• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

‘కథాభారతి’కి అనువాద హారతి

ఎమ్వీ రామిరెడ్డి by ఎమ్వీ రామిరెడ్డి
March 24, 2023
in సాహిత్య వ్యాసం
0
‘కథాభారతి’కి అనువాద హారతి

తెలుగు కథ కొత్త పుంతలు తొక్కుతోంది. మిగతా భాషల కథా సాహిత్యమూ తక్కువేం కాదు. ఇతర భారతీయ భాషల్లోనూ భిన్న శైలీశిల్పాలతో కథ తలెత్తుకు నిలబడుతోంది.

అనువాదరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడిరచిన ఆర్‌.శాంతసుందరి గారు 11 భాషలకు చెందిన 19 మంది సుప్రసిద్ధ రచయితల కథలను తెలుగులోకి అనువదించి, వెలువరించిన సంకలనం ‘‘కథా భారతి’’. హిందీ, ఉర్దూ, పంజాబీ, రాజస్థానీ, మైథిలీ, గుజరాతీ, బెంగాలీ, నేపాలీ, ఒరియా, తమిళం, మలయాళం రచయితలు సృజించిన కథలను శాంతసుందరి తెలుగు అక్షరాలతో సత్కరించారు.

ఇందులోని ప్రతి కథా ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల పాఠ్యాంశంలాంటిది అంటే అతిశయోక్తి కాదు. సంక్షోభాల వెనక దాగి ఉండే కుట్రలు, అనుబంధాల మధ్య ఆత్మవంచనలు, హక్కుల అంతరార్థాలు, స్వార్థం దుప్పటి కప్పుకున్న పేగుబంధాలు, కనిపించకుండా కవ్వించే అదృశ్య శక్తులు, ‘ముంపు’నకు గురైన జ్ఞాపకాలు, అవసరార్థం ప్రాణం పోసుకునే రాజీసూత్రాలు, సాధారణ జీవుల సంక్షోభ జీవనం, మధ్య తరగతి మథనం, మగవారి దాష్టీకం, కుటుంబాల్ని కొద్దికొద్దిగా తినేసే పేదరికం… ఇలా అనేకాంశాల సమాహారం ఈ కథాగుచ్ఛం.
గుక్క తిప్పుకోని వేగంతో నడిచే రాజస్థానీ కథ ‘‘హక్కు’’. తనో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సర్జన్‌ను కలిసి అబార్షన్‌ చేయమంటుంది. ఆసుపత్రి లీగల్‌ సలహాదారు కుదరదంటాడు. అబార్షన్‌ చట్టం ప్రకారం ఇరవై వారాల వరకూ ‘అది నా హక్కు’ అంటుందామె. అది పెళ్లయిన స్త్రీలకు మాత్రమేనని సలహాదారు వాదన. పోనీ, ‘భర్త పేరు రాయండి, అబార్షన్‌ చేస్తాం’ అంటారు.
‘అల్రెడీ ఓసారి చేయించుకున్నా. లివింగ్‌ టుగెదర్‌. నా ఇష్టం’ అంటుందామె.
చేయకపోవడమనేది తన స్వేచ్ఛకు భంగం కలిగించడమేననీ, హక్కును తిరస్కరించడమేననీ వాదిస్తుంది. తన స్వరాన్ని బలంగా వినిపిస్తుంది.
డాక్టర్‌ ఓ కోరిక కోరతాడు. ‘‘మిస్‌ ప్రియా! మీరు స్వతంత్ర భావాలున్న వారు కదా. మీకు అబార్షన్‌ చేసే సమయంలో ఈ ఆపరేషనంతా మేము అల్ట్రాసౌండ్‌ వీడియోతో రికార్డు చేస్తే మీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను. అందులో మీ శరీరం వెలుపలి భాగాలేవీ కనబడవు. ఆపరేషన్‌ మీకు జరుగుతోందని ఎవరికీ తెలీదు. గర్భం లోపలి భాగాన్ని మాత్రమే వీడియో తీస్తాం’’ అంటాడు.
తనకేం అభ్యంతరం లేదంటుంది. వీడియో తీస్తారు.
ప్రియను వార్డుకు మార్చాక డాక్టర్లు, కొందరు సిస్టర్లు ఓ గదిలో కూచుని దాన్ని చూస్తుంటారు.
‘‘వీడియోలో శిశువు అన్ని అవయవాలు తయారైన పిల్లవాడిలా కనిపిస్తున్నాడు. చేతులు, కాళ్లు ఆడిస్తున్నాడు. కళ్లు మాత్రం మూసుకుని ఉన్నాయి. పెదవులు కదుల్తున్నాయి. శరీరం కదులుతూనే ఉంది. గర్భంలోకి పంపిన పరికరం దగ్గరకి రాగానే శిశువు ఉలిక్కిపడి, కాళ్లూచేతులూ ముడుచుకున్నాడు. దాన్నించి తప్పించుకోవడానికి ఇటూ అటూ కదలసాగాడు. పరికరం మొన చేతి దగ్గరగా వచ్చేసరికి తన బుల్లి చేత్తో దాన్ని పట్టుకున్నాడు. పరికరం వాడి జబ్బమీద బిగుసుకునే సరికి…’’.

