మూలం : గై డీ మోపాస్సా కథ : Was It a Dream ?
తెలుగు అనువాదం : తిరువాయపాటి రాజగోపాల్
ఆమెను పిచ్చిగా ప్రేమించాను నేను! అసలు మనిషి ఎందుకు ప్రేమిస్తాడు ?
సృష్టి మొత్తం లో ప్రేమింప బడే ఆ ఒక్క మనిషే ఉన్నట్టుగా అనిపించడం ఎంత విచిత్రం! మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉండడం, హృదయంలో ఒకే ఒక్క కోరిక మిగలడం, పెదవులపై ఒకే ఒక్క పేరు నిత్యం నిలిచి ఉండడం ఎంత వింత!
అనునిత్యం ఆ పేరు అంతరాత్మ లోతుల నుంచి తోసుకు వచ్చే జల ధార లా పైకి పొంగి వస్తూనే ఉంటుంది. ఆపైన పెదవులపైకి చేరుతుంది. మళ్లీ మళ్లీ ఉచ్చరింపబడుతుంది. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ప్రార్థనలాగా నిశ్శబ్దంగా, అంతులేకుండా మననమౌతూనే ఉంటుంది.
ఇప్పుడు మా కథను మీకు చెబుతాను నేను . నిజానికి ప్రేమ కథలన్నీ ఎప్పుడూ ఒక్కటే; రూపాలు మారినా వాటి సారం ఎప్పుడూ ఒకటే.
నేను ఆమెను కలిశాను. …..ఆమెను ప్రేమించాను. … ఒక సంవత్సరం పాటు ఆమె అనురాగం లో బ్రతికేశాను . ఆమె కౌగిళ్ళలో, ప్రగాఢ చుంబనాలలో , ఆమె ధరించిన వస్త్రాల సువాసనలో, ఆమె పలికిన ప్రతి మాటలో నేను పరవశం లో మునిగిపోయాను. చివరకు నాకు పగలేదో రాత్రో తెలియని స్థితి వచ్చింది. నేను బ్రతికున్నానో చనిపోయానో కూడా అర్థంకాకుండా పోయింది. ఈ భూమిమీద ఉన్నానో, లేక మరో లోకంలో సంచరిస్తున్నానో కూడా తెలిసేది కాదు.
ఆ తరువాత …… ఆమె చనిపోయింది……!
ఎలా?…… నాకు తెలీదు… ఇప్పటికీ నిజంగానే తెలీదు.
ఒక సాయంత్రం భారీ వర్షంలో తడిసి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు దగ్గు మొదలైంది. వారం రోజులపాటు ఆ దగ్గు ఆమెను వదల్లేదు. చివరకు మంచం పట్టింది.
ఆ తర్వాత ఏమేం జరిగాయో నాకు ఇప్పుడు స్పష్టంగా గుర్తులేదు.
వైద్యులు వచ్చారు. మందుల చీటీలు రాశారు. వెళ్లిపోయారు. కొంతమంది స్త్రీలు వాటిని ఆమెకు తాగించారు.
ఆమె చేతులు వేడిగా ఉండేవి. నుదురు జ్వరంతో మండిపోయేది. కళ్లలో మాత్రం ఒక విచిత్రమైన ప్రకాశం— దుఃఖంతో కలిసిన వెలుగు.
నేను ఆమెతో మాట్లాడేవాడిని….. ఆమె సమాధానం చెప్పేది. కానీ మేము ఏమి మాట్లాడుకున్నామో ఇప్పుడు నాకు గుర్తులేదు. అన్నీ మరచిపోయాను. అన్నీ…అన్నీ…అన్నీ…
ఆమె మరణించిన క్షణం మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆమె పెదవులనుంచి ఒక స్వల్పమైన, బలహీనమైన నిట్టూర్పు వెలువడింది.
అప్పుడు నర్సు, “అయ్యో!” అని అంది.
