గుజరాతీ మూలం: ప్రాణజీవన్ మహేతా
అనువాదం: పాలెపు బుచ్చిరాజు
-1-
ఊరిపొలిమేరలొ నిలబెట్టిన వీరుడి విగ్రహం మీద కాలెత్తి కుక్క ఉచ్చ పోసింది.
రాజపుత్రుల ఇంటిలో పాలు తాగి మైకంలో ఉన్న పిల్లి అది చూసింది.
చూసీ చూడగానే దాని మనసులో కత్తిలాంటి ఆలోచన వచ్చింది.
ఏం చేయాలి, ఏం చేయరాదు అన్న సందిగ్ధంలో పడింది.
అక్కడి నుంచి గాడిద పెంటకుప్పల వైపు దారి తీసింది.
తిన్నగా వెళ్లి ఒక గాడిద ముందు నిలబడింది.
పిల్లిని చూడగానే గాడిద లేచి నిలబడింది.
పిల్లి విషయం అంతా వివరంగా చెప్పింది
ఆఖర్న అంది. నువ్విక్కడే ఉండు.
నేను అంతా చెప్పేవరకు కదలొద్దు.
గాడిద సరే! అన్నట్టు తలూపింది,
కాని తోక మాత్రం వ్యతిరేకంగా ఊపింది
అయినా పిల్లి గాడిద మీద విశ్వాసంతో,
తిరిగి కుక్క దగ్గరికి వెళ్ళింది.
ఆ కుక్క చెవిలో పిల్లి ఎదో చెప్పింది.
అది విని కుక్క రెండు కాళ్ళు పైకెత్తి, నేల మీద రువ్వుతూ
ధూళి ఎగరేస్తూ, గాడిదని చూసింది.
‘అరె! గాడిదా! నువ్వు రోజంతా పేడ వాసన పీల్చి, పీల్చి,
బాగా దెబ్బలు తిన్నట్టున్నావు.’ అని అరిచింది.
కుక్కకు, గాడిదకి మధ్య వాగ్వాదం మొదలయింది.
గోడ మీద కూర్చుని పిల్లి ఈ వింత చూస్తూ ఆనందిస్తోంది
మాటామాటా పెరిగాయి. కుక్క గాడిదని కరవడానికి తయారయింది.
గాడిదకి అప్పుడు అర్థం అయింది. ఈ పిల్లి చెప్పిన మాట నిజమే
ఈ కుక్కకి పిచ్చి పట్టిందని. పిల్లి ఎలా అనుకుందో నిజంగా అదే జరిగింది
గాడిద వెనకాళ్లు రెండు ఎత్తి, కుక్కని ఒకతాపు తన్నింది.
కుక్క కుయ్యో, మొర్రో అంటూ పోయి విగ్రహం దగ్గర పడింది.
కుక్క నోటినుంచి కారే రక్తంతో విగ్రహం తడిసిపోతోంది
అంతా అనుకున్నట్టే జరిగినందుకు పిల్లి మీసాలు తిప్పుకుంటూ
కుక్క దగ్గరికి వెళ్లి నిలబడి అంది. గాడిద బుద్ధి గాడిద బుద్దే !
నువ్వు అనవసరంగా దానితో పెట్టుకున్నావు.
సగం, సగం వింటూనే కుక్క విగ్రహం మీద కాళ్లు పెట్టి అడ్డంగా పడిపోయింది.
పిల్లి గాడిదని చూసి ఒక చిరునవ్వు నవ్వింది.
గాడిదకి ఏమీ అర్థం కాకపోయినా,
తల అవునన్నట్టు, తోక కాదన్నట్టు ఊపుకుంటూ,
ఊరి పొలిమేర వైపు మళ్ళింది.
-2-
కాకి గంట స్తంభం మీద కూర్చుని, గడియారం ముళ్ళ వైపు చూస్తోంది.
గడియారం ఆగిపోయింది. ముళ్ళు విరిగి పోయాయి.
కాకి ముక్కుతో ఆ ముళ్ళని కదిపే ప్రయత్నం చేస్తోంది.
కాని అదేమీ పని చేయలేదు. కాకి తిరిగి స్తంభం ఎక్కి కూచుంది
అంతలో మరొక పేచీల పక్షి ఎగిరి వచ్చి దాని పక్కన కూచుంది.
