“A writer reads not merely to write better, but to see the world through a thousand different eyes.”
ఒక మనిషి జీవితకాలంలో తన కళ్లతో చూడగల ప్రపంచం పరిమితమైనదే. తన అనుభవంలోకి వచ్చే మనుషులు, సంఘటనలు, పరిస్థితులూ పరిమితమైనవే. కానీ పుస్తకం అతనిని తనకు తెలియని ప్రపంచాల్లోకి తీసుకెళ్తుంది. ఎన్నడూ కలవని మనుషులను పరిచయం చేస్తుంది. తాను అనుభవించని జీవితాలను అనుభూతి చెందే అవకాశం కల్పిస్తుంది. అందుకే పఠనం ఒక సాధారణ పాఠకుడికి జ్ఞానాన్ని అందిస్తే, రచయితకు అది సృజనకు కావలసిన జీవరసాన్ని అందిస్తుంది.
అయితే రచయితకు పుస్తకాలు చదివే అలవాటు ఉండాలా?
అవును! నిస్సందేహంగా ఉండాలి.
ఎందుకంటే ఇతర అక్షర సృజనశీలురు ఎటువంటి ఇతివృత్తాలను ఎన్నుకుంటున్నారు, ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నారు, కథాకథనంలో ఎటువంటి నవ్యరీతులను పాటిస్తున్నారు, భావవ్యక్తీకరణలో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు—ఇవన్నీ తెలుసుకోవడానికి రచయిత ఇతరుల రచనలు చదవాలి.
ఈ సూత్రం అప్పటికే ఎన్నో గొప్ప రచనలు చేసి అనుభవం, పరిణతి సంపాదించిన రచయితకు ఎంతగా వర్తిస్తుందో, రచనా రంగంలో అడుగుపెడుతున్న ఔత్సాహికుడికీ అంతే వర్తిస్తుంది.
అనుభవజ్ఞులైన రచయితలు కొత్త తరంతో పోటీ పడటానికే కాదు; వారి ఆలోచనా స్రవంతిని అర్థం చేసుకోవడానికి, కాలానుగుణంగా వస్తున్న మార్పులను గమనించడానికి, అభిలషణీయమైన అంశాలను తమలో పొదవుకోవడానికి కూడా పుస్తకాలు చదవాలి. కొత్త తరం ఆలోచించే తీరు ఏమిటి? వారు జీవితాన్ని ఏ కోణంలో చూస్తున్నారు? వారి సమస్యలు ఏమిటి? వారి భాష, భావవ్యక్తీకరణ ఎలా ఉంది?—ఇవన్నీ తెలుసుకోవడానికి పఠనం అవసరం.
ఇక కొత్తవారు తాము ఎన్నుకున్న సాహితీ ప్రక్రియలో నిలదొక్కుకుని రచనలు చేసి పేరు ప్రఖ్యాతులు పొందడానికి చదవాలి. తమకు ముందున్న రచయితలు ఆ ప్రక్రియను ఎలా నిర్వహించారో తెలుసుకోవాలి. వారి రచనలలోని శైలీ విన్యాసాలను, కథన పద్ధతులను, భాషా సౌందర్యాన్ని అధ్యయనం చేయాలి. ముఖ్యంగా తాము ఎన్నుకున్న సాహితీ ప్రక్రియలో నలుగురు మెచ్చేలా రాయాలంటే ఈ అలవాటును తప్పనిసరిగా చేసుకోవాలి.
అసలు రచయిత కావాలంటే చదవాలి.
వివిధ శైలులు, వాటి విన్యాసాలు, పదాలు, పదబంధాలు నేర్చుకోవడానికి పఠనం అత్యవసరం. సుదీర్ఘకాలం నుంచి రచనా వ్యవసాయం చేస్తూ అక్షర బంగారు పంటలను పండిస్తున్న ప్రసిద్ధ రచయితల నుంచి యువ రచయితలు స్ఫూర్తి పొందవచ్చు.
అలాగే అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఆలోచనతో, చక్కని భాషతో, చిక్కని రచనలు చేసే కొత్తవారు ఇప్పటికే విఖ్యాతులైన రచయితల దృష్టిని ఆకర్షించవచ్చు. వారికి స్ఫూర్తి కావచ్చు. వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తించవచ్చు. ఉత్తేజాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. వారి ఆలోచనలు పయనించని దిశవైపు వాటిని ప్రసరింపజేయవచ్చు. వారి ఊహలకు కొత్త చూపునిచ్చి నవనవోన్మేషమైన జగత్తులో విహరింపజేయవచ్చు. అలా వారి కలాలను వినూత్న మార్గాల్లో పరుగులు తీయించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, కొత్త తరాన్ని చదవడం కూడా అనుభవజ్ఞులైన రచయితల రచనా వ్యాసంగానికి కొత్త ఆయుష్షును ఇవ్వగలదు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది.