ఈ వాక్యాలు చదువుతుంటే మన శరీరభాగాలు ఒక్కొక్కటే తెగిపడుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది.
అబార్షన్‌ చేసిన సర్జన్‌ కీచుగొంతుతో ‘‘ప్లీజ్‌ స్టాప్‌ ఇట్‌! ఇట్స్‌ హారిబుల్‌ టు వాచ్‌’’ అని వెర్రికేక పెట్టి గబగబా బాత్రూంలోకి వెళ్లిపోతుంది.
తేరుకున్నాక ‘‘ఇంక నేను నా జీవితంలో అబార్షన్‌ చెయ్యలేను’’ అంటుంది. ‘‘ఆ పిల్లకి ఈ వీడియోని కాపీ తీసి తప్పకుండా పంపించే ఏర్పాటు చెయ్యండి’’ అని కూడా అంటుంది.
కథ చదవడం పూర్తయ్యాక పాఠకుడు కోలుకోటానికి కచ్చితంగా సమయం పడుతుంది.
ఇదో అద్భుతమైన కథ. అంతకన్నా ఇంకేం చెప్పలేం.
భోపాల్‌లో గ్యాస్‌ లీకై సంభవించిన పెనువిపత్తు… ప్రజల మెదళ్లలోంచి అంత తేలిగ్గా చెరిగిపోని విషజ్ఞాపకం. రమేష్‌ ఉపాధ్యాయ్‌ రాసిన హిందీ కథ ‘‘ట్రాజడీ… మై ఫుట్‌!’’లో ఆ దుర్ఘటన వెనక దాగిన కుట్రల్ని ఒక్కొక్కటిగా లీక్‌ చేస్తారు.
భోపాల్‌కు చెందిన నూర్‌ భోపాలీ మంచి కవి. గజల్స్‌ అద్భుతంగా రాస్తాడు. 1984లో యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి వేలమంది బలయ్యారు. ఇంకొన్ని వేలమంది అంగవైకల్యం బారిన పడ్డారు. ఈ ఘోర విషాదానికి అక్కడికి దగ్గర్లోనే నివాసముండే నూర్‌ కుటుంబం బలైపోతుంది. ఏదో పని మీద వెళ్లిన అతను మాత్రం బతికిపోతాడు. కానీ కవిగా చనిపోతాడు. మతి భ్రమించి, కొన్నాళ్లపాటు సమాజంతో సంబంధాలు కోల్పోతాడు.
15 ఏళ్ల తర్వాత కథకుడు నూర్‌ను కలుస్తాడు, విజయ్‌ అనే సూడో రచయిత సాయంతో. అప్పుడు నూర్‌ గొంతు విప్పుతాడు. అందమైన పదాల పొందికతో ‘భోపాల్‌ గ్యాస్‌ ట్రాజడీ’గా నామకరణం చేసుకున్న (చేయబడిన) ఆ దుర్ఘటన వెనక దాగిన కుట్రలను వివరిస్తాడు. ఒకటిన్నర దశాబ్దం పాటు ఆ విషాదం తాలూకు వివరాలు సేకరించిన నూర్‌… ప్రమాద పరిణామాలను, నిశ్శబ్ద కుట్రలను ఒక్కొక్కటిగా బయట పెడుతుంటే పాఠకుడు కూడా కార్బైడ్‌ గ్యాస్‌ గాలంలో చిక్కి విలవిలలాడతాడు. ఎప్పటికైనా ‘‘క్రిమి సంహారిణి’’ పేరిట ఓ నవల రాయాలని నూర్‌ తాపత్రయం. తాను కవిని కాబట్టి, కథ ఎలా అల్లాలో అర్థం కావడం లేదని చెబుతాడు. నిజానికి తన కుటుంబ విధ్వంసానికి మించిన కథ వేరే అక్కర్లేదని రచయిత అంతర్లీనంగా మనకు బోధిస్తాడు.