ఈ రోజు ఈ కాకి మనసు చాలా సంతోషంగా ఉన్నట్టుంది
లేకపోతే ఈ స్తంభం మీద గడియారం ముళ్ళు చూస్తూ ఇలా కూర్చోదు అనిపించింది దానికి.
ఆ పక్షి, ఈకలు సర్దుకుని ముక్కు సరిచేసుకుని తన ఉనికిని తెలిపింది.
కాకి ధ్యానం అటు మళ్ళింది. అదే అదనుగా తీసుకుని, ఆ పక్షి
“ఏమాలోచిస్తున్నావు? కాకి మిత్రమా!” అని అడిగింది.
“ఆలోచనా? అంటే?” అడిగింది కాకి.
ఆలోచన అంటే తెలియని ఈ పక్షి ఎక్కడిదిరా బాబూ! అనుకుంటూ,
మళ్లీ అడిగింది, “మిత్రమా! నువ్వు ఈ స్తంభం మీద కూర్చుని,
ముక్కు పదును చేసుకుంటున్నావా?”
“అబ్బే! అదేంకాదు. ఈ గడియారం ముళ్ళు విరిగి పోయాయి.
దానిని గురించి ఆలోచిస్తున్నాను” అంది కాకి.
పేచీల పక్షి మళ్ళి ఇలా అంది. “ఇందులో అంతగా ఆలోచించ వలసింది ఏముంది ?
అయినా ఆలోచిస్తూ కూచుంటే ఒరిగేదేముంది?
నీ ముక్కు రెండు భాగాలు చేసి రెండు ముళ్ళుగా
దానికి అంటించు. గడియారం దానంతట అదే పరుగులు తీస్తుంది.
అందరికీ టైము గురించి చింత తొలగి పోతుంది.”
అది విన్న కాకి ఆలోచనలో పడింది.
“మరి నా తిండి మాటేంటి? నేనెలా భోజనం చేస్తాను?” అడిగింది.
“అరే! భాయ్! దానిని గురించి చింతించకు. నేనున్నానుగా,
నీకిష్టమైన పదార్థాలన్నీ తెచ్చి తినిపిస్తాను. నీకెందుకు బాధ.
అలా అని కాకి సందేహానికి సమాధానం చెప్పి,
“అయినా పదిమందికి ఉపయోగపడే పనికదా! పుణ్యం వస్తుంది.” అంది.
ఆ పక్షి మాటలు కాకమ్మకి నచ్చాయి.
ఆలస్యం చేయకుండా ఆ దొంగ పక్షి కాకిని తొందర పెట్టింది.
“నడు, మంచిపని చేయడంలో జాప్యం ఎందుకు?
వెళ్లి నీ ముక్కుని రెండుగా చీల్చగల గట్టి కర్రని వెదుకుదాం!
వాటిని తొందరగా తెచ్చి గడియారానికి తగిలిద్దాం.” అంది.
అ విధంగా ఆ రెండు పక్షులూ గట్టి కర్ర వెతకడం కోసం
గంట స్థంబం మీదనుంచి ఎగిరిపోయాయి.
-3-
పెద్ద వర్షంలో తడుస్తున్న చెట్టు క్రింద
చాలా సేపటినుంచి ఒక నెమలి, కోడిపుంజు నిలబడి ఉన్నాయి.
వాన ఇప్పట్లో ఆగే సూచనలు ఏమీ కనిపించడం లేదు.
ఇంక విసుగెత్తి, నెమలి కోడిపుంజుతో అంది.
“పుంజు మామా! పద మా ఇంట్లో పడుకుందాం. ఇంకేం చేయగలం?
పుంజు సరే! అన్నట్టుగా తల ఊపింది.
కాని తరవాత ఆలోచించి నెమలితో అంది
“మరి తెల్లారుతూనే నేను కొక్కొరోకో అని అరవాలి
లేకపోతే సూర్యుడు మేఘాల వెనకనే ఉండి పోతాడు.
నా కూత కోసం ఎదురు చూస్తూ అన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి.
ఎవరూ ఇంటి తలుపులు కూడా తెరవరు.