“అర్థమైంది… నాకు అర్థమైంది…”
అంతే. ఆ తర్వాత నాకు ఏమీ తెలీదు.
ఒక మత పెద్ద నా దగ్గరికి వచ్చి “మీ ప్రియురాలు కదా?” అని అడిగిన ప్రశ్న నా కెందుకుకో ఆమెని అవమానించేట్టుగా ధ్వనించింది. ఆమె మరణించిన తరువాత, ఆమె గురించి అవన్నీ తెలుసుకునే హక్కు ఎవరికీ లేదని అనిపించింది. నేను అతన్ని బయటకు పంపించాను.
మరో వ్యక్తి వచ్చాడు.అతను ఎంతో మృదువుగా, సానుభూతితో మాట్లాడాడు. ఆమె గురించి అతను పలికిన మాటలు నాకు కన్నీళ్లు తెప్పించాయి.
అంత్యక్రియల గురించి నన్ను సంప్రదించారు. వాళ్ళు మాట్లాడిన మాటలేవీ నాకిప్పుడు గుర్తు లేవు .కానీ….. శవపేటిక మాత్రం గుర్తుంది. ఆమెను అందులో ఉంచి, మూత బిగించడానికి మేకులు కొడుతున్నప్పుడు వినిపించిన సుత్తి శబ్దం మాత్రం ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతోంది.
భగవంతుడా…..!
ఆమెను పూడ్చిపెట్టారు! పూడ్చిపెట్టారు! ఆమెను! గోతిలో!
ఆమె స్నేహితులు కొంతమంది స్త్రీలు వచ్చారు.
అంతే… నేను అక్కడి నుంచి పారిపోయాను….. పరుగెత్తాను. … ఆపైన వీధుల్లో గమ్యం ఏదీ లేకుండా సంచరించాను . ఇల్లు చేరి ఆ మరుసటి రోజే ప్రయాణం కట్టాను.
నిన్ననే నేను తిరిగి పారిస్కు వచ్చాను. మళ్లీ నా గదిని చూశాను. …..’ మా ‘గదిని…. ‘మా’ మంచాన్ని, ‘మా’ ఫర్నిచర్ను…. ఒక మనిషి మరణించిన తరువాత ఆ మనిషి జీవితపు గుర్తులు గా మిగిలిపోయే అవశేషాలన్నింటినీ చూశాను.
హృదయం లోని శోకం వరదై పొంగింది…. కిటికీ తెరిచి వీధిలోకి దూకిపోవాలనిపించింది. ఒక్క క్షణం కూడా ఆ గదిలో, ఆ గోడల మధ్య ఉండలేకపోయాను. అవే , ఆ గోడలే ఒకప్పుడు ఆమెను తమలో దాచుకున్నాయి. ఆ గోడల కంటికి కనబడని సన్నటి చీలికలలో ఇప్పటికీ ఆమె స్పర్శకు చెందిన అనేక అణువులు, ఆమె శ్వాసకు చెందిన అదృశ్య జాడలు దాగి ఉన్నాయనిపించింది.
అందుకే… తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. టోపీ చేతిలోకి తీసుకుని వాకిలి కేసి నడిచాను.
హాల్లో ఎదురైన పెద్ద అద్దం ముందు ఆగాను . ప్రతిరోజూ బయటకు వెళ్లే ముందు తల నుంచి పాదాల వరకూ తనను తాను ఒకసారి చూసుకోవడానికి ఆ అద్దాన్నిఅక్కడ పెట్టించింది ఆమే… వేసుకున్న దుస్తులు చక్కగా ఉన్నాయో లేదో, అలంకారం అందంగా ఉందో లేదో, కాళ్లకు వేసుకున్న చెప్పుల నుంచి తలపై పెట్టుకున్న టోపీ వరకూ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడానికి…
అక్కడే ఆ అద్దం ముందే నేను నిలిచిపోయాను…. లెక్కలేనన్ని సార్లు ఆమె రూపం ప్రతిబింబించిన ఆ అద్దం ముందు. అంత తరచుగా ఆమెను తనలో నిలుపుకున్న ఆ అద్దం, బహుశా ఇప్పటికీ ఆమె ప్రతిబింబాన్ని తన ఆంతర్యంలో ఎక్కడో దాచుకునే ఉంటుంది..
