ఆంగ్ల మూలం : సుధా మూర్తి “How I taught my grandmother to read”
తెలుగు అనువాదం: ఆకొండి (ముద్దు)వెంకటలక్ష్మి
చాలా ఏళ్ళ క్రితం నా బాల్యజీవితంలో జరిగిన ఆ అపూర్వ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. పదే పదే తల్చుకుంటూ ఉంటాను.
అప్పుడు నేను పన్నెండేళ్ళ అమ్మాయిని.మా అమ్మమ్మ గారింట్లో ఉండి చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ కాలంలో ఊళ్ళ మధ్య ప్రయాణ సదుపాయాలు ఎక్కువగా ఉండేవి కావు. అందుకే ఉదయాన్నే రావలసిన దినపత్రిక మధ్యాహ్నం, వారపత్రికయితే మర్నాడు , ఉత్తరాలు మరీ ఆలస్యంగానూ చేరేవి. ప్రతిరోజూ వాటిని మోసుకొచ్చే బస్సు కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవారు.
ఆరోజుల్లో కన్నడ భాషలో త్రివేణి అనే రచయిత్రి బాగా ప్రఖ్యాతి పొందారు. అద్భుతంగా వ్రాసేవారు. ఆమె కథాకథనశైలి ఆసక్తికరంగా, సహజసుందరంగా ఉండి సామాన్య పాఠకులను బాగా ఆకట్టుకునేది. ఆమె రచనలు మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే ఆర్ధిక, సామాజిక, మానసిక సమస్యలను చర్చించడమే కాకుండా మంచి పరిష్కారాలు కూడా సూచిస్తాయి. అంత గొప్ప రచయిత్రి చిన్న వయసులోనే మరణించడం కన్నడ సాహిత్య దురదృష్టం. ఆమె స్వర్గస్తురాలై నలభై ఏళ్ళు దాటినా ఇంకా ఆమె రచనలను పాఠకులాదరిస్తున్నారు.
త్రివేణి గారి రచనల్లో కెల్లా ‘కాశీయాత్ర’ అనే నవల ప్రసిద్ధిని పొందింది. ఆ నవల ఆరోజుల్లో ‘కర్మవీర’ అనే వార పత్రికలో ధారావాహికగా వచ్చేది. అందులోని ప్రధాన పాత్ర ఒక వృద్ధ స్త్రీ. ఆవిడకు చాలా మంది భారతీయుల్లాగే కాశీ పుణ్యక్షేత్రం చూడాలని, అక్కడి ప్రధాన దైవం విశ్వనాథుడిని దర్శించుకుని మోక్షాన్ని పొందాలని ప్రగాఢ ఆకాంక్ష. దానికోసం డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటుంది.
అయితే అదే సమయానికి అక్కడ ఓ అనాథ బాలిక వివాహానికి డబ్బు అవసరమౌతుంది. ఆ వృద్ధ స్త్రీ సహానుభూతితో తాను కాశీయాత్ర కోసం దాచుకున్న ధనాన్ని ఇచ్చేసి సంతృప్తిని పొందుతుంది. “అవసరంలో ఉన్న అమ్మాయిని ఆదుకోడం కంటే విశ్వనాథుని దర్శనం ముఖ్యం కాదంటుంది.
ఉత్కంఠతాభరితమైన ఈ కన్నడ నవల ప్రతి బుధవారం ‘కర్మవీర’ పత్రికలో వచ్ఛేది. ఆరోజున నేను స్కూలు నుంచి రాగానే మా అమ్మమ్మ క్రిష్టక్కకు ఆ భాగం చదివి వినిపించేదాన్ని. ఇంటిపనుల్లో ఎంతగా తలమునకలుగా ఉన్నా ఆ పాత్రలో లీనమై ఎంతో ఏకాగ్రతతో వినేది. ఎందుకంటే, ఆమెకు కూడా కాశీ యాత్ర ఒక తీరని కోరికగా ఉండిపోయింది. నవలలోని ఆ భాగం చదివాక ఆ సాయంత్రం గుడిలోని తన స్నేహితురాండ్రకి ఆ విశేషాలన్నీ చెప్తూ ఉండేది, పిల్లలం గుడిలో దాగుడుమూతలాడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళందరూ ఆ నవలను అంతగా ఎందుకు ఇష్టపడేవారో మాకు తెలిసేది కాదు.