సూర్యుడు జగత్తుకి ఒక ఉపాధి.
నేను నీ ఇంటికి వస్తే ఇవన్ని ఆగిపోతాయి.
నాకు ఈ నెత్తి మీది జుట్టు ఒక శాపం అయింది. “
అని కొంచెం సేపు ఆగి మళ్లి అంది.
“మిత్రమా! నెత్తిమీది జుట్టు అయితే నీకూ ఉంది.
కాని నువ్వు అదృష్టవంతుడివి
జుట్టుకి, జుట్టుకి ఎంత తేడా ఉంది !
ఏమిటో ఈ జుట్టుల మాయలోకం!”
ఆఖరికి తల ఊపుతూ “సరే! నడువు.
ఇప్పుడు మరొక గత్యంతరం కూడా లేదు గదా.” అంది.
ఆ రెండు పక్షులూ వెళ్లి ఒక పెద్ద చెట్టు తొర్రలో దూరాయి.
పుంజు అయితే, నెమలి తోక క్రిందనే ఒదిగి పోయింది.
ఈ ఈకల లోకంలో సూర్యోదయం ఎప్పుడైనా అవుతుందా?
ఇక్కడ కూసేవారెవరు? అనిపించింది పుంజుకి
భళ్ళున తెల్లవారింది. పుంజు ఇంకా నిద్రలోనే ఉంది.
ఈకల లోకంలో సూర్యుడు ఉదయించనే లేదు.
ఆఖరికి నెమలే పుంజుని నిద్ర లేపింది.
పుంజు కళ్ళు నులుపుకుంటూ లేచి తల మీది జుట్టు సర్దుకుంది
నోరు పెద్దగా తెరిచి కూయ బోయింది.
ఇంతలో నెమలి దానిని వారించింది.
ఊరుకో పుంజు మామా! ఊరుకో! నువ్వు కూయ వలసిన అవసరం లేదు.
ఈ వానా మేఘాలు ఇంకా అయిదారు రోజులు ఇలాగే ఉంటాయి.
సూర్యుడు నీలాగా తడిసిపోలేదు. ఎక్కడో మేఘాల అవతల దాక్కున్నాడు.
నువ్వు ఇప్పుడు కూసినా అది మిధ్య అవుతుంది.
పుంజుకి అనుమానం కలిగింది.
ఈ నెమలి దాని జుట్టు నాకు తగిలిద్దామని చూస్తోంది అని.
ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే కుయ్యాలని అనుకుంది.
ఇంతలో నెమలి నోరు పెద్దగా విప్పి, రెక్కలు అడ్డుగా పెట్టి
మళ్ళి పుంజుని కూయకుండా ఆపుజేసింది.
-4-
మొసలి వీపు ఆరబెట్టు కుంటూ ఇసకలో పడి ఉంది.
దాని ఎడమ కంటి నుంచి ఒక బొట్టు నీరు జారి, నత్తగుల్లలో పడింది.
అది చెట్టు కొమ్మ మీద కూర్చున్న కోతి చూసింది.
చూసిన కోతి మనసులో ఏవేవో ఆలోచనలు!
తిన్నగా క్రిందకి దిగింది. మొసలి చెవిలో చెప్పింది.
“మొసలి మామా! నీ కన్నీళ్ళు అలా దుబారా చేయకు.
వాటి విలువ ఎంతో నీకు తెలియదు.
నాతో రా! నిన్ను పగడాల దీవికి తీసుకు పోతాను.
అక్కడ నువ్వు ఒక్కొక్కటిగా కన్నీళ్లు కార్చు.
కళ్ళు మూసి తెరిచేలోగా అవి మంచి ముత్యాలుగా మారడం చూస్తావు.”
మొసలికి కోతి మాటల్లో అసత్యం ఏమి కనిపించలేదు.
కాస్త ఆగి ఆలోచించింది. ఇటు నుంచి అటు కదిలింది.
ఆరుతున్న వీపుని ఒకసారి చూసుకుంది.
తరవాత తలెత్తి, కోతి వైపు చూసింది.
ఇంతలో రెండో కంటినుంచి కూడా ఒక బొట్టు నీరు నేల పాలైంది.