ఒకప్పుడు ఆమెను తనలో నిలుపుకున్న ఆ అద్దంపైనే నా చూపులు నిలిచిపోయాయి. ఆ క్షణంలో నాకు ఆ అద్దంపైనే ప్రేమ పుట్టినట్టయింది. దానిని తాకాను. అది చల్లగా ఉంది.
పాపం అద్దం…!!!
తన ముందు నిలిచినవారినీ, తనలో ప్రతిబింబించినవారినీ, తన ప్రేమలో ఒకప్పుడు దాచుకున్న రూపాలనూ మరచిపోగల హృదయాలను కలిగిన మనుషులు ఎంత అదృష్టవంతులో!
అక్కడికి వెళదామని అనుకోకుండానే నా అడుగులు శ్మశానవాటికవైపు మళ్లాయి.
వెదికి ఆమె సమాధిని కనుక్కున్నాను. తెల్లని పాలరాతి శిలువతో గుర్తు వేసిన ఒక సాధారణ సమాధి.
దానిపై కొన్ని మాటలు చెక్కబడి ఉన్నాయి—
“ఆమె ప్రేమించింది, ప్రేమించబడింది, మరణించింది.”
ఆమె అక్కడ ఉంది… ఎక్కడో అడుగున.. మట్టిలో మట్టిగా మారి…
ఆ ఆలోచనే వేదనా మయం గా ఉంది.
నేలపై నుదుటిని ఆనించి విలపించాను నేను… చాలాసేపు… చాలా చాలాసేపు… అలాగే ఉన్నాను.
చీకటి కమ్ముకుంటోందని గమనించినప్పుడు, ఒక విచిత్రమైన, ఓ వెర్రి ఆలోచన నన్ను ఆవహించింది. ఆమె సమాధి పక్కనే రాత్రంతా గడపాలని అనిపించింది. కానీ అలా చేస్తే నన్ను చూసి కాపలా వాళ్ళు బయటకు పంపేస్తారని తెలుసు.
ఒక ఉపాయం ఆలోచించాను. లేచి ఆ మృతుల నగరమంతా చక్కర్లు కొట్టడం మొదలెట్టాను.
జీవించి ఉన్న మనుషుల కంటే మరణించిన వాళ్ళ సంఖ్య ఎంతోఎక్కువ అయినా , మనం జీవిస్తున్న నగరంతో పోలిస్తే ఈ మృతుల నగరం ఎంత చిన్నది!
జీవించి ఉన్న వాళ్ళం మన కోసం విశాలమైన వీధులు, ఎత్తైన గృహాలు, విస్తారమైన స్థలాలు నిర్మించుకుంటాము. చివరకు భూమి అందర్నీ తిరిగి తనలో కలుపుకుంటుంది.
కానీ అనాదిగా జీవించి వెళ్లిపోయిన అనేక తరాల మృతుల కథేంటి ? భూమిపై వారికి ఎంత తక్కువ స్థలం!
శ్మశానవాటిక చివరలోకి చేరుకున్నాను.
అక్కడ చాలా కాలం క్రితం మరణించినవారి సమాధులు ఉన్నాయి. వాటి పైన నిలబెట్టిన శిలువ చిహ్నాలు తునిగి పోతున్నాయి. కొత్తగా రాబోయే సమాధుల కోసం ప్రక్కనే జాగా ఉంది.
ఎవరూ పెంచని , ఏ సంరక్షణా లేని గులాబీ మొక్కలు, నల్లటి సైప్రస్ చెట్లూ పెరిగిన తోట అదంతా ; మానవ శరీరాలనే ఎరువుగా తీసుకొని పెరిగిన తోట.