కథ అత్యంత సరళంగా సాగుతుంది. అనివార్యంగా సైన్సు సంగతులు ప్రస్తావించినప్పుడు ఎక్కడా అది పాఠకుడికి బోర్‌ అనిపించకుండా, ఆసక్తికరంగా కథ నడిపారు. ‘‘ప్రపంచంలో ఇటువంటి హత్యాకాండలు జరగటం ఆగిపోయే వరకూ మనం గాయాలని కెలుక్కోక తప్పదు’’ అని నూర్‌తో పలికించడం ద్వారా కథాప్రారంభంలోనే దాని లోతులను మనకు పరిచయం చేస్తాడు రచయిత.
‘‘ఒక విదేశీ కంపెనీ మన దేశంలో కార్ఖానా తెరిచి, దానివల్ల జనం చచ్చిపోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న కాలనీలో దాన్ని పెడితే, దాన్నేమనాలి? హత్య అనరా?’’ నూర్‌ ద్వారా రచయిత చెప్పించిన నిజాలు మన మనసుకు లోతైన గాయాలు చేస్తాయి. అమెరికన్‌ కంపెనీ తన దేశంలోనే ఆ కార్ఖానా ప్రారంభిస్తే బోలెడు నియమనిబంధనలు. ఖర్చెక్కువ. అదే వెనకబడిన దేశాల్లోనైతే తక్కువ ఖర్చుÑ డొల్ల నిబంధనల ఆసరా. కాబట్టే ప్రమాద ఘంటికలు మోగించాల్సిన అలారం నాలుగేళ్లుగా పని చేయకపోయినా మనవాళ్లు పట్టించుకోలేదు.
‘‘భోపాల్‌లో గ్యాసు లీకవడం హఠాత్తుగా జరిగిన సంఘటన కాదు’’ అని కథ ద్వారా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పడంలో రచయిత ఏమాత్రం సంకోచించలేదు.
కథ చదవడం పూర్తయ్యేసరికి మనకి ఊపిరాడదు. అలవికాని నిర్లక్ష్యం పట్ల వల్లమాలిన కోపం పెల్లుబుకుతుంది. ‘వాస్తవ విషాదానికి అక్షరరూపం కల్పించడం ఎలా’ అనే దానికి ఈ కథ ఒక ఐకాన్‌.
తల్విందర్‌ సింగ్‌ రాసిన పంజాబీ కథ ‘‘యాక్సిడెంట్‌’’ అనేకాంశాలను లోతుగా చర్చిస్తుంది. విభిన్న వస్తువును అంతే గొప్పగా డీల్‌ చేశారు. సైకాలజీలో పాఠాలు చెప్పే ఆమె… తన భర్త ప్రకాశ్‌తో కలిసే ఉంటున్నా మనసుల మధ్య దూరం విస్తరిస్తుంది. ఏదో అసంతృప్తి. భర్తకు జాండిస్‌ వచ్చినప్పుడు ఆసుపత్రిలో పరిచయమవుతాడు డాక్టర్‌ వశిష్ట్‌. ఆమె మనసు మూలలో ఉన్న ఖాళీజాగా వైపు ఒక్కో అడుగే వేస్తాడు. ఆమెతోపాటు భర్తకూ, ఆమె కొడుకు రవికీ దగ్గరవుతాడు.
ఆమె వశిష్ట్‌కి మరింత దగ్గరవుతుంది. ‘‘ఎప్పుడూ ప్రకాశ్‌ స్పర్శనే నా జీవితానికి పరమావధిగా భావించాను. ఆ స్పర్శలో ఎటువంటి ఉద్రేకమూ కలగకపోయినా’’ అంటూ ఆమె మానసిక స్థితిని విశ్లేషిస్తాడు రచయిత.
వశిష్ట్‌ని కలిసి వచ్చేసరికి కొడుకు రవి స్కూలు నుంచి వచ్చి తల్లి కోసం ఎదురు చూస్తుంటాడు.
‘‘కాలేజీలో మీటింగ్‌ అటెండ్‌ అవ్వాల్సివచ్చిందిరా’’ అని మొదటిసారి అబద్ధమాడుతుంది.
వశిష్ట్‌తో రెస్టారెంటుకెళ్లి… కొలీగ్‌ ఇంటికెళ్లానని చెబుతుంది ప్రకాశ్‌తో.