అప్పుడు మొసలికి ‘ఈ కోతి మాటల్లో ఏమాత్రం నిజం ఉన్నా
ఈ కన్నీళ్ళు ఇలా వృధా చేయడం తగదు.’ అనిపించింది.
ఒక్కసారిగా తోకని జెండాలాగ పైకి ఎత్తింది
మొసలికి తన మాటలు నచ్చాయని కోతి అర్థం చేసుకుంది.
క్షణాల్లో ఆ కోతి, మొసలి పగడాల దీవి వైపు సాగాయి.
చెట్టు చిటారు కొమ్మన కూర్చుని, ఈ వింత గమనిస్తున్న కాకి
పలాయన మంత్రం పఠించ సాగింది.
-5-
అడవిలో ఒక అమాయకపు పులికి
చిన్నప్పుడే చాలా త్యాగ బుద్ధి అలవడింది.
అంతే కాకుండా దానికి దైవ భక్తి కూడా తోడయింది.
జంతువుల్ని వేటాడడం మాని,
నిత్యమూ భజనలు చేస్తూ గుహలోనే పడి ఉండేది.
దాని వెనకనే తిరిగే తోడేలుకి ఇదేమీ నచ్చలేదు.
పులికి ఎంతో నచ్చ జెప్పింది. కాని ఉపయోగం లేకపోయింది.
అది దాని జిత్తులన్నీ వాడినా ప్రయోజనం లేక పోయింది.
పులి గోళ్ళు వేట లేకపోవడంతో తుప్పు పట్టేశాయి
అది వాటిని శేష ప్రసాదంగా భావించి, తన దగ్గర దాచుకుంది.
తోడేలు ఎన్నో నీతి కథలు చెప్పినా
దున్నపోతుముందు భాగవత ప్రవచనం లాగ అనిపించింది.
పులి ప్రవర్తనతో విసిగిపోయి తోడేలు ఆఖరుకు
దానిని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది.
పోతూ, పోతూ పులి గోళ్ళు మాత్రం తన వెంట తీసుకుపోయింది.
తోడేలు అడవిలో తిరుగుతూ ఉండగా, దానికి గుంట నక్క కనిపించింది.
దానికి తోడేలు కథనంతా వినిపించి, గోళ్ళు చూపించింది.
గుంట నక్క కొంత సేపు ఆలోచించి, తోడేలుతో అంది.
“ఆ పులి గోళ్ళు ఇలా ఇయ్యి“ అని వాటిని పరిశీలించింది.
అవి అసలు వాడకంలో లేక బాగా తుప్పు పట్టి ఉండడం గమనించింది.
తోడేలుతో “నాతోరా! వీటిని పిల్లి రాణి వారికి చూపిద్దాం
వారు వీటిని సరి చేసి, బాగా పదును చేసి ఇస్తారు.
అప్పుడు మనం వాటిని ధరించి, అడవిలో జంతువుల్ని వేటాడుదాం”
ఆ విధంగా తోడేలు, గుంట నక్క పిల్లి రాణి వారిని వెదకడానికి
అరణ్య ప్రవేశం చేశాయి. ఈ సంభాషణ విన్న కాలనాగు,
బుస్సుమంటూ బిలం లోంచి వచ్చి పులి ఉండే గుహ వైపు ప్రయాణం కట్టింది.
-6-
పుసకాన్ని ఆవరించిన చెద పురుగుకి చాలా ఆనందంగా ఉంది.
ఒక్కొక్క పుటతోనూ కడుపు నింపుకుని త్రేంచుతూ హాయిగా కాలం గడుపుతోంది.
అది కళ్ళారా చూస్తున్న కండ చీమకి కన్నుకుట్టింది.
ఉండబట్టలేక ఒకనాడు చెద పురుగుతో అంది.
“నువ్వు ఆ నల్లటి అక్షరాలు చదివి ఇలా త్రేన్చడం ఏమీ బాగోలేదు.”
అది విన్న చెదపురుగు అహం దెబ్బతింది.
కొంచెం ఆగి చీమతో అంది. ”ఆగు! ఆగు! నువ్వేమనుకుంటున్నావు?
నల్లటి అక్షరాల్ని నేను ఊరికేనే బద్దలు కొడుతున్నానా?