సరే, కాలం అలా గడుస్తూ ఉండగా.. ఓ సాయంత్రం నేను పిన్ని కూతుళ్ళతో కలిసి ప్రక్క ఊళ్ళోని ఓ పెళ్ళి చూడ్డానికి వెళ్ళేను. ఏభై సంవత్సరాల క్రితం పెళ్ళంటే నాలుగైదు రోజుల వేడుక. మా పిల్లమేళానికైతే ఆటవిడుపే. పెద్దవాళ్ళు పనుల్లో మునిగి ఉండేవారు. పిల్లలమంతా హాయిగా పిండి వంటకాలు తింటూ, ఆటలాడుకుంటూ గడిపేవాళ్ళం. సమయం ఎంత తొందరగా నడిచిందో! రెండు రోజుల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్నదాన్ని వారం తర్వాత వచ్చాను.
వచ్చేటప్పటికి కళ్ళ నిండా కన్నీళ్ళతో అమ్మమ్మ కనిపించింది, చాలా ఆశ్చర్యం వేసింది, ఏడుపొచ్చింది, ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది, అయినా ఎప్పుడూ ఆవిడ కంటతడి చూడలేదు, తను ధైర్యంగా ఉండి, అందరికీ ధైర్యం చెప్పేది. ” ఏమైందవ్వా? అంతా కులాసాయేనా? ” ఆదుర్దాగా అడిగాను, అంతా బాగున్నారన్నట్లుగా తల ఊపింది, అయినా ముఖంలోని దిగులు అలాగే ఉంది. రాత్రి భోజనాలయేక, ఎప్పటిలాగే పడకల కోసం డాబా ఎక్కేం, వేసవిలో నిండు పున్నమి చందమామ చల్లటి వెన్నెలను ప్రసరిస్తున్నాడు.
అమ్మమ్మ మెల్లగా నా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా నా నుదుటిని తాకింది, నాకు అర్థమైంది, ఆవిడను అమితంగా అభిమానించే నాతో ఏదో చెప్పాలనుకుంటోంది. “ఏంటి సంగతి అవ్వా?” అన్నాను.
ఆవిడ గద్గద స్వరంతో చెప్పడం మొదలుపెట్టింది- “మా అమ్మ నా చిన్నప్పుడే కాలం చేసింది, నాన్న వ్యాపారంలో బిజీ మనిషి, రెండో పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ నా ఆలనాపాలనా పెద్దగా పట్టించుకోలేదు. ఆరోజుల్లో ఆడపిల్లను చదివించాలి అని అనుకునేవారు కాదు. బాల్యంలోనే నా పెళ్ళయిపోయింది. పిల్లలు, మనుమలు… ఇలా సంసార బాధ్యతల్లోనే జీవితం గడిచిపోతూ ఉంది. నేను చదువుకోలేకపోయేననే బాధ ఉండేది. పోన్లే, పిల్లలూ, మనుమలూ బాగా పైకొస్తే చాలు అనుకునేదాన్ని.. “అమ్మమ్మ వెక్కిళ్ల మధ్య చెప్పింది. చిన్న పిల్లని, నాతో ఇదంతా ఎందుకు చెప్తోందో అర్థం కాలేదు. అయినా, “ఏంటవ్వా? ఏంటి సంగతి? నేనేమైనా సాయం చెయ్యనా?” అనడిగేను.