మరోవైపు వశిష్ట్‌ ఏకంగా ఆమె ఇంటికే రాకపోకలు సాగిస్తుంటాడు. ఎనిమిదో తరగతిలో రవి మంచి మార్కులతో పాసయ్యాడని తండ్రి బైక్‌ కొనిపెడతాడు.
ఓరోజు తన తల్లి వశిష్ట్‌తో దగ్గరగా ఉండటం గమనించిన రవి అదే విషయమై ప్రశ్నిస్తాడు. ఆమె ఏదో సర్దిచెబుతుంది.
క్రికెట్‌ ఆడటానికి వెళ్లిన రవికి యాక్సిడెంట్‌ అవుతుంది. వీల్‌చెయిర్‌ సాయంతో ఇంట్లో తిరుగుతుంటాడు. తెలివైన ఆ కుర్రాడు వశిష్ట్‌తో సంబంధం గురించి ఆమె సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తుంటాడు. ఆమె అపరాధిలా నిలబడుతుంది. ఆ నిప్పురవ్వను వెంటనే ఆర్పేయాలనుకుంటుంది. కానీ, అతను ఇంటికి రాగానే మళ్లీ కరిగిపోతుంది అతని కౌగిట్లో. వీల్‌చెయిర్‌లో కూచుని ఆ దృశ్యం రవి చూసి, కోపంతో ఊగిపోతాడు. పెద్ద ఘర్షణ జరుగుతుంది. అదుపు తప్పిన వీల్‌చెయిర్‌ మెట్లమీంచి కిందికి పల్టీలు కొట్టడంతో రవి చనిపోతాడు.
అక్కడ మొదలవుతుంది కథ. ముక్కలైన ఆమె మనసులో దుఃఖాగ్నిలోని జ్వాలల్ని ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ రచయిత కథ నడిపిన తీరు అపురూపం. మానవసంబంధాల్లో అర్థం కాకుండా మిగిలిపోయే అనేక ఘట్టాలకు ఈ కథ విపుల వేదిక.
‘యాక్సిడెంట్‌’లోని కథానాయికకు భిన్నమైన పార్శ్వంలో దర్శనమిస్తుంది బి.చంద్రిక రాసిన మలయాళీ కథ ‘‘జ్యోతి విశ్వనాథ్‌’’లోని జ్యోతి. ఆరున్నొక్క శ్రుతిలో వ్యంగ్యస్వరంతో గానం చేసిన గొప్ప కథ ఇది. ప్రారంభమే చిత్రంగా ఉంటుంది. తన కొడుకును సంప్రదాయ విధానంలోనే చదివిస్తానన్న అగ్నిహోత్రావధాని నిర్ణయంపై ఆయన భార్య వెంకమ్మ భగ్గుమనడం, గిరీశం ప్రస్తావన, గురజాడ`పెట్టుబడిదారీ వ్యవస్థ` భూస్వామ్య వ్యవస్థలపై చర్చను గమనిస్తే… శాంతసుందరి ఈ కథను మూలకథ కన్నా దృఢంగా నిర్మించినట్లు కనిపిస్తుంది.
‘‘ఇందిరానగర్‌లో ఆడవాళ్లకి జ్యోతి అంటే గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే స్త్రీల హక్కులూ, సమానత్వం కోసం వాళ్లు చేసే పోరాటంలో జ్యోతి ఏమాత్రం ఆసక్తి కనబరిచేది కాదు’’… జ్యోతిని ఇలా పరిచయం చేస్తారు. ఆనక మెల్లగా ఆడవారి హక్కుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యధోరణిలో ఉతికి ఆరేస్తారు. ‘జ్యోతి అందరిలాంటి సామాన్యురాలైన భార్య’ కాదని చెబుతూ… రాయవలసిన సిద్ధాంత వ్యాసాల అవసరార్థం రాజీ పడే వైనాన్ని అరుదైన రీతిలో ఆవిష్కరించారు. ముగింపు మరింత చమత్కారం.