అందులో ఉన్న కష్టం నీకేం తెలుసు? చెప్పుతాను విను.
అదేమిటో, ఆ కష్టం ఏమిటో!” ఆ తరవాత అది నల్ల చీమ
బుర్ర వాచిపోయేలా పాఠం చెప్పసాగింది.
చీమ భరించలేక అక్కడి నుంచి పారిపోవాలని చూసింది.
కాని ఎక్కడికి పోగలదు?
పుస్తకం మధ్యలో ఉన్న బొద్దింక ఈ చోద్యం చూస్తోంది.
చీమ పరిస్థితి చూసి దానికి జాలేసింది.
ఏమీ మాట్లాడకుండా మీసంతో చెదపురుగుని విసిరేసింది.
సగం గర్వం అణగిపోయిన చెదపురుగు, దొర్లుకుంటూ పోయి దూరంగా పడింది.
చీమ దొర్లుతూ పోతున్న చెద పురుగుకి ఇలా సలహా ఇచ్చింది.
“ఎందుకు ఇలా నల్ల అక్షరాలు తిని, తిని, జీవితాన్ని వృధా చేసుకుంటావు?
చక్కగా తెల్లని కాగితాలు తిని తాజాగా అవవచ్చుకదా!
నా మాట విని, గర్వం వదిలిపెట్టి, నీ బుద్ధి మార్చుకో!”
ఈ సంభాషణ వింటోన్న బొద్దింక మీసాలు మెలేసింది.
పుస్తకం పక్కనే గూడు అల్లుతున్న సాలెపురుగుని చూసి,
ప్రాణ రక్షణ కోసం, చెదపురుగు సగం తిన్న
తెల్ల కాగితం వెనక తల దాచుకుంది.
-7-
ముంగిస వీపు మీద పాము చుట్ట చుట్టుకుని కూచుంది.
ముంగిస నెమ్మదిగా ముందుకు నడుస్తోంది.
అసలేంజరిగిందంటే ……..
పాము ఒక పెద్ద ఎలుకని మింగేసింది.
ఎలుక బొద్దింకని చంపి తినేసింది.
ఆ బొద్దింక కండ చీమని మింగేసింది.
చీమ గాదెలో పుచ్చిపోయిన బియ్యపు గింజ తినేసింది.
ఆ గింజ విషం చీమకి ఎక్కింది. అది అలా పోయి, పోయి,
ఆఖరికి పాము శరీరానికి ఎక్కింది. పాము కదలలేకుండా అయిపోయింది.
పాముకి వైద్యం చేయించడానికి, ముంగిస మిత్రభావంతో
తన వీపు మీద ఎక్కించుకుని వెళ్తోంది.
దారిలో వచ్చే పోయి వారంతా “పాముకి ఏమయింది?” అని అడగసాగారు.
అందరికి సమాధానాలు చెప్పి, చెప్పి ముంగిస అలసిపోయింది.
సగందారిలో ఆగి ఆలోచించ సాగింది. ‘ఇలా ఎక్కడికని పోతాను?’ అని.
వీపు మీద ఉన్న పాముని క్రిందికి దింపి కాస్త ఊపిరి పీల్చుకుంది.
“పాముగారూ! ఇప్పుడు ఏంచేద్దాం?”అని అడిగింది.
పాముకి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు.
“మిత్రమా! ఈ పీడ ఇంతటితో ముగిసేలా లేదు.
నా చావు ఇక్కడే రాసిపెట్టి ఉందేమో!
ఉన్నట్టుండి ప్రాణం పోయేలా ఏదేనా తినాలని ఉంది.” అంది.
ముంగిస పాముతో సాంత్వనం పలుకుతూ ఇలా అంది.
“అలా అనకు మిత్రమా! జీవితంలో అంత తేలిగ్గా ఓడిపోరాదు
ధైర్యంగా ఉండు. అంతా సవ్యంగా జరుగుతుంది.
త్వరలో అన్నీ సర్దుకుంటాయి. ఇకపై ఏదైనా తినేముందు
కాస్త వెనకా ముందు ఆలోచించు.”
అది విన్నాక పాముకి ప్రాణం లేచి వచ్చింది.
