మూలం : రవీంద్రనాథ్ ఠాగూర్
తెలుగు : బొల్లిముంత వెంకట రమణ రావు
ప్రతిరోజూ
నా కాగితపు పడవలను
ఉరకలేసే ప్రవాహంలో వదులుతాను
వాటిపై
పెద్ద పెద్ద అక్షరాలతో
నా పేరు రాస్తాను,
నా ఊరి పేరును కూడా—
ఎవరైనా చూసినవారు
“ఇతను ఎవరు?” అని తెలుసుకోవాలని.
ఆరాటపడతారు-
మన తోటలోని చిన్న తెల్ల పూలను
జాగ్రత్తగా వాటిలో పెడతాను—
ఉదయపు పరిమళ వాసనలు
రాత్రి కూడా ఆస్వాదించాలని అనుకుంటాను.
పడవలు నెమ్మదిగా దూరమవుతుంటే
నేను ఆకాశాన్ని చూస్తాను—
మేఘాలు కూడా
తెల్లని తెరలు ఎగరేసినట్టుగా
అలా తేలుతూ ఉంటాయి.
ఆకాశంలో ఎవరైనా ఉన్నారా
నా తోడు ఆడుకునే వారు?అని అడుగుతాను.
నా పడవలతో పరిగెత్తి పోటీ పడే గాలి
అదృశ్య స్నేహితుడు?ఎవరూ
రాత్రి మౌనంగా దిగివస్తే
చేతుల్లో ముఖం దాచుకుని
నేను కలలోకి జారిపోతాను—
నక్షత్రాల కింద నీడలుగా
నా కాగితపు పడవలు
ఇంకా ముందుకు సాగుతూనే ఉంటాయి.
వాటిలో-
నిద్రలోని మృదువైన ప్రాణాలు
నిశ్శబ్దంగా కూర్చుని
కలలను నింపుకుని
దూరాలకు తీసుకెళ్తున్నాయి.

స్వేచ్ఛ
భయంలేని జీవితం —
అదే నిజమైన స్వేచ్ఛగా
నీకు ఇవ్వాలని కోరుతున్నాను.
నా మాతృభూమి.
శతాబ్దాల భారాన్ని మోసుకుంటూ
తల వంగిపోయి,
వెన్ను విరిగిపోయి,
కళ్లలో వెలుగు మసకబారిపోయి
భవిష్యత్తు పిలుపును కూడా వినలేని స్థితి నుండి —
నీకు విముక్తి కావాలి.
రాత్రి నిశ్శబ్దంలో
నిద్ర అనే గొలుసులతో
నిన్ను నీవే బంధించుకున్న
ఆ అలసత్వపు సంకెళ్ల నుంచి
నీవు బయటపడాలి.
సత్యం చూపించే నక్షత్రాల పిలుపును
అనుమానిస్తూ
నీవు నిద్రలోనే నిలిచిపోయావు —
ఆ నిద్ర నుంచి మేలుకోవాలి.
విధి అనే అంధకార గాలులకు
నీ పడవలను అప్పగించి
నిర్దిష్ట దిశ లేకుండా తేలిపోతున్న
ఆ అనిశ్చిత జీవితం నుంచి
నీవు బయటపడాలి.
చల్లని, నిర్జీవమైన చేతుల్లో
నియంత్రించబడే బొమ్మల ప్రపంచంలో
నీవు జీవిస్తున్నావు —
అక్కడ ఆలోచన లేదు,
కేవలం అలవాట్ల పునరావృతం మాత్రమే.
ఆ బొమ్మలు
యజమాని ఆదేశం కోసం
నిశ్శబ్దంగా, విధేయంగా
ఎప్పటికీ వేచి ఉంటాయి.
అలాంటి ప్రపంచం నుండి
నీకు విముక్తి కావాలి.
![]()
రవీంద్రనాథ్ ఠాగూర్ :
జననం: 7 మే 1861
రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి చెందిన మహాకవి, తత్వవేత్త, సంగీతకారుడు, చిత్రకారుడు మరియు విద్యావేత్త. ఆయన బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. ప్రపంచ సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆయన రచించిన “గీతాంజలి” కవితా సంపుటికి 1913లో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఆయనే. ఆయన రచనలు మనుషుల భావోద్వేగాలు, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అంశాలను లోతుగా ప్రతిబింబిస్తాయి.
ఠాగూర్ భారత జాతీయ గీతం “జన గణ మన” రచయిత. అలాగే బంగ్లాదేశ్ జాతీయ గీతం “అమర్ శోనార్ బాంగ్లా” కూడా ఆయనదే.
విద్యా రంగంలో కూడా ఆయన గొప్ప సేవ చేశారు. శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించి, సృజనాత్మక విద్యకు మార్గం చూపించారు.
ఆయన రచనలు కవితలు, కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు వంటి అనేక రంగాల్లో విస్తరించాయి. ఆయనను ప్రేమతో “గురుదేవ్” అని పిలుస్తారు.
మరణం: 7 ఆగస్టు 1941



Discussion about this post