మాయా ఠాకూరీ నేపాలీ కథ ‘‘అవతలి గట్టు’’. మూడేళ్ల తర్వాత అతను ఊరికి బయల్దేరాడు. ఈశాన్య భారతంలోని తన స్వగ్రామానికి చేరుకోవడానికి పగలంతా నడకే శరణ్యం. భార్య నెల తప్పింది. ఆమె మాట మేరకే గ్రామ పర్యటన. అక్కడ తల్లి, ఆమెకు అండగా ఓ పనిమనిషి. ‘కొడుకొస్తాడు, వెంట తీసుకెళ్తాడు, సేవ చేయొచ్చనీÑ మనవడు పుట్టాక వాడితో ముద్దుమురిపాలు పంచుకోవాలనీ’ కళ్లు కాయలు కాచేలా చూస్తుంటుంది తల్లి.
కోడలికి తీసుకెళ్లడానికి నెయ్యి, బియ్యం, మసాలాలు సిద్ధం చేస్తుంది.
కానీ, కోడలి స్వరం వేరు. ముక్కుతూ మూలుగుతూ, ప్రతి దానికీ సతాయించే అత్తను తీసుకురావద్దని మొగుడికి గట్టిగా చెప్పి పంపిస్తుంది. బదులుగా భగరనీ (పనిమనిషి)ని మాత్రం తప్పనిసరిగా తీసుకురమ్మంటుంది.
కొడుకా విషయం చెప్పగానే తల్లి తల్లడిల్లుతుంది. భగరనీ కూడా బాధ పడుతుంది… పెద్దరికం మీద పడ్డ తన యజమానురాలి(అతని తల్లి)ని ఎవరు చూసుకుంటారా అని!
పనిమనిషికున్న పట్టింపు కూడా పుత్రుడికి లేకపోవడాన్ని నేపాలీ కథ ‘‘అవతలి గట్టు’’ ఆర్ద్రంగా ఆవిష్కరిస్తుంది. బస్సు దిగి నడుస్తున్న దారిలో కలిసిన ఓ పెద్దాయనతో చెప్పిన కబుర్ల ద్వారానే ఈ పరిస్థితుల్ని విశ్లేషించడం రచయిత వ్యూహాత్మక చతురతకు నిదర్శనం.
డాక్టర్‌ శ్యామ్‌ సఖా ‘‘శ్యామ్‌’’ రాసిన హిందీ కథ ‘‘ఎన్‌కౌంటర్‌’’.
రోజూ ఫోన్‌ మోగుతుంది. ఆమె ఎత్తుతుంది. అట్నుంచీ మౌనం.
అతనెత్తితే మాత్రం పొడిపొడిగా ఒకటో రెండో మాటలు.
నెలల తరబడి ఈ ఫోను తంతు నడుస్తుంది. అట్నుంచి ఎవరు మాట్లాడుతున్నారో తెలియని స్థితిని కథలో ఉత్కంఠభరితంగా ఆవిష్కరిస్తారు రచయిత.
ఆఖరికి ఆ ఆగంతక మహిళ సూచన మేరకు అతను ఢల్లీి వెళతాడు. ఉద్విగ్న క్షణాల అనంతరం ఆమె ఎదురు పడుతుంది. స్కూల్లోనూ, కాలేజీలోనూ ఆమె తన గర్ల్‌ఫ్రెండ్‌!
ఇద్దరూ తమ ‘‘అప్పు’’ తీర్చుకోవడానికి సిద్ధమవుతారు.
ఏమిటా అప్పు? ఎందుకా అప్పు?
తెలియాలంటే, ఈ కథలోని నాలుగు పదాల చివరి వాక్యం చదివి తీరాల్సిందే.
పూరన్‌ హోర్డీ రాసిన హిందీ కథ ‘‘ముంపు’’.
ఇద్దరు మిత్రులు పడవ తయారు చేసుకుని బయల్దేరతారు. మట్టిరంగు నీళ్లపై భారంగా ప్రయాణిస్తూ ఏవేవో జ్ఞాపకాల అలల మీద కిందుమీద అవుతుంటారు. బాల్యం, ఆటలు, పాటలు, గొడవలు, అల్లరి, తల్లిదండ్రులు, కష్టాలు, పేదరికం… ఇళ్లు, వాటి నీడలు, గోడలు, గోడల మధ్య ఇక్కట్లతో సావాసం చేస్తూనే హాయిగా గడిపిన రోజులు… అన్నీ గుర్తు చేసుకుంటూ సాగుతారు. అదంతా ఎందుకో ఓ పట్టాన అర్థం కాదు. ప్రయాణం సాగుతున్న కొద్దీ కొద్దికొద్దిగా అర్థమవుతుంది… ఒకప్పుడు అక్కడో గ్రామం ఉండేదనీ, ఆనకట్ట నిర్మాణంలో భాగంగా అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారని!
