అంగ్ల మూలం: మాయా ఏంజెలో
తెలుగు: బొల్లిముంత వెంకట రమణా రావు
మహావృక్షాలు కూలినప్పుడు,
దూరపు కొండలపై రాళ్లు కంపిస్తాయి;
సింహాలు
గుబురు గడ్డిలో తలదాచుకుంటాయి,
ఏనుగులు సైతం
ఆశ్రయం కోసం
భారీ అడుగులతో ముందుకు సాగుతాయి.
మహావృక్షాలు కూలినప్పుడు
అడవులలో—
చిన్న జీవాలు
నిశ్శబ్దంగా ముడుచుకుపోతాయి;
వాటి ఇంద్రియాలు
భయంతో కలవరపడతాయి.
.
మహాత్ములు మరణించినప్పుడు,
మన చుట్టూ గాలిస్పర్శ
తేలికగా, పలుచగా, నిర్మలంగా మారుతుంది;
మనం శ్వాసిస్తాం—ఒక క్షణం;
మన కళ్లూ—ఒక క్షణం—
బాధతో కలవరపడతాయి.
మన జ్ఞాపకాలు ఒక్కసారిగా పదునెక్కి,
మనసును తడుముతాయి—
మరచిపోయిన మంచి మాటలను,
నెరవేరని వాగ్దానాలను,
నడవని మార్గాలను
మళ్లీ మళ్లీ గుర్తు చేస్తాయి.
మహాత్ములు మరణించినప్పుడు,
వారితో ముడిపడిన మన ప్రపంచం
నిశ్శబ్దంగా మనల్ని విడిచి వెళ్తుంది;
ఒకరి ఆధారంపై నిలిచిన
మన ఆత్మలు కుంచించుకుపోతాయి.
వారి తేజస్సుతో రూపుదిద్దుకున్న
మన మనస్సులు
నెమ్మదిగా వెలిసిపోతాయి;
మనం పిచ్చివాళ్లం కాదుగాని—
చెప్పలేని అజ్ఞానంలోకి,
చీకటి గుహల్లోకి జారిపోతాం.
మహాత్ములు మరణించిన అనంతరం,
కొంతకాలం తరువాత
శాంతి మెల్లగా వికసిస్తుంది—
అది ఎప్పుడూ సమంగా ఉండదు.
శూన్యాన్ని నింపుతూ విస్తరిస్తాయి
ఒక మృదువైన, ఓదార్పునిచ్చే స్పందనతో;
మన ఇంద్రియాలు మళ్లీ మేల్కొని,
ఇక మునుపటిలా కాకుండా,
మనతో మెల్లగా మాట కలుపుతుంది—
వారు ఉన్నారు… వారు ఉన్నారు…
మనమూ ఉండగలం…
ఇంకా మెరుగ్గా ఉండగలం—
ఎందుకంటే వారు ఉన్నారు




Discussion about this post