తన చుట్టని కాస్త కదిలించింది. పడగ ఎత్తింది.
నాలుకలు పైకి తెచ్చి కాస్త మందహాసం చేసింది.
ఆ యిద్దరూ అలా కూర్చుని, అలసట తీర్చుకుంటున్నారు.
అంతలో ఒక బల్లి అటు వస్తూ కనిపించింది.
అది పాము, ముంగిస ఒకే దగ్గర ఉండడం చూసి విస్తుపోయింది.
వచ్చి వాళ్ళతో మాట్లాడి, విషయం అర్థం చేసుకుంది.
కొంచెం సేపు ఆలోచించి, వాళ్లకి ఇలా సలహా ఇచ్చింది.
“ఓ ముంగిసా! ఈ విషం వల్ల మరణం తప్పించుకునే మార్గం ఒకటి ఉంది.
ఇక్కడ ఒక శేషనాగు బుసలు కొడుతూ పడి ఉంది.
తన విషాన్ని ఎక్కడ కక్కాలా అనే చింతతో దానికి నిద్ర పట్టడం లేదు.
వెళ్ళండి, మీరు దానిని బతిమాలుకొండి
అది రెండు మూడు సార్లు ఈ పాము పొట్ట మీద కాటు వేస్తే,
దాని విష ప్రభావం త్వరలోనే మన పాము శరీరంలో కలుస్తుంది.
మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా!
ముల్లుని ముల్లుతోనే తీయాలి, ప్రేమకి బదులు ప్రేమ
అలాగే విషానికి విరుగుడు విషమే!
కొంచెం సేపు బాధగా ఉంటుంది, కాని తరవాత అన్నీ సర్దుకుంటాయి.
వెళ్ళండి, శేషనాగు నిద్రలోకి జారుకుని, గుర్రుపెట్టేలోగా వెళ్ళండి”
ఇప్పుడు పాము, ముంగిస ఆలోచనలో పడ్డాయి.
బల్లి వాళ్ళని తొందర పెట్టుతూ, మళ్ళి ఇలా అంది.
“ఇలా విచారిస్తూ కూర్చుంటే, పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
ముందు ఆచరణలో పెట్ట వలసిన దానిని చేయండి. ఆలోచనలు తరవాత.
ఆ మాటలు విన్న పాము ముంగిసతో ఇలా అంది.
“నడు! మిత్రమా! నడు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది.
ఇదొక్కటే ఉపాయం మిగిలింది. మరేమీ దారి కూడా లేదు కదా!”
చేసేదిలేక, ముంగిస పాముని తన వీపు మీద ఎక్కించుకుని,
శేషనాగు ఉన్న దిశగా ప్రయాణం కట్టింది.
-8-
మొసలికి తన కళ్ళకి శుక్లాలు వస్తున్నాయని అనుమానం వచ్చింది.
చక్కగా పారుతున్న నీటిలో చేపలు లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తాయి.
చేప దొరికినప్పుడు దవడలు బాగా చాపక చేపలు తప్పించుకుంటాయి.
నీళ్ళలో తల కొట్టుకుంటుంది. ఈ శుక్లాలతో మొసలికి మతి పోయినట్టనిపించింది
ఒకనాడు, అది ఇసకలో బోర్లా పడుకుని ఏం చేయాలి? అని ఆలోచించ సాగింది.
దానికి ఏమీ పాలుపోవడం లేదు. తన మిత్రుడు కోతిని పిలిచి అంతా వివరంగా చెప్పింది.
కోతి ముసలి మీద జాలితో ఇలా అంది, ”మిత్రమా! ఇంత చిన్న వయసులో
నీకు కళ్ళశుక్లాలు రావడం చాలా శోచనీయం. నువ్వు ఇంకా….”
కోతి మాటల్ని సగంలోనే ఆపి మొసలి మళ్ళి చెప్పింది.
“అయ్యా! ఇన్నిమాటలెందుకు? కళ్ళకి శుక్లాలు వచ్చిన మాట వాస్తవం.
నదిలో ఈదుకుంటూ తిరగడం తప్ప ఒక్క చేప కూడా వేటకి అందడం లేదు.