ఈ కథలో రచయిత పాటించిన టెక్నిక్‌ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ కాస్త కాన్వాసు మీదే ఒక గ్రామచిత్రాన్ని విభిన్న ఛాయలతో చిత్రిస్తారు. మనుషుల మధ్య అంతరాలను విశ్లేషిస్తారు. పెత్తందారీతనాన్ని ఎండగడతారు. మూఢనమ్మకాల గురించి ప్రస్తావిస్తారు. అన్యాయమూర్తుల అరాచకాన్ని గుర్తు చేస్తారు.
జి.తిలకవతి రాసిన తమిళ కథ ‘‘నాగలక్ష్మి’’ ఓ పేదయువతి కలలకు ప్రతిరూపం.
‘‘పొద్దునెప్పుడో ఉప్పురాయి వేసిన గంజి తాగి, మధ్యాహ్నం నాలుగు ముద్దల చద్దన్నం తిని’’ బెత్తెడు తోక జీతంతో జీవనం సాగిస్తున్న యువతి నాగలక్ష్మి. ‘‘మెల్లకన్ను, ముందుకు పొడుచుకొచ్చిన పళ్ల’’తో వికారంగా ఉండే నాగును ఆకర్షణీయంగా ఉండే ఆరుముగం ప్రేమిస్తాడు. తను కూడా ఆశ పడుతుంది. కానీ, మహిళా కార్మికుల పట్ల మేనేజర్‌ క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఆరుముగం మౌనం వహిస్తాడు. దాంతో నాగు నిలువెల్లా ఊగిపోయి, అతగాణ్ని ఛీ కొడుతుంది.
ఉదాసీనతను మించిన చేతగానితనం లేదని కళాత్మకంగా రచయిత చెప్పిన తీరు ప్రశంసనీయం.
వర్షా అడాలజ రాసిన గుజరాతీ కథ ‘‘హల్వా’’ నాగలక్ష్మి కథకు కొనసాగింపులా కనిపిస్తుంది.
పేదరికాన్ని పెనవేసుకుని పుట్టిన అభాగ్యురాలు ‘కుసుమ్‌’. తల్లి పురిటినొప్పులు పడుతుంటే, తనకేమీ పట్టనట్లు, ముగ్గురు అమ్మాయిల తర్వాతైనా అబ్బాయి పుట్టాలని మద్యం సేవిస్తూ హనుమాన్‌ చాలీసా వల్లించే తండ్రి! ఆమెను ప్రసవిస్తూ కన్ను మూసిన తల్లి! ఆ గాయాలకు ఏకైక మలాము పెద్దక్క. తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో, అక్క నీడలోనే కుసుమ్‌ పెరుగుతుంది. పిన్ని తరచూ తయారు చేసుకునే హల్వా వాసన ఆ యువతి మనసులో వరదలెత్తుతుంది. కానీ దాన్ని రుచి చూసే భాగ్యం లేదు.
కుసుమ్‌కు పెళ్లయి, భర్త ఇంట్లో అడుగు పెట్టిన క్షణాన తనకంటూ ఓ ఇల్లు సమకూరిందని సంతోషంతో పొంగిపోతుంది. అంతలోనే భర్త క్రూరత్వం బహిర్గతమై తను(వు) మళ్లీ గాయాలమూట అవుతుంది. ‘‘అతనలా మీద పడ్డప్పుడు ఆమెకి రాబందులు మాంసం పీక్కుతిన్నట్టనిపిస్తుంది’’ ఆమెకు. అంత మునుగీతలోనూ భర్త ఎటో వెళ్లిన సంతోష సమయాన తన జీవితకాల వాంఛ అయిన హల్వా వండుకోవడం మొదలు పెడుతుంది. పిడుగులా ఊడిపడిన భర్త పిడిగుద్దులు కురిపిస్తాడు. ఆమె సహనం బాంబులా బద్దలవుతుంది. సివంగిలా తిరగబడుతుంది. పచ్చడిబండతో మొగుడి తల బద్దలు కొడుతుంది. ఆనక తాపీగా మళ్లీ ‘‘ఎంతో తన్మయత్వంతో హల్వా చెయ్యడం మొదలు పెడుతుంది’’.