నేను తప్ప మరెవ్వరూ లేరక్కడ. ఒక దట్టమైన చెట్టు కొమ్మల మధ్య దాక్కున్నాను. ఓడ ప్రమాదంలో మునిగిపోతున్న వ్యక్తి ఒక పలకను ఎలా గట్టిగా పట్టుకుంటాడో, అలాగే చెట్టు కాండాన్ని గట్టిగా పట్టుకొని వేచి ఉండి బాగా చీకటి కమ్ముకున్న తరువాత బయటకు వచ్చాను.
మెల్లగా…శబ్దం చేయకుండా… ఆ సమాధుల మధ్య సంచరించసాగాను.
ఆమె సమాధిని వెతికాను. చాలాసేపు వెతికాను ; కానీ ఎందుకో కనుక్కోలేకపోయాను. అంధుడు దారి వెతుక్కున్నట్టుగా తడుముకుంటూ నడిచాను.
రాళ్లు… శిలువలు… ఇనుప కంచెలు…. వాడిపోయిన పూలదండలు… అన్నింటినీ తాకాను. వేళ్లతో అక్షరాలను స్పృశిస్తూ సమాధులపైన చెక్కిన పేర్లు చదివాను. ఆమె సమాధి మాత్రం కనిపించలేదు.
ఆకాశంలో చంద్రుడు లేడు. కుడివైపు సమాధులు… ఎడమవైపు సమాధులు… ముందు సమాధులు… వెనుక సమాధులు… ఎటు చూసినా సమాధులే!
చివరకు ఒక సమాధిపైన కూర్చున్నాను.
నా మోకాళ్లు వణుకుతున్నాయి. నడిచే శక్తి లేకపోయింది. నా గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది.
అయితే… ఇంకో శబ్దం కూడా వినిపించింది. ఏ శబ్దమది? చెప్పలేను. అస్పష్టమైనది. అనామకమైనది.
అది నా తలలోనుంచి వస్తోందా? లేక మానవ మృతదేహాలతో నిండిన , రహస్యాలు దాచుకున్న భూమి లోతులనుంచి వస్తోందా? భయంతో నేను కదలలేకపోయాను.
అప్పుడే… నేను కూర్చున్న పాలరాతి పలక కదులుతున్నట్టనిపించింది.
అవును. అది పైకి లేస్తోంది.
నేను ఒక్కసారిగా పక్క సమాధిపైకి దూకాను.
అప్పుడు చూశాను. స్పష్టంగా చూశాను.
నేను కూర్చున్న సమాధి రాయి నిటారుగా లేచింది. అందులోనుంచి ఒక అస్థిపంజరం బయటకు వచ్చింది. తన వంగిన వీపుతో రాయిని వెనక్కి తోసింది ఆ అస్థిపంజరం.
ఆ సమాధి పై నున్న శిలువ పై ఇలా వ్రాయబడి ఉంది—
“ఇక్కడ జాక్ ఆలివాంట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. యాభై ఒకటవ ఏట మరణించాడు. తన కుటుంబాన్ని ప్రేమించాడు. దయాగుణం కలవాడు. గౌరవనీయుడు. దేవుని కృపలో మరణించాడు.”
పైకి లేచి వచ్చిన మృతుడు ఆ మాటలు చదివాడు.
తర్వాత నేలపై ఉన్న ఒక చిన్న పదునైన రాయిని తీసుకున్నాడు.
నెమ్మదిగా అప్పటికి లిఖించబడి ఉన్న ఆ అక్షరాలను చెరిపివేయడం ప్రారంభించాడు.