పఠనం అంటే అనుకరణ కాదు. పఠనం అంటే తనదైన స్వరాన్ని కనుగొనే ప్రయాణం.
మంచి రచయితలను చదవాలి. వారి ప్రత్యేకతలను గుర్తించాలి. వారి రచనలలోని గొప్పదనాన్ని గ్రహించాలి. కానీ వారి శైలినే యథాతథంగా అనుకరించకూడదు. ఇతరుల వెలుగులో తన మార్గాన్ని చూసుకోవచ్చు; కానీ తన వెలుగును తానే వెలిగించుకోవాలి. పఠనం చివరకు రచయితను మరొకరి ప్రతిరూపంగా మార్చకూడదు. అతనిలోని ప్రత్యేకమైన స్వరాన్ని మరింత స్పష్టంగా వినిపించేలా చేయాలి.
మంచి పఠనం రచయితకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వదు; వివేచనాశక్తినీ పెంచుతుంది. ఏది మంచి రచనో, ఏది సాధారణ రచనో గుర్తించే సాహిత్యాభిరుచి ఏర్పడుతుంది. భావాన్ని ఎంత మితంగా, ఎంత ప్రభావవంతంగా చెప్పవచ్చో తెలుస్తుంది. భాషలో ఎక్కడ అలంకారం అవసరమో, ఎక్కడ సరళతే అందమో అర్థమవుతుంది. అంతేకాదు, పఠనం రచయితలో వినయాన్ని కూడా పెంచుతుంది. తాను ఇంకా ఎంత నేర్చుకోవాలో అతనికి అవగతమవుతుంది.
చదవడం ద్వారా రచయిత ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. పరిశీలించడం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకుంటాడు. తన అనుభవంతో వాటిని కలిపినప్పుడు సృజన చేస్తాడు.
అందుకే మనిషికి పరిశీలనం, పఠనం రెండూ కావాలన్నాడు మహాకవి గురజాడ.
ఈ సందర్భంలో కావ్యసృష్టికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
కావ్యాలంకారికుల భావనలో కావ్యసృష్టికి కావలసినవి మూడు—ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం.
‘వ్యుత్పత్తి’ అన్న పదానికి నిఘంటువులు ‘శాస్త్రాదిజన్య పరిజ్ఞానం’, ‘శబ్దసంభవ ప్రకారం’ వంటి అర్థాలను సూచిస్తున్నాయి. కావ్యాలంకార శాస్త్రం ద్వారా పండితలోకానికి సుపరిచితమైన మరో అర్థం—పరిశ్రమ, పాండిత్యం.
అభినవగుప్తుడు—
“రసావేశ వైశద్య సౌందర్య కావ్య నిర్మాణ క్షమత్వమే ప్రతిభ”
అన్నాడు.
ఈ పదానికి అనేక అర్థాలున్నప్పటికీ, ఈ సందర్భంలో ప్రతిభను అక్షర సృజనాత్మక శక్తిగా చెప్పుకోవచ్చు. ఇది పుట్టుకతోనే కలుగుతుందని చాలామంది అలంకారికుల అభిప్రాయం. లోపల నుంచి పెల్లుబికే సహజాతమైన శక్తి అది. ఏ గురువు దగ్గర ప్రత్యేకంగా నేర్వకుండానే కొందరిలో సహజంగా ఒనగూడేది.
కానీ ప్రతిభ ఒక్కటే సరిపోదు.
ఆ ప్రతిభకు శాస్త్రాధ్యయనం తోడవ్వాలి. గురువుల అనుగ్రహం లభించాలి. పండితుల సాంగత్యం ఉండాలి. విబుధజనుల మాటలను వినాలి. అనేక విషయాలను అధ్యయనం చేయాలి. లోకాన్ని పరిశీలించాలి. ఈ విధంగా సంపాదించే జ్ఞానమే వ్యుత్పత్తి.
పోతనామాత్యుడు అపారమైన సహజప్రతిభ కలిగిన మహాకవి. అనేక విషయాలను అధ్యయనం చేసి, ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకున్నవాడు. భాగవతాన్ని తెలుగులో పద్య, గద్య రూపాల్లో ఆవిష్కరించే సందర్భంలో ఆయన ఇలా అన్నాడు—
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన.
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పరతు.
ఈ పద్యంలోని భావం ఎంత గొప్పదో చూడండి!
భాగవతాన్ని పూర్తిగా, సమగ్రంగా అర్థం చేసుకున్నామని ఎవ్వరూ చెప్పలేరు. ఆఖరికి త్రిశూలధారి పరమశివుడైనా, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా అలా చెప్పలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా! అయినప్పటికీ పెద్దల ద్వారా ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో—అదంతా తేటతెల్లమయ్యేలా చెప్తాను అని పోతన వినయంగా అంటున్నాడు.