దానికి ఆమె వెంటనే దృఢ స్వరంతో అంది “అవును, నీ సాయం తప్పకుండా కావాలి, నువ్వు లేనప్పుడు ‘కర్మవీర’ పత్రిక వచ్చింది. ఆతృతగా ఆ కథ కోసం చూసేను. చదువురానిదాన్ని, కేవలం ఆ కథలోని బొమ్మలను చూడడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. ఒక్కసారిగా నిస్సహాయత కమ్ముకున్నట్టు అనిపించింది. చదువుకుంటే ఎంత బాగుండేది అనుకున్నాను. నువ్వు తొందరగా వస్తే బాగుండును అనుకున్నాను. అసలు నువ్వు వెళ్ళిన ఊరికి వచ్చేసి నీచేత ఆ కథ చదివించేసుకుందామా అనిపించేసింది కూడా. ఇక్కడే ఎవరినైనా అడగొచ్చు. కానీ నీ దగ్గర ఉన్న చనువు వాళ్ళ దగ్గర ఉండదు కదా. చదువుకుంటే స్వేచ్ఛగా కావలసినవి చదువుకోవచ్చు, మేము ఎంతో డబ్బున్నవాళ్ళం, ఏం లాభం? ఒకరిమీద ఆధారపడకుండా ఉండగలిగే స్వతంత్రం లేనప్పుడు?” అంది. ఏం చెప్పాలో తెలియలేదు. ఆమే కొనసాగించింది. “నేను నిర్ణయం తీసుకున్నాను. నీ దగ్గర కన్నడం చదవడం, వ్రాయడం నేర్చుకుంటాను. చాలా కష్టపడతాను. వచ్చే దసరా నవరాత్రుల్లో సరస్వతీ పూజ నాటికి ఆ నవలను నేను స్వయంగా, స్వేచ్ఛగా చదవగలగాలి. నేను స్వతంత్రురాలిగా ఉందామనుకుంటున్నాను.”
ఆమె ముఖం లోని నిశ్చలత్వం చూసి నాకు నవ్వొచ్చింది, “ఈ అరవై రెండేళ్ల వయసులో చదువుకుంటావా? నీ జుత్తంతా పండిపోయింది, చేతుల మీద ముడతలు, కళ్ళకి కళ్ళజోడు, పైగా వంటింట్లో బోల్డు పని చేస్తావు..” చిన్నతనంతో ఆమెను పరిహసించాను కానీ ఆమె చిరునవ్వు నవ్వుతూ అంది “ఒక మంచిపనికి సిద్ధమైనప్పుడు ఎన్ని ఆటంకాలెదురైనా ఆగకూడదు, ఇంట్లో అందరి కంటే ఎక్కువ పని చేస్తాను. అయినా ఫరవాలేదు. నేను బాగా శ్రమపడి చదువుకుంటాను. చదువుకోడానికి వయసుతో సంబంధం లేదు.”
మర్నాటి నుంచే అమ్మమ్మకు నా ట్యూషన్ మొదలైంది. అవ్వ నిజంగా అద్భుతమైన విద్యార్థిని. చదువులో నేనిచ్చిన ప్రతీ పనినీ బాగా శ్రమించి చేసేది. చదవడం, కంఠస్థం చెయ్యడం, అప్పచెప్పడం, నోటితో వల్లిస్తూ వ్రాయడం, పదే పదే నేర్చుకోవడం – ఇవన్నీ ఎంతో శ్రద్ధగా చేసేది. ఆవిడకున్న ఒకే ఒక ఉపాధ్యాయురాలిని నేను. నా మొట్టమొదటి విద్యార్థి ఆమె. కల్లో కూడా అనుకోలేదు నేను భవిష్యత్తులో వందల కొలదీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని!