ఈ చివరి వాక్యం కథను ఆకాశమెత్తుకు తీసుకెళుతుంది.
రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన బెంగాలీ కథ ‘‘పనివాళ్ల స్వర్గం’’ లోతైన కథ. అప్పట్లోనే అంత అద్భుతమైన టెక్నిక్‌ వాడటం విశేషం. తరస్నుమ్‌ రియాజ్‌ ఉర్దూ కథ ‘‘మహానగరం’’ ఓ విషాదగాథ.
మనోహర్‌సింగ్‌ రాథోర్‌ రాసిన రాజస్థానీ కథ ‘‘ఓడమీది ఒంటరి పక్షి’’, ప్రదీప్‌ బిహారీ రాసిన మైథిలి కథ ‘‘శరణాగతులు’’, తరుణ్‌ కాంతి మిశ్రా ఒరియా కథ ‘‘అవరోహణ’’, విజయ్‌ హిందీ కథ ‘‘అతనెవరో’’ … దేనినీ తక్కువ చేసి చూడలేం.
ఇతర భాషల కథలని తెలియనంత బాగా అనువాదం సాగింది. వాక్యాలు తెలుగుదనాన్ని గుబాళిస్తాయి. మన పరిసరాలనే గుర్తు తెస్తాయి. మన చుట్టూ ఉన్న మనుషులనే ప్రతిఫలిస్తాయి.
‘‘ముసలితనం అతని ముఖం నిండా ముడతలు నింపింది. తెల్లగా నెరిసిపోయిన పొడుగాటి జుట్టు, కనుబొమలు, అతని మొహంలో ఏదో విచిత్రమైన కాంతి… బహుశా అతనిలోని మనోబలం వల్లా, స్ఫూర్తి వల్లా కావచ్చు’’. (నేపాలీ కథ ‘అవతలి గట్టు’)
‘‘అబద్ధాలు చెప్పేవాళ్లంటేనే చీదరించుకునే నాకు, నేను చెప్పే అబద్ధాలు చాలా అందంగా కనబడసాగాయి’’ (పంజాబీ కథ ‘యాక్సిడెంట్‌’)
‘‘ప్రపంచంలో ఇటువంటి హత్యాకాండలు జరగటం ఆగిపోయేవరకూ మనం గాయాలని కెలుక్కోక తప్పదు!’’ (ట్రాజెడీ… మై ఫుట్‌!)
‘‘కుసుమ్‌ అంటే పూవు. కానీ కుసుమ్‌ పుట్టిన ఇంట్లో సువాసనలు వెదజల్లలేదు. ఆ పిల్ల కూడా పూవులా నవ్వలేదు’’ (హల్వా)
‘‘స్వర్గంలోని ఆ సోమరిపోతు సరస్సు పక్కనే చెట్టులా పాతుకుపోయి నిలబడేవాడు’’ (పనివాళ్ల స్వర్గం)
వంటి వర్ణనలు అచ్చంగా మన కథలేనన్న భ్రాంతి కలిగిస్తాయి.
అయితే, తెలుగు కథలతో పోల్చినప్పుడు ఈ కథల్లోని సంభాషణల్లో కొద్దిగా సాగతీత కనిపిస్తుంది. అనువాదంలో ఆ లోపాన్ని చాలావరకు సరిదిద్దారు రచయిత్రి.
ఆయా ప్రాంతాల వారి ఆహారపు టలవాట్లు, ఆహార్యం తీరు, అనుబంధాల తెన్ను, శ్రమజీవన శైలి, సంసారపు టగాథాలు, కపట ప్రేమలు, కలుషిత స్నేహాలు, న్యాయం కోసం ఆరాటం, కార్మికుల పోరాటం… ఇలా అనేకాంశాలు ఈ కథల గుండా పోటెత్తుతాయి.
వివిధ పార్శ్వాలలో విభిన్న కథాంశాలను సరళసుందరంగా ఆవిష్కరించిన శాంతసుందరి గారికి ప్రణామాలు.