అన్నీ పూర్తిగా తొలగించిన తరువాత, తన తన చూపుడు వేలి తో ఇలా వ్రాశాడు—
“ఇక్కడ జాక్ ఆలివాంట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. యాభై ఒకటవ ఏట మరణించాడు. తన తండ్రి ఆస్తి కోసం అతని మరణాన్ని వేగవంతం చేశాడు. తన భార్యను హింసించాడు. పిల్లలను బాధించాడు. పొరుగువారిని మోసం చేశాడు. అవకాశం దొరికిన ప్రతి ఒక్కరినీ దోచుకున్నాడు. దుర్భాగ్యంగా మరణించాడు.”
అప్పుడు నేను చుట్టూ తిరిగి చూసాను…..
అన్ని సమాధులు తెరుచుకున్నాయి. అన్ని మృతదేహాలు బయటకు వచ్చాయి.
వారి బంధువులు వ్రాసిన అబద్ధాలన్నింటినీ చెరిపివేసి, ప్రతి ఒక్కరూ తమ నిజమైన జీవిత చరిత్రను వ్రాస్తున్నారు.
వారంతా… దుర్మార్గులు… వంచకులు… కపటులు… అసూయాపరులు… అబద్ధాలకోరులు… మోసగాళ్లు… అపవాదులు… దొంగలు… అని ఒక్కొక్కరు తమ గురించి తామే రాస్తున్నారు.
జీవించి ఉన్నప్పుడు “మంచి తండ్రి”, “మహా ఇల్లాలు”, “నిజాయితీ గల వ్యాపారి”, “ఆదర్శ కుమారుడు” అని పిలవబడినవారందరూ ఇప్పుడు తమ సమాధులపై భయంకరమైన నిజాలని వ్రాస్తున్నారు…. జీవించి ఉన్నప్పుడు ఒక్కొక్కరి గురించి ఎవరికీ తెలియని, తెలిసినా తెలీనట్టుగా చలామణి అయిపోయిన చేదు నిజాలని…!
అప్పుడు ఒక్కసారిగా నాకు ‘ఆమె’ గుర్తొచ్చింది.
ఆమె కూడా తన సమాధిపై ఏదో వ్రాసి ఉండాలి! అనే ఆలోచనతో, ఇప్పుడు భయం లేకుండా సమాధుల మధ్య పరుగెత్తాను.
ఆమెను వెంటనే గుర్తుపట్టాను – ఆమె ముఖం మీద శవానికి కప్పే వస్త్రం ఉన్నప్పటికీ.
ఇంతకముందు కొద్దీ సేపటి క్రితం ఆమె సమాధి పై నేను చదివిన ఉల్లేఖనం
“ఆమె ప్రేమించింది, ప్రేమించబడింది, మరణించింది.” అని ఉండేది.
కానీ ఇప్పుడు దాని స్థానంలో ఇలా వ్రాయబడి ఉంది—
“ఒక రోజు తన ప్రేమికుడిని మోసగించడానికి బయటకు వెళ్లింది. వర్షంలో తడిసి జలుబు చేసింది. దాని వల్ల మరణించింది.”
అంతే…స్పృహ తప్పింది నాకు..!!! తెల్లారాక స్మశానం పని వాళ్ళు నన్ను ఆమె సమాధి పక్కనే స్పృహ తప్పి పడి ఉండగా చూశారు.
![]()

కవిత్వం, కథలు, అనువాదాలు (కథలు కవితలు) రాస్తుంటారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికల ఎడిట్ పేజీల్లో, ఆదివారం అనుబంధాలలో వ్యాసాలు రాస్తుంటారు. 2013 లో ‘వెన్నెల్లో మంచుపూలు’ (కవితా సంపుటి), 2024 లో ‘ఆఖరి స్నేహితుడు’ (కథా సంపుటి), 2025లో ‘100 కబీర్ కవితలు’ ప్రచురించారు. 1975 లో SV University నుండి MA English Literature పట్టా అందుకున్నారు. 1977 నుండి 2013 దాకా State Bank of India లో
ఉద్యోగం. కడప, తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ఊళ్లలో పనిచేశారు.