ప్రతి ఏటా వచ్చే దసరా పండుగ రానేవచ్చింది. అప్పుడే త్రివేణి గారి కాశీయాత్ర పుస్తకం అచ్చయింది. అమ్మమ్మకు తెలియకుండా రహస్యంగా నేనావిడ కోసం ఒక పుస్తకం కొన్నాను. సరస్వతీ పూజ రోజున అమ్మమ్మ నన్ను దేముడి గదిలోకి రమ్మంది, నన్నొక బల్ల మీద కూర్చోమంది, నా చేతిలో క్రొత్త గౌను బట్ట పెట్టింది, ఆ తరువాత…ఆ తరువాత ఆమె నేనూహించని అసాధారణమైన పని ఒకటి చేసింది! వంగొని నా కాళ్ళకు నమస్కరించింది! అవాక్కయ్యాను. ఎందుకంటే, పెద్దలకు, గురువులకు అలా నమస్కరించడం మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. కానీ, అమ్మమ్మ చేసినది అందుకు పూర్తిగా విరుద్ధం. ” అయ్యయ్యో! ఏమిటి చేస్తున్నావు అవ్వా?! ” అన్నాను గట్టిగా.
అందుకామె అంది మెల్లగా, మృదువైన స్వరంతో ” నేను మనుమరాలి పాదాలకు నమస్కరించలేదు, ఒక గురువు కాళ్ళకు మ్రొక్కాను. నువ్వు ఎంత ప్రేమతో, శ్రద్ధతో, అంకితభావంతో నాకు చదువు చెప్పవంటే తక్కువ రోజుల్లోనే ఏ నవలనైనా నా అంతట నేనే చదవకలనిప్పుడు. అంతటి ఆత్మవిశ్వాసాన్ని నాలో నువ్వు కలిగించావు. ఇప్పుడు చెప్పు వయసుతో నిమిత్తం లేకుండా, ఆడ, మగ తేడా లేకుండా చదువు చెప్పిన గురువు గారిని గౌరవించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయా లేదా?!”
నిశ్శబ్దంగా నేనామెకు ప్రతి నమస్కారం చేసి, ఆమెకు బహుమతిగా తెచ్చిన ‘కాశీ యాత్ర’ నవలను ఆమె చేతిలో పెట్టాను, ఆమె గబగబా పుస్తకం పేరు, రచయిత్రి పేరు, పబ్లిషర్ పేరు స్పష్టంగా, గబగబా చదివింది, ఆమె ఆనందానికి అవధుల్లేవు!
నాకు తెలుసు, ఆమె తన చదువు పరీక్షలో అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణురాలైంది.
![]()

విశ్రాంత ఆంగ్ల అధ్యాపకురాలు, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, న్యూఢిల్లీ.
పాఠశాలలో, కళాశాలలో రచనా వ్యాసంగం మొదలుపెట్టినా, ఉద్యోగరీత్యా ఢిల్లీ లో ఉన్నప్పుడు శ్రీవారు , సహోద్యోగుల ప్రోత్సాహంతో అక్కడి తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో సభ్యత్వం తీసుకుని కవితలూ, వ్యాసాలు వ్రాసేవారు. పదవీ విరమణ తర్వాత కవితలు, సమీక్షలు, వ్యాసాలు వ్రాస్తున్నారు.
వృత్తిలో ఉత్తమ అధ్యాపకురాలు, ప్రవృత్తి రీత్యా తెలుగు వెలుగు, కలం రత్న సహస్రాధిక కవితా సమీక్షావిభూషణ, కవన కిరణం, కీర్తిరత్న మొదలైన పురస్కారాలు, బిరుదులు లభించాయి.
ప్రస్తుతం తెలుగు లో పిహెచ్ డి ప్రవేశ పరీక్ష ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణురాలై, మౌఖిక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
బెంగుళూరు లోని కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య కు ఉపాధ్యక్షురాలు, పిఠాపురం లోని పురుహూతికా లలితకళా పరిషత్తు కు సాహితీ కార్యదర్శి గా సేవలందిస్తున్నారు.
పరిచయంలో వ్రాయడం మర్చిపోయాను –
మూడు వచన కవితాసంపుటులు.. 1 కవన సవ్వడులు 2 భావనా కుసుమాలు 3 గౌతమి తరంగిణి, ఒక వ్యాస సంపుటి- వ్యాస మంజరి ప్రచురించారు.