ఎమ్వీ రామిరెడ్డి
ఎమ్వీ రామిరెడ్డి

ఎం వి రామిరెడ్డి జర్నలిస్టు, రచయిత, సంఘసేవకుడు. ముప్ఫయ్యేళ్లుగా కథలు రాస్తున్నారు. రామ్‌కీ ఫౌండేషన్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి పేరిట మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా.. పెదపరిమిలో వృద్ధాలయం నిర్వహిస్తున్నారు.

Previous Post

వ్యాసం : కథల కొలనులో విహారం

Next Post

హిందీ కవిత : సీత

Next Post
హిందీ కవిత : సీత

హిందీ కవిత : సీత

Discussion about this post

ఈ సంచికలో…

  • Bitcoin Online Casinos: An Overview to Online Gambling with Cryptocurrency
  • Dime Slots totally free: A Comprehensive Guide
  • Kann Plinko Ihr neues Lieblingsspiel im Casino werden
  • Whatever You Need to Know About Free Rotates in Online Betting
  • Беттинг на спортивные события в виртуальном казино
  • Даровая игровая сессия в интернет-казино без регистрации: опции и лимиты.
  • Better 8 casino Prospect Hall casino Local casino Greeting Incentives 2025 $6000 Match & No deposit
  • Online Gambling Establishments that Accept Neteller: A Guide for Gamblers
  • How to Find the most effective Bitcoin Casino Promotions
  • Greatest 2025 Joycasino no deposit bonus 2025 Baccarat Casinos on the internet
  • Beste angeschlossen bruce bet Bewertungen Deutschland Casinos qua schneller Ausschüttung: 2025 fix
  • Заголовок статьи
  • Заголовок статьи
  • Заголовок статьи
  • Enjoy Poker On the internet for real Club Player casino bonuses Currency Finest Poker Internet sites in the 2025
  • Multihand Black-jack by the Practical Play casino 777 casino instant play Demo Enjoy Totally free Gambling establishment Online game
  • Better On the web Black-jack Web sites All of us Play Blackjack casino paddypower sign up Online
  • On line Black-jack: Free Play, Regulations & deposit bonus new member 200 Real money Web sites to possess 2025

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • Uncategorized
    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com