దీని నివారణకి ఏదైనా ఉపాయం ఆలోచించి చెప్పగలవని నిన్ను పిలిచాను.“
మొసలి మాటలు విని, కోతి చెప్పింది. “మిత్రమా! నాకు తెలిసిన
ఒక గ్రద్ద వైద్యుడు ఉన్నాడు. వనమూలికలు, మిరియాలు, మసాలాలు
కలిపి నూరి మందులు తయారు చేస్తాడు. ఆయనది నాటు వైద్యం.
ఒంటి ఆయన ఆదర్శం. ఒంటి లద్దేతో మందులు నూరి జబ్బులు బాగు చేస్తాడు.
నాకు తెలిసి ఎందరో ఆయన చేసిన వైద్యంతో బాగుపడ్డారు.
ఆయనకి చరక వైద్యం కుడా బాగా తెలుసు.
ఆయన చరక వైద్యంతో దీర్ఘరోగులే కాక, చచ్చిన వాడు కూడా లేచి కూర్చుంటాడు.
నువ్వు సరే! అంటే ….” సగం చెప్పి కోతి ఆగింది.
కోతి గ్రద్ద వైద్యుడిని అంతగా పొగడడంతో ముసలికి నమ్మకం కలిగింది.
నిండా మునిగిన వాడికి గడ్డిపరక అందినా పట్టుకుంటాడు.
ఆఖరికి ఆ యిద్దరూ గ్రద్ద వైద్యుడి వద్దకు బయల్దేరారు.
మొసలి, కోతి తన కోసం రావడం గద్ద దూరం నుంచే కనిపెట్టింది.
సామానంతా సర్దుకుని, చెట్టు కొమ్మ మీద వాళ్ళ కోసం ఎదురు చూడసాగింది.
కోతి వైద్యుడికి, మొసలి కంటి శుక్లాల గురించి చెప్పింది.
గ్రద్ద ముందుగా మొసలి నాడి పరీక్షించింది.
పంజాతో పొట్టమీద కొట్టింది. గోళ్ళతో చర్మం పరీక్షింది.
వయసు, అలవాట్లు, దురలవాట్లు, రోగ లక్షణాలు అన్నీ అడిగి తెలుసుకుంది.
నిదానంగా ఆలోచించి, “ఈ మొసలికి శుక్లాలు కాదు. అంధత్వమే వస్తోంది.
వారసత్వం అయి ఉండవచ్చు.” అంది. అదివిన్న మొసలికి కళ్ళు తిరిగాయి.
ఏడు తరాలు వెనక్కి వెళ్లి ప్రయత్నం చేసింది. కాని ఉపయోగం లేక పోయింది.
ఆఖరికి విసుగెత్తి, తలబాదుకుంటూ “వైద్యరాజా! వారంతా మురికి నీళ్ళలో కలిసిపోయారు. ఈ అంధత్వం నుంచి బైటపడే మార్గం చెప్పు.” అంది.
అప్పుడు గ్రద్ద కోతి వైపు చూస్తూ ఇలా అంది.
“మిత్రమా! నీకు ఈ మొసలి తెలుసు. నువ్వు నాకు తెలుసు.
నాకైతే ఈ రోగానికి మందు ఇవ్వాలని ఉంది.
నువ్వు ఈ మొసలి కళ్ళు తెరిచి ఉండేలా రెప్పలు నీ చేతులతో పట్టుకో!
ఈ లోగా నేను కాకి మలంలో ఒంటి లద్దె కలిపి లేపనం తయారు చేస్తాను.
ఆ లేపనాన్ని మొసలి కంటిలో వేయాలి. కొంచెం బాధగా ఉంటుంది.
కాని ఓర్చుకోవాలి. తొంభై తొమ్మిది పాళ్ళు చూపు తిరిగి వస్తుంది.
ఆ పైన భగవంతుడు ఉన్నాడు. మనం పశు ప్రయత్నం మాత్రం చేయగలం.”
అది విని కోతి తన చేతులతో మొసలి కళ్ళు మూయకుండా పట్టుకుంది.
చెట్టు కొమ్మతో గోళ్ళు శుభ్రం చేసుకుని గ్రద్ద మందు కలపడానికి వెళ్ళింది.
![]()

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.