సహజప్రతిభను వ్యుత్పత్తి ఎంతగానో పరిపుష్టం చేస్తుందనే విషయం పోతన మాటల వల్ల అర్థమవుతోంది. వ్యుత్పత్తికి ఎంత విస్తృతమైన అర్థం వచ్చిందో గమనించారా?
అనేక గ్రంథాల, శాస్త్రాల అధ్యయనం అక్షరసృజనకు అవసరమని సుస్పష్టమవుతోంది. ఇది ప్రధానంగా గురుముఖంగా ఉంటుంది. పండితుల సాంగత్యం, సాన్నిహిత్యం వల్ల వస్తుంది. ఇంకా చెప్పాలంటే విబుధజనులు చెప్పే మాటలను వినడం వల్ల అబ్బుతుంది. లోక పరిశీలన వల్ల పొందవచ్చు.
కానీ ప్రతిభ, వ్యుత్పత్తి రెండూ ఉన్నంత మాత్రాన సాహిత్యసృష్టి సాధ్యమవుతుందా?
కాదు.
వాటికి సాధన తోడవ్వాలి.
దీనినే అభ్యాసం అన్నారు అలంకారికులు. ఇది లేనినాడు సాహిత్యసృష్టి అసాధ్యం. ప్రతిభ ఒక విత్తనమైతే, వ్యుత్పత్తి దానికి పోషణ. అభ్యాసం దానిని పెంచి ఫలవంతమైన వృక్షంగా మార్చే నిరంతర కృషి.
ఒక రాయిని సమ్మోహన శిల్పంగా మార్చగల సామర్థ్యం ప్రతిభ. దానిని అద్భుతమైన శిల్పంగా మలచటంలో ముఖ్యపాత్ర వహించే ఉలి, సుత్తులను ఉపయోగించటంలోని మెళకువలు, నేర్పరితనం వ్యుత్పత్తి. నిరంతర సాధన, అభ్యాసం వల్లే ఆ రెండూ పరిపూర్ణతను పొందుతాయి. అప్పుడే ఒక సాధారణ రాయి జీవకళ ఉట్టిపడుతూ మనముందు సజీవమైన శిల్పంగా నిలుస్తుంది. దాన్ని చూసిన మనసు రసార్ద్రమవుతుంది.
రచయిత విషయంలో కూడా అంతే.
ప్రతిభ అతనిలోని సహజమైన సృజనాత్మక శక్తి.
వ్యుత్పత్తి అతను సంపాదించుకున్న జ్ఞానం.
పఠనం అతని ప్రపంచాన్ని విస్తరించే సాధనం.
పరిశీలనం జీవితాన్ని అర్థం చేసుకునే దృష్టి.
అభ్యాసం ఆ సమస్తాన్ని అద్భుతమైన సృజనగా మార్చే సాధన.
చదివినదాన్ని కేవలం గుర్తుంచుకోవడం పఠనం కాదు. దానిని జీర్ణించుకోవాలి. జీవితాన్ని పరిశీలించాలి. తన అనుభవంతో కలపాలి. తనదైన భావప్రపంచంలో దానికి కొత్త రూపం ఇవ్వాలి. అప్పుడే నిజమైన సృజన పుడుతుంది.
చదవకపోతే రచయిత ఊహకు ఆహారం తగ్గిపోతుంది. కేవలం ఇతరులను అనుకరిస్తే అతని స్వరం కనుమరుగవుతుంది. కానీ పఠనాన్ని తన అనుభవంతో, పరిశీలనతో, ప్రతిభతో మేళవించినప్పుడు మాత్రమే అతనిలోని అసలైన రచయిత ఆవిష్కృతమవుతాడు.
ప్రతిభ – వ్యుత్పత్తి – అభ్యాసం అనే త్రివేణీ సంగమానికి పఠనం, పరిశీలనం తోడైనప్పుడే అద్భుతమైన అక్షరసంయోజనం సాధ్యమవుతుంది. అదే చక్కని కావ్యసృష్టికి పునాది.
చదివే రచయిత ఎదుగుతాడు.
పరిశీలించే రచయిత పరిపక్వత చెందుతాడు.
సాధన చేసే రచయిత నిలిచిపోతాడు.
అందుకే—
పఠనం రచయితకు ఒక అలవాటు మాత్రమే కాదు—అది అవసరం.
ఆ అవసరం మాత్రమే కాదు—అదే అక్షరసృజనకు జీవధార.
..బొడ్డపాటి చంద్రశేఖర్
ఆంగ్లోపన్యాసకులు, 63003 46501
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.



