాడు.
పొగుడుతూ, పొగిడించుకుంటూ అవకాశాలు దక్కించుకునే వారి ముందు స్నేహం కూడా చిన్నబోతుందని గ్రహించి, సాధన మార్గంలో అడుగులు వేస్తున్న భట్టు ఆత్మాభిమానం ఇక్కడ పైచేయి సాధించింది.
అక్కడి నుండి ఇంటికి బయలుదేరిన గోవిందరావు ఆలోచనల్లో సుబ్బాభట్టు నిండిపోయాడు. మనిషి తన సామర్థ్యంతో, దృఢ నిశ్చయంతో, సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు తన ముందు వచ్చి నిలుస్తాయి కదా? నడిచే శక్తి, సామర్థ్యం ఉన్నవాడికి ఒకటో రెండో ఏముంది? వందలాది దారులు ఉంటాయి! భట్టు గారి పట్ల అభిమానం కలిగి గోవిందరావు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భుజంపై ఉన్న పైపంచతో కళ్లు తుడుచుకుంటూ తనలో తానే ఇలా అనుకున్నారు.. “నడిచేవాడికి నూరు దార్లు! వెదికేవాడికి వేయి ఉపాయాలు!”
![]()

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.




Discussion